నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి
టీఆర్ఎస్ కార్యకర్త కుటుంబానికి బీమా చెక్కు అందజేత
నర్సాపూర్, ఏప్రిల్11: సీఎం కేసీఆర్ ప్రకటించిన ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఉచిత శిక్షణను పోలీస్ శాఖతో కలుపుకొని నర్సాపూర్లో అందించనున్నట్లు ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీ నుంచి ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయన్నారు. నేడు శిక్షణ పొందే అభ్యర్థుల ఎంపిక కార్యక్రమానికి కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోతున్నానని ఆయన ప్రకటించారు. శిక్షణకు కావాల్సిన సహాయ సహకారాలను అందిస్తానన్నారు. జిల్లా ఎస్పీ ప్రోద్బలంతో నర్సాపూర్లో శిక్షణ తరగతులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి సహకరిస్తున్న డీఎస్పీ, సీఐ, ఎస్సై, మిగతా సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
శివ్వంపేటలో..
శివ్వంపేట, ఏప్రిల్ 11: మండలంలోని మగ్దుంపూర్ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు సోము నర్సింలు విద్యుత్ షాక్తో మృతిచెందాడు. దీంతో పార్టీ బీమా ద్వారా మంజూరైన రూ.2 లక్షల చెక్కును మండలాధ్యక్షుడు రమణాగౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మదన్రెడ్డి ఆయన నివాసంలో మృతుడి కుటుంబీకులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ వెంకటరాంరెడ్డి, సర్పంచ్ సోము అశోక్ పాల్గొన్నారు.