ఝరాసంగం, మార్చి 8: తెలంగాణ రాష్ట్రంలో శైవ క్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిన ఝరాసంగం కేతకీ సంగమేశ్వరాలయంలో నవాహ్నిక మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం తెల్లవారుజాము నుంచే దేవాలయానికి భక్తులు పోటెత్తారు. తెలుగు రాష్ర్టాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. భక్తులు అమృత గుండంలో స్నానాలు ఆచరించి గర్భగుడిలోని పార్వతీ సమేత సంగమేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శివదీక్షా పరులు 41 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో చేపట్టిన శివ దీక్ష విరమించి మొక్కులు చెల్లించుకున్నారు.
ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమాలు నిర్వహించారు. జహీరాబాద్ డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్ రావు, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, సివిల్ కోర్టు జూనియర్ జడ్జి అనూష, సంగారెడ్డి అదనపు ఎస్పీ సంజీవరావు, ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ దర్శించుకుని రుద్రాభిషేకం చేశారు.స్వామి వారి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో మాజీ మంత్రి చంద్రశేఖర్, మాజీ చైర్మన్లు మఠం భిక్షపతి, నరోత్తం, ఉమాకాంత్ పాటిల్, ఎంపీటీసీ రజిని ప్రియ సంతోష్ పాటిల్, కాంగ్రెస్ పార్టీ సినియర్ నాయకులు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి, గిరిధర్ రెడ్డి, హన్మంత్రావు పాటిల్, నరేశ్గౌడ్ పాల్గ్గొన్నారు.