సదాశివపేట, ఏప్రిల్ 6: రాష్ట్రంలో ప్రజలందరి కళ్లు బాగుండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన కంటి వెలుగు కార్యక్రమం 50 రోజులు పూర్తి చేసుకుని కోటి మందికి పరీక్షలు నిర్వహించడం గొప్ప విషయమని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. గురువారం సదాశివపేట పట్టణానికి విచ్చేసిన మంత్రి ఎంపీపీ కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ, రూ. 25 కోట్ల ఎస్డీఎఫ్ నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, పట్టణంలో బస్తీ దవాఖానను ప్రారంభించారు. ఓ ప్రైవేటు కళాశాలలో ఏర్పా టు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని పరిశీలించి కళ్లద్దాలు అందజేశారు. కంటివెలుగు కార్యక్రమం దిగ్విజయంగా 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా కలెక్టర్ శరత్కుమార్, రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్, జడ్పీచైర్పర్సన్ మంజుశ్రీతో కలిసి కేక్ కట్చేసి బెలూన్లు ఎగురవేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ‘కంటి వెలుగు’ రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజల మన్ననలు, ప్రశంసలు అందుకుని సువర్ణాధ్యాయాన్ని లిఖించిందని గుర్తు చేశారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 250 కోట్లు కేటాయించడంతో పాటు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు 950 మంది కొత్త డాక్టర్లను నియమించిందన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు పర్యవేక్షించి అభినందించడంతో వారి రాష్ర్టాల్లోనూ ఇలాంటి పథకాలు అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పడం గొప్ప విషయమన్నారు. ప్రతిపక్ష నాయకులు సైతం కంటి వెలుగును మెచ్చుకోవడం హర్షణీయమన్నారు. కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ దవాఖానల్లో వైద్య సేవలు అందించేందుకు జిల్లా కేంద్రం సంగారెడ్డిలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేశామన్నారు. 84శాతం సాధారణ ప్రసవాలు జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానలో జరపడం అభినందనీయమన్నారు. ఈ నెల 16న సంగారెడ్డిలో న్యూట్రీషన్ కిట్ ప్రారంభిస్తామన్నారు. అందుకోసం అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి హరీశ్రావు వైద్యాధికారులను ఆదేశించారు.
ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలు : మంత్రి హరీశ్రావు
ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ ఫలాలు పార్టీలకతీతంగా ప్రతి ఇంటికీ చేరుతున్నాయని మంత్రి హరీశ్రావు అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందుతాయని, మేనిఫెస్టోలో పొందుపర్చని పథకాలు కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, రైతుబీమా, ఆసరా పింఛన్లు, ఆరోగ్యలక్ష్మి, కేసీఆర్ కిట్, అమ్మఒడి పథకాలు అమలు చేయడంతో ప్రతి ఇంటిలో ఏదో ఒక పథకం ద్వారా లబ్ధిపొందుతున్నారని గుర్తు చేశారు. అందుకే, సీఎం కేసీఆర్ని కుటుంబంలో ఒకరిగా చూసుకోవడంతో పాటు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ వెంటే ఉంటామని ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారన్నారు. మహిళలకు ప్రత్యేకంగా సంక్షేమ పథకాలలో పెద్దపీట వేస్తూ రాష్ట్రంలోనే పైలెట్ ప్రాజెక్టుగా షీ క్యాబ్స్ను అమలు చేసి జిల్లాలో 18 మంది మహిళా డ్రైవర్లకు కార్లు పంపిణీ చేసిన ఘనత తెలంగాణ సర్కార్దేనని అన్నారు. అలాగే, మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉన్న ప్రతి ఒక్కరికీ వడ్డీలేని రుణాలు అందజేసి బ్యాంకింగ్ రంగంలో మహిళలదే ప్రధాన పాత్రగా చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో వైద్యారోగ్యశాఖ కమిషనర్ శ్వేతా మహంతి, జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి, కలెక్టర్ డాక్టర్ శరత్, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్, మున్సిపల్ చైర్ పర్సన్ పిల్లోడి జయమ్మ, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్, కౌన్సిలర్లు పిల్లోడి విశ్వనాథం, పులిమామిడిరాజు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
పైసా ఖర్చు లేకుండా పరీక్షలు
పైసా ఖర్చు లేకుండా మీ ప్రాంతానికే వచ్చి కంటి పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిందని మంత్రి తెలిపారు. ఇప్పటి వరకు 2339 వార్డుల్లో 48శాతం ప్రజలకు అన్ని రకాల కంటి పరీక్షలు చేశామన్నారు. కోటి మందిలో 29లక్షల మందికి పలు రకాల సమస్యలు ఉన్నట్లు వైద్య పరీక్షల్లో తేలిందన్నారు. అలాంటి వారికి వైద్య బృందం పరీక్షలు నిర్వహించి సమస్యను పరిష్కరిస్తారని తెలిపారు. అత్యధికంగా 53 లక్షల మంది మహిళలు కంటి పరీక్షలు చేయించుకున్నారని, 47 లక్షల మంది పురుషులు కంటి చికిత్సలు చేయించుకున్నారని, అవసరమున్న వారికి వైద్యుల సూచనల మేరకు అక్కడికక్కడే అద్దాలు పంపిణీ చేస్తున్నారని మంత్రి ప్రకటించారు. మరో 50 రోజుల్లో మిగతా ప్రజలందరికీ శిబిరాల్లో అన్ని రకాల పరీక్షలు చేస్తారన్నారు.
ఇంటింటికీ భగీరథ జలాలు…
ఉమ్మడి రాష్ట్రంలో తాగునీటి కోసం ప్రతి ఏడాది వేసవిలో మహిళలు బిందెలు పట్టుకుని రోడ్డుపైకొచ్చిన పరిస్థితులను గుర్తించి ఇంటి ముందే నల్లాతో నీళ్లు పట్టుకునే విధంగా ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ జలాలు అందించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. తెలంగాణ ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు అవుతుతుందని, ఇప్పటివరకు తాగునీటి కోసం ఏ ఒక్కరూ రోడ్లపైకి వచ్చిన పరిస్థితి కనిపించలేదన్నారు.