దుబ్బాక, జనవరి 6 : మల్లన్నసాగర్ కాల్వల ద్వారా నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీరందించి దుబ్బాకను ఆకుపచ్చగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. దుబ్బాక మల్లన్నసాగర్ ఉపకాల్వల నిర్మాణంపై శనివారం సిద్దిపేట కలెక్టరేట్లో అడిషనల్ జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గంలో మల్లన్నసాగర్ ప్రాజెక్టు నుంచి ఉప్పరపల్లి, రామాయంపేట సాగునీటి ప్రధాన కాల్వలకు సంబంధించిన ఉపకాల్వల నిర్మాణం వేగవంతం చేయాలన్నారు. త్వరగా ఉపకాల్వల నిర్మాణం పూర్తి చేసి రైతులకు సాగు నీరందించాలని సూచించారు. పలుచోట్ల రెవెన్యూ పరమైన సమస్యలు ఉన్నాయని, వాటిని వెంటనే పరిష్కరించాలని అధికా రులను ఆదేశించారు. కాల్వల నిర్మాణంతో భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం అందించాలని చెప్పారు. కాల్వల నిర్మాణంలో రెవెన్యూ, నీటిపారుదల శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా పనులు చేపట్టాలన్నారు. రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందన్నారు. కాళే శ్వరం, మల్లన్నసాగర్ ప్రాజెక్టులు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. సాగునీటి కష్టాలను శాశ్వతంగా పరిష్కరించిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు. మల్లన్నసాగర్తో నియోజకవర్గంలో బీడు భూములు పచ్చని పంట పొలాలుగా మారాయని గుర్తుచేశారు. సమావేశంలో నీటిపారుదల శాఖ ఎస్ఈ వేణుబాబు, ఆర్డీవో రమేశ్బాబు, ఈఈ సాయిబాబా, డీఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి
దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో రెండు రోజుల నుంచి మహంకాళి మాత, బొడ్రాయయి విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు కొనసాగుతున్నాయి. శనివారం దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ దేవతల ఉత్సవాలను ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని సూచించారు. ఈ ఉత్సవాలతో వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగా పండాలని ఆకాంక్షించారు. ఉత్సవాలతో గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరం నెలకొందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ అయ్యగారి నర్సింహులు, ఎంపీపీ సంధ్యా రవీందర్, వైస్ ఎంపీపీ శేఖర్రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు బండారు దేవేందర్, సర్పంచుల ఫోరం అధ్యక్షులు పూజితావెంకట్రెడ్డి, మాజీ ఎంపీటీసీ సత్యం, నాయకులు చంద్రారెడ్డి, రవీందర్, వాసుదేవరెడ్డి, తాలరి నాగరాజు, గ్రామస్తులు పాల్గొన్నారు.