దుబ్బాక టౌన్, ఆగస్టు 6: విప్లవాత్మకమైన కార్యక్రమాలతో దేశంలోనే తెలంగాణ చేనేత రంగం ఆదర్శంగా నిలుస్తున్నది. చేనేత పరిశ్రమ గత పాలకుల నిర్లక్ష్యానికి గురికాగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేనేతల జీవితాల్లో వెలుగులు నింపింది. సీఎం కేసీఆర్ అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర చేనేత జౌళిశాఖ మంత్రి కేటీఆర్ కొన్నేండ్లుగా చేనేత పరిశ్రమకు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. అప్పుల ఊబిలో చిక్కుకొని ఆత్మహత్యల పాలవుతున్న చేనేత కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం 2010 నుంచి రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తున్నది. వృత్తిపై ఆధారపడ్డ నేతన్నలను గుర్తిస్తూ మగ్గాలను జియోట్యాగ్ చేసింది. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా బీఆర్ఎస్ సర్కారు పథకాలను అందిస్తున్నది. చేనేత వస్ర్తాలకు మంచి ఆదరణ కలిగించేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు విధిగా చేనేత వస్త్రాలు ధరించాలన్న సూచనలతో కార్మికులకు ఉపాధి దొరుకుతున్నది. కార్మికులు సైతం ప్రస్తుతం మార్కెట్కు అనుగుణంగా వస్ర్తాలు తయారు చేస్తూ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన చేనేత చీరల ప్రదర్శనకు దుబ్బాకలో తయారుచేసిన లెనెన్ చీర ఎంపిక కావడం గమనార్హం.రాష్ట్ర బడ్జెట్లో సైతం చేనేత జౌళిశాఖకు పెద్దఎత్తున నిధులు కేటాయించి పరిశ్రమను ఆదుకునేందుకు తెలంగాణ సర్కారు కృషి చేస్తున్నది.
ఆర్థిక భరోసా కల్పించిన ‘చేనేతకు చేయూత’..
ఉమ్మడి పాలకుల వివక్షతో ఆకలి చావులు, ఆత్మహత్యలకు బలైన చేనేత కార్మికులను ఆర్థికంగా ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం కంకణం కట్టుకున్నది. దుబ్బాక ప్రాంతంలోనే సుమారు వంద మందికి పైగా కార్మికులు ఆత్మహత్యలు, ఆకలిచావులకు బలైన విషయం తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా కార్మికులకు థ్రిప్ట్ (పొదుపు) పథకాన్ని 2017లో ప్రవేశపెట్టి సహకారేత రంగంలో ఉన్న 75 శాతం చేనేత కార్మికులకు వర్తింపజేసేలా పథకాన్ని రూపొందించింది. 18 ఏండ్లు నిండిన ప్రతి చేనేత కార్మికుడికి ఈ పథకం వర్తించేలా నిబంధనలు ఖరారు చేసింది. కార్మికుడు నెలలో సంపాదించిన వేతనంతో 8 శాతం మొత్తాన్ని బ్యాంకులో జమ చేస్తే ప్రభుత్వం 16 శాతం జమ చేసి కార్మికుడికి అందిస్తున్నది. ఈ పథకంలో చేనేత కార్మికుడికి నెలకు రూ.18 వేల వేతనం అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. జిల్లాలో 545 జియోట్యాగ్ చేసిన మగ్గాలు ఉండగా, 498 మంది కార్మికులు థ్రిప్ట్ పథకంలో కొనసాగుతున్నారు. జిల్లాలో వేలాది మంది కార్మికులు ప్రైవేట్గా మాస్టర్స్ వీవర్స్ వద్ద పని చేస్తున్నారు.
నేతన్నకు ‘బీమా’ ధీమా
వ్యవసాయ రంగం తర్వాత పెద్దదైన చేనేత పరిశ్రమలో పనిచేసే కార్మికులకు బతుకు భరోసా కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేనేత బీమాను అమలుచేయాలని సంకల్పించింది. రైతులకు రైతు బీమా తరహాలోనే చేనేత కార్మికులకు చేనేత బీమా అందజేస్తున్నది. 2021 ఆగస్టు7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కార్మికులకు చేనేత బీమాను కార్మికులకు వర్తింపజేస్తుండగా జిల్లాలో సుమారు 2వేలకు పైగా కార్మికులకు ఈ పథకంతో లబ్ధిచేకూరుతున్నది.
చేనేత మిత్రతో రాయితీ…
రంగులు, రసాయనాలు, యారన్ ధరలు పెరిగాయి. దీంతో చేనేతకు ఆదరణ ఉన్నప్పటికీ కార్మికులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ ప్రభుత్వం రంగులు, రసాయనాలు, యారన్పై 40 శాతం సబ్సిడీ ఇచ్చి కార్మికులను మరింత ఆదుకునేందుకు ముందుకు వచ్చింది.కార్మికులకు గుర్తింపు నెంబర్ కేటాయించి దళారుల ప్రమేయం లేకుండా సబ్సిడీలు, రుణాలు, పథకాలు కార్మికుడికే అందేలా చర్యలు చేపట్టారు.
చేనేత వస్ర్తాలు ధరించేలా ప్రచారం…
చేనేత పరిశ్రమను కాపాడేందుకు కేవలం బడ్జెట్లో నిధుల కేటాయింపు, రుణాలు ఇవ్వడంతోనే సరిపోదని తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్, చేనేత జౌళీశాఖ మంత్రి కేటీఆర్ మార్కెట్లోపరిశ్రమకు ఆదరణ కల్పించాలని సంకల్పించారు. ఎక్కువ మంది చేనేత వస్ర్తాలు ధరించేలా చొరవ తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ప్రతి సోమవారం ప్రభుత్వ అధికారులు విధిగా చేనేత వస్ర్తాలు ధరించాలని సూచించారు.
చేనేత దినోత్సవం ఇలా…
ప్రతి సంవత్సరం ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సంవత్సరం 7 నుంచి 14వ తేదీ వరకు హైదరాబాద్లో చేనేత వస్త్ర ప్రదర్శన నిర్వహించనున్నారు. సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో రాష్ట్రంలోని 7500 మంది నేతన్నలతో రాష్ట్ర స్థాయి సంబురాలు నిర్వహిస్తుండగా సిద్దిపేట జిల్లా నుంచి 250 మంది కార్మికులు హాజరుకానున్నారు.
అవసరాలకు పొదుపు ఎంతో ఉపయోగం
గతంలో ఏ ప్రభుత్వాలు చేనేత కార్మికులకు పొదుపు పథకాలు వర్తింపచేయలేదు. తెలంగాణ సర్కారు చేపట్టిన చేయూత పథకంలో చేరి నెలనెలా డబ్బులను జమ చేసుకుంటున్నా. దుబ్బాకలో మంత్రి కేటీఆర్ కూడా ఈ పథకం గురించి మాకు వివరంగా చెప్పారు. అవసరాలకు ఇలాంటి పథకాలు కార్మికులకు ఎంతో గుండె ధైర్యాన్ని ఇస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి మరిన్ని పథకాలు అందించాలి. సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలి.
– వీరబత్తిని బాల్రాజు, చేనేత కార్మికుడు
చేనేత కుటుంబాల్లో ధీమా..
గతంలో ఏ ప్రభుత్వాలు చేనేత కార్మికుల కోసం ఎలాంటి పథకాలు అమలుచేయలేదు. కార్మికులు చేనేత రంగాన్ని నమ్ముకోవడంతో ప్రభుత్వం అందించే బీమాతో చేనేత కుటుంబాలు ఇక ధీమాగా ఉంటాయి. అవసరాలకు చేనేత చేయూత, చేనేత బీమా వంటి పథకాలు కార్మికులకు ఎంతో గుండె ధైర్యాన్ని ఇస్తాయి.
-గవ్వల సాంబయ్య, చేనేత కార్మికుడు
చేనేత రంగ అభివృద్ధికి కృషి
రాష్ట్ర ప్రభుత్వం చేనేత రంగ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నది. రైతుబీమా తరహాలో చేనేత బీమా పథకాన్ని తీసుకువచ్చి కార్మికుల్లో మనోధైర్యాన్ని కల్పించింది. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల పట్ల కార్మికులు సంతృప్తిగా ఉన్నారు. ఇప్పటికే అమలవుతున్న చేనేతకు చేయూత, చేనేత మిత్ర, బీమా పథకాల ద్వారా కార్మికులకు ప్రభుత్వం అండగా నిలిచింది. సిద్దిపేట జిల్లాలో సుమారు ఐదువేల మంది కార్మికులు ఉండగా 545 మగ్గాలు ఉన్నాయి. జిల్లాలో 11 చేనేత సంఘాలు పని చేస్తుండగా సిద్దిపేట, దుబ్బాక, హుస్నాబాద్ తదితర చేనేత సొసైటీల్లో కార్మికులు వస్ర్తాలను అధునాతన రీతిలో తయారు చేస్తున్నారు.
-సంతోష్కుమార్, ఏడీ, సిద్దిపేట జిల్లా