Narsapur : దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదమైందని, ఎన్పీఆర్డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అడివయ్య తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు నశించాలని, నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఉపాధి హామీ చట్టాన్ని పరిరక్షించాలని రైతాంగ సమస్యను పరిష్కరించాలని కోరారు. గురువారం నర్సాపూర్ పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో సమ్మె సందర్భంగా చిల్డ్రన్స్ పార్క్ నుండి నర్సాపూర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎం. అడివయ్య మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న 29 చట్టాలను రద్దుచేసి తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థను కారు చౌకగా కార్పొరేట్ శక్తులకు అమ్ముతూ దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని ఉపాధి హామీ చట్టాన్ని కాపాడాలని వీజీ రాంజీ పథకాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులకు వ్యతిరేకంగా తెచ్చిన విత్తన. విద్యుత్ సవరణ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
గ్రామపంచాయతీ కార్మికులు, అంగన్వాడీ వర్కర్స్, వివోఏ, ఆశ వర్కర్స్, మధ్యాహ్నం భోజనం, భవన నిర్మాణ,హమలి కార్మికులకు కనీస వేతనం రూ.26,000 నిర్ణయించాలని కోరారు.సెర్ఫ్ ద్వారా ఆశాలకు ఫిక్స్డ్ వేతనాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీ కార్మికులకు మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, మధ్యాహ్నం భోజనం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఎం.అడివయ్య కేంద్రానికి సూచించారు.
హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, భావన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు పరిరక్షించాలని, పెండింగ్లో ఉన్న క్లెయిమ్స్ విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మికులపై అధికారుల వేధింపులను అరికట్టాలని, పిఎఫ్, ఈఎస్ఐ ప్రమాద బీమా సౌకర్యం ప్రతి కార్మికులకు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కడారి నాగరాజు, AITUC జిల్లా కార్యదర్శి నందం, BSP పార్టీ నాయకులు జనార్దన్ గౌడ్, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షులు అన్నపూర్ణ, నాయకులు నర్సింలు, షుకూర్, లింగం, చెంద్రయ్య, నాగరాణి, రాములు, రుబ్లీ తదితరులు పాల్గొన్నారు