సంగారెడ్డి కలెక్టరేట్, మార్చి 2 : జిల్లాలో మత్స్య సహకార సంఘాల్లో కొత్త సభ్యులను చేర్చడాన్ని వేగవంతం చేయాలని కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులకు సూచించారు. గురువారం క్యాంపు కార్యాలయంలో మత్స్యశాఖ అధికారులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల అధికారులతో ఆయా శాఖల్లో వివిధ పథకాలకు సంబంధించిన పురోగతిపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మత్స్య సహకార సంఘాల్లో కొత్త సభ్యులను చేర్చడాన్ని వేగవంతం చేయాలన్నారు. ప్రస్తుతం ఉన్న సంఘాల్లో సుమారు 4,930 మంది కొత్త సభ్యులు చేరడానికి అవకాశం ఉన్నందున ఆమేరకు లక్ష్యాన్ని పూర్తి చేయడంలో సంబంధిత అధికారులు చొరవ చూపాలన్నారు. నీటి వనరులు ఉన్న చోట ప్రత్యేకంగా క్యాంపు నిర్వహించి సభ్యత్వం పొందేలా మత్స్యకారులను ప్రోత్సహించాలన్నారు. క్షేత్ర పరిధిలో పనిచేసి ఈ నెల 15లోగా లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు.
జిల్లాలోని దళిత బంధు లబ్ధ్దిదారులను పర్యవేక్షించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. లబ్ధిదారులు ఎంచుకున్న యూనిట్తో ఏవిధంగా అభివృద్ధి చేందుతున్నారని, ఆయా యూ నిట్లు ఏవిధంగా కొనసాగుతున్నాయని, వారి జీవన స్థితిగతులు ఏవిధంగా ఉన్నాయనే విషయాలనూ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని చెప్పారు. వారికి అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రామాచారికి సూచించారు. ఎస్సీ నియోజకవర్గాలు జహీరాబాద్, అందోల్లకు సంబంధించి 920 మినీ డెయిరీ యూనిట్లు అందించడం లక్ష్యం కాగా, ఇప్పటివరకు 657 ప్రతిపాదనలు వచ్చాయని, 423 యూనిట్లు మంజూరు చేయగా, 105 యూనిట్లకు సబ్సిడీ విడుదల అయిందని కలెక్టర్ అన్నారు. 54 యూనిట్ల గ్రౌండింగ్ పూర్తయిందన్నారు. మిగతా 263 యూనిట్లకు బ్యాం కులు కన్సెంట్ ఇచ్చేలా చూడాలని, కన్సెంట్ ఇవ్వని పక్షంలో శ్రీనిధి రుణాలకు ప్రతిపాధించాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీకి సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి, జిల్లా మత్స్యశాఖ ఏడీ సతీశ్ కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రామాచారి, ఎస్టీ సంక్షేమ శాఖ అధికారి ఫిరంగి, బీసీ సం క్షేమ శాఖ అధికారి జగదీశ్ తదితరులు పాల్గొన్నారు.