నర్సాపూర్, జనవరి 1 : పేకాట ఆడుతున్న 11 మందిని పోలీసులు అరెస్టు చేసిన సంఘటన మండల పరిధిలోని నత్నాయిపల్లి గ్రామ శివారులో ఆదివారం చోటుచేసుకుంది. సీఐ షేక్లాల్ మధార్ తెలిపిన వివరాల ప్రకా రం.. మండల పరిధిలోని నత్నాయిపల్లి గ్రామ శివారు అటవీ ప్రాంతంలో కొంత మంది పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు అర్థ్ధరాత్రి 12.30 గంటల సమయంలో తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా 11 మంది పేక ఆడు తూ పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి రూ.1,14,130 నగదు, 12 మొబైల్ ఫోను, చార్జింగ్ లైట్, పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా సీఐ షేక్లాల్ మధార్ మాట్లాడుతూ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే ఊపేక్షించేది లేదని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా పేక ఆడితే సమాచారమందించాలని కోరారు. తనిఖీలో సీఐ షేక్లాల్ మధార్, ఎస్సై గంగరాజు, కానిస్టేబుళ్లు రాము, చెన్నయ్య, భిక్షపతి, హోంగార్డులు పోచయ్య, నాగరాజు పాల్గొన్నారు.