నెరవేరిన ఎమ్మెల్యే మదన్రెడ్డి సంకల్పం
సీఎం కేసీఆర్, జిల్లా మంత్రి హరీశ్రావు సహకారంతో ఏర్పాటు
తెలంగాణ వచ్చాక మొట్టమొదటి బస్డిపో
హర్షం వ్యక్తం చేస్తున్న నియోజకవర్గ ప్రజలు
నేడు ప్రారంభించనున్న మంత్రులు హరీశ్రావు, పువ్వాడ అజయ్కుమార్
భారీ బహిరంగ సభ.. తరలిరానున్న పార్టీ శ్రేణులు, ప్రజలు
సీఎం కేసీఆర్, ఆర్థిక, వైద్యారోగ్యల శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సహాయ సహకారాలతో నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలకు ఆర్టీసీ బస్సు డిపో అందుబాటులోకి రానున్నది. 1998లో ఐదు ఎకరాల స్థలంలో డిపో ఏర్పాటుకు శంకుస్థాపన చేసినప్పటికీ, వివిధ కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. తెలంగాణ వచ్చాక 2018లో సీఎం కేసీఆర్ రూ.10 కోట్లు కేటాయించారు. అదే సమయంలో ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పట్టడం, ఆ తర్వాత కరోనా మహమ్మారి కారణంగా పనులు ముందుకు సాగలేదు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే మదన్రెడ్డి పలుమార్లు మంత్రి హరీశ్రావుకు విన్నవించగా ఆర్టీసీ అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో ఎట్టకేలకు నిర్మాణం పూర్తైంది. నేడు మంత్రులు హరీశ్రావు, పువ్వాడ అజయ్కుమార్ డిపోను ప్రారంభించనుండగా, 15 బస్సులతో 50 మంది సిబ్బందిని నియమించారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ప్రత్యేక రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన మొట్టమొదటిదిగా నర్సాపూర్ డిపో చరిత్రలో నిలిచిపోనున్నది.
నర్సాపూర్, జూన్7: నర్సాపూర్ నియోజకవర్గ ప్రజల కల నెరవేరింది. నిర్మాణం పూర్తి చేసుకున్న ఆర్టీసీ డిపో ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యింది. ఈ డిపో నిర్మాణానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎమ్మెల్యే మదన్రెడ్డి సంకల్పం ముందు చిన్నయాయనే చెప్పవచ్చు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సహకారంతో బస్డిపో రూపుదాల్చుకున్నది. కరోనా కష్టకాలాన్ని దాటుకుని డిపో నిర్మాణం చేపట్టడంలో ఎమ్మెల్యే కృషి ఎనలేనిది. కాగా, పూర్తిస్థాయిలో నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ డిపోను నేడు మంత్రులు హరీశ్రావు, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించనున్నారు.
బస్డిపోకు శ్రీకారం..
1998లో టీడీపీ ప్రభుత్వంలో రవాణాశాఖ మంత్రిగా ఉన్న కేసీఆర్ నర్సాపూర్లో ఆర్టీసీ డిపో కోసం 5 ఎకరాల స్థలంలో శంకుస్థాపన చేశారు. అప్పటి రాజకీయ పరిస్థితుల కారణంగా డిపో నిర్మాణం నోచుకోలేకపోయింది. ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రాగా, నర్సాపూర్ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రిగా ఉన్న సునీతాలక్ష్మారెడ్డి కృషితో అప్పటి రవాణాశాఖ మంత్రి చిన్న డిపో ఏర్పాటుకు హామీ ఇచ్చారు. అది కూడా అమలుకు నోచుకోలేదు. ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్రంలో ఎమ్మెల్యే మదన్రెడ్డి డిపోను తప్పకుండా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. 2018లో సీఎం కేసీఆర్ మెదక్కు వచ్చిన సందర్భంగా మంత్రి హరీశ్రావు ప్రత్యేక చొరవతో డిపో విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. డిపో నిర్మాణానికి సీఎం కేసీఆర్ ఆమోదం తెలుపుతూ అప్పటికప్పుడు రూ.10 కోట్లు మంజూరు చేశారు. దీంతో 2018 జూలైలో అప్పటి రవాణాశాఖ మంత్రి మహేందర్రెడ్డి, మంత్రి హరీశ్రావు ఎమ్మెల్యే మదన్రెడ్డి ఆధ్వర్యంలో బస్డిపోకు శంకుస్థాపన చేశారు. ఆ కొన్ని రోజులకే ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టడంతో పనులు ప్రారంభానికి ఏడాదిపైన సమయం పట్టింది. ఆ తర్వాత పనులు ప్రారంభించినా కరోనా కారణంగా మళ్లీ నిలిచిపోయాయి. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత ఎమ్మెల్యే మదన్రెడ్డి డిపో విషయమై ఉన్నతాధికారులతో పాటు మంత్రి హరీశ్రావుతో పలుమార్లు చర్చించారు. డిపోను త్వరగా పూర్తి చేయాలని మంత్రి ఆర్టీసీ ఉన్నతాధికారులకు సూచించారు. ఎట్టకేలకు అందరి సహాయ సహకారాలతో డిపో నిర్మాణం పూర్తి చేసుకొని ప్రారంభోత్సవానికి ముస్తాబైంది.
ప్రారంభానికి సిద్ధం..
నర్సాపూర్లో నేడు ప్రారంభించనున్న ఆర్టీసీ డిపోలో అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఈ ప్రారంభోత్సవానికి రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ హాజరుకానున్నారు. 15 బస్సులతో 50 మంది సిబ్బందితో డిపో ప్రారంభంకానున్నది. నియోజకవర్గ ప్రజల చిరకాల కోరికైన బస్డిపో ప్రారంభం నేపథ్యంలో ఎమ్మెల్యే మదన్డ్డి భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు.
తీరనున్న ఇక్కట్లు..
నర్సాపూర్లో నిర్మించిన బస్డిపోతో నియోజకవర్గ ప్రజల ఇబ్బందులు తొలగనున్నాయి. దూరప్రాంతాలకు వెళ్లాలనుకుంటే వేరే ప్రాంతాలకు వెళ్లి బస్సులు ఎక్కాల్సి వచ్చేది. ఇక విద్యార్థులు పాఠశాలలకు, కళాశాలలకు రావాలంటే నరకయాతన పడేవారు. గ్రామాలకు బస్సు సౌకర్యం సరిగ్గా లేకపోవడంతో ప్రయాణికులు ఆటోలను ఆశ్రయించాల్సి వచ్చేది. బస్డిపో ఏర్పాటు తర్వాత ఈ సమస్యలన్నీ తొలిగిపోనున్నాయి. బస్డిపో నిర్మాణంతో నియోజకవర్గ ప్రజల సంతోషానికి అవదులు లేకుండా పోయాయి.
ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే..
నేడు నర్సాపూర్ పట్టణంలో నూతనంగా నిర్మించిన ఆర్టీసీ బస్డిపోను ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించనున్నారు. కార్యక్రమ ఏర్పాట్లను ఎమ్మెల్యే మదన్డ్డి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్డిపో ప్రారంభోత్సవం మధ్యాహ్నం 12 గంటలకు ఉంటుందని, ఆ తర్వాత బహిరంగ సభను ఏర్పాటు చేశామని ఈ కార్యక్రమాలకు నియోజకవర్గ ప్రజలందరూ అధిక సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. నూతనంగా నిర్మించిన పీఏసీఎస్ భవనం ప్రారంభం, పోస్ట్ ఆఫీస్ సమీపంలో రూ.కోటితో నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణానికి మంత్రులు భూమిపూజ చేయనున్నారని తెలిపారు. ఎమ్మెల్యే వెంట రాష్ట్ర లేబర్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ దేవేందర్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, మున్సిపల్ చైర్మన్ మురళీయాదవ్, కౌన్సిలర్ లతారమేశ్యాదవ్, జడ్పీ కో-ఆప్షన్ మెండర్ మన్సూర్, ఏఎంసీ చైర్మన్ హబీబ్ఖాన్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు చంద్రశేఖర్, కౌన్సిలర్ యాదగిరి, రాంచందర్, టీఆర్ఎస్ నాయకులు అశోక్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
రోడ్ల పునరుద్ధరణకు రూ.35 కోట్లు..
నర్సాపూర్ నియోజకవర్గంలోని ఆయా మండలాల రోడ్ల పునరుద్ధరణకు సీఎం కేసీఆర్ రూ.35 కోట్లు మంజూరు చేశారని ఎమ్మెల్యే మదన్రెడ్డి పేర్కొన్నారు. నర్సాపూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో బీటీ రోడ్లు అధ్వానంగా మారడంతో సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లామని వెల్లడించారు. సీఎం కేసీఆర్ బీటీ రోడ్ల పునరుద్ధరణకు రూ.35 కోట్లు మంజూరు చేశారని, ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.
నా కల నెరవేరింది
నర్సాపూర్లో బస్డిపోను నిర్మించడం నా కల. అది నేటితో నెరవేరబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. బస్డిపో నిర్మాణంతో నియోజకవర్గ ప్రజల ప్రయాణ ఇబ్బందులు తొలగనున్నాయి. ఆర్టీసీ బస్డిపో నిర్మాణానికి సహకరించిన సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్రావు, అజయ్కుమార్కు ప్రత్యేక ధన్యవాదాలు.
– చిలుముల మదన్రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే
బస్డిపోతో ఇబ్బందులు తీరనున్నాయి..
నర్సాపూర్ మున్సిపాలిటీలో నూతనంగా నిర్మించిన బస్సుడిపోతో ప్రయాణికుల ఇబ్బందులు తీరనున్నాయి. ఎన్నో ఏండ్లుగా ప్రజలు కోరుకుంటున్న బస్డిపో నిర్మాణం పూర్తి కావడం సంతోషంగా ఉంది. దూర ప్రాంతాలకు వెళ్లాలంటే హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చేది. నేడు ఆ కష్టాలు తీరనున్నాయి. బస్సుడిపో నిర్మాణంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కూడా ప్రయాణం సులభతరం కానున్నది. బస్సుడిపో నిర్మాణానికి కృషి చేసిన ఎమ్మెల్యే మదన్రెడ్డికి ధన్యవాదాలు.
– కార్తీక్, నర్సాపూర్