రామాయంపేట : భారీ వర్షాలతో నిండిన చెరువుల వద్ద ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయనున్నట్లు రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్గౌడ్, కమిషనర్ శ్రీనివాసన్ తెలిపారు. బుధవారం పట్టణంలోని కొచ్చెరువు, హనుమచెరువు, వెంకన్నగారి చెరువు, మల్లెచెరువు, సర్వాయికుంట, బాలసముద్రం, పాండు చెరువులను వారు పరిశీలించారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ దశాబ్దాల కాలంగా నిండని చెరువులు ప్రస్తుతం నిండి అలుగులు పారుతున్నాయని అన్నారు.పట్టణ ప్రజలు చెరువుల వద్దకు వెళ్లకుండా వెళ్లినా జాగ్రత్తగా వెళ్లాలన్నారు. లేకుంటే ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంటుందన్నారు.
మూడు దశాబ్దాలుగా నీరులేని పాండు చెరువు సైతం అలుగు పారుతుందని అన్నారు.రామాయంపేట పట్టణ ప్రజలకు దగ్గరలోనే ఉన్న చెరువుల వద్దకు వెళ్లవద్దన్నారు. చైర్మన్ వెంట మాజీ జడ్పీటీసీ సరాఫ్ యాదగిరి, కౌన్సిలర్ దేమె యాదగిరి టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు గజవాడ నాగరాజు, పీఏసీఎస్ చైర్మన్ బాదె చంద్రం, మల్యాల కిషన్, టీఆర్ఎస్ నాయకులు చంద్రపు కొండల్రెడ్డి, దేవుని రాజు, కన్నపురం కృష్ణాగౌడ్, మెట్టు యాదగిరి ఉన్నారు.