నర్సాపూర్, నవంబర్4: నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డికి ముస్లిం మైనార్టీలు మద్దతుగా నిలిచి భారీ మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్తోనే ముస్లిం మైనార్టీల అభివృద్ధి సాధ్యమని ఆయన పేర్కొన్నారు. శనివారం నర్సాపూర్లోని ఓ ఫంక్షన్హాల్లో ఎమ్మెల్యే మదన్రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నర్సాపూర్ నియోజకవర్గ ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు. ముస్లిం మైనార్టీల అభివృద్ధి, సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్ద పీట వేశారన్నారు. 50 వేల మెజార్టీతో సునీతారెడ్డిని గెలిపించుకుంటామని ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి భరోసా ఇచ్చారు
బీఆర్ఎస్తోనే ముస్లిం మైనార్టీల అభివృద్ధి సాధ్యపడుతుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. శనివారం నర్సాపూర్లోని ఓ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే మదన్రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నర్సాపూర్ నియోజకవర్గ ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ప్రాణాన్ని ఫణంగా పెట్టి తెలంగాణ రాష్ర్టాన్ని తీసుకొచ్చారన్నారు. తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి నేటి వరకు రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు. ముస్లిం మైనార్టీల అభివృద్ధి, సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్ద పీట వేశారన్నారు. 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్, మిషన్ భగీరథ ద్వారా తాగునీరు, రైతుబంధు, రైతుబీమా, షాదీముఖారక్ తదితర పథకాలు తీసుకొచ్చి రాష్ర్టాన్ని అగ్రస్థానంలో సీఎం కేసీఆర్ నిలిపారన్నారు. 50 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో, తొమ్మిదేండ్ల టీడీపీ పాలనలో తెలంగాణ వెనకబడిపోయిందన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చాక రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకుపోతున్నదన్నారు. కాంగ్రెస్ పాలనలో హిందూ, ముస్లింలు తరుచూ గొడవలు పడేవారని, కాని నేడు అన్నదమ్ముల్లా కలిసిమెలసి ఉంటున్నారని పేర్కొన్నారు. మిలాద్ ఉన్ నబీ, వినాయక నిమజ్జనం ఒకే రోజు రావడంతో ముస్లిం మతపెద్దలు సామరస్యంతో ఆలోచించి పండుగను వాయిదా వేసుకున్నారన్నారు. రాష్ట్రంలో నెలకొన్న శాంతిభద్రతలకు ఇదే నిదర్శనమని వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ఎలాంటి గొడవలు లేకుండా రాష్ట్రం శాంతియుతంగా ఉన్నదన్నారు. ముస్లిం విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి సీఎం కేసీఆర్ ఎన్నో రెసిడెన్షియల్ పాఠశాలలు నెలకొల్పారన్నారు. పేద ముస్లిం విద్యార్థులు విదేశాల్లో చదువుకోడానికి రూ.20 లక్షల సాయం అందజేస్తున్నట్లు తెలిపారు.
ఇమామ్లను గౌరవించుకునేలా వారికి గౌరవ వేతనం కూడా ఇస్తున్నామన్నారు. షాదీముబారక్ పథకాన్ని తీసుకొచ్చి ముస్లిం ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ అండగా నిలిచారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నేటి వరకు రూ.2400 కోట్లు చెక్కుల రూపంలో అందజేశారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే ముస్లింలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందుతాయని భరోసానిచ్చారు. కాంగ్రెస్ అధికారంలో ఉండగా ఏ ఒక్కరికీ మంత్రి పదవి ఇవ్వలేదని, కేసీఆర్ పాలనలో ముస్లిం మైనార్టీలకు సముచిత స్థానం దక్కిందని వెల్లడించారు. కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆర్ఎస్ఎస్ భావాజాలాలు కలిగిన వ్యక్తి అని ఆరోపించారు. ఎమ్మెల్యే మదన్రెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించుకుంటామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినట్లు గుర్తుచేశారు. సోదరి సమానురాలైన బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డికి ముస్లింల మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. సునీతాలక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ముస్లింలను కోరారు.
50 వేల మెజార్టీతో గెలుపిస్తాం: ఎమ్మెల్యే మదన్రెడ్డి
నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డిని 50 వేల మెజార్టీతో గెలిపిస్తామని ఎమ్మెల్యే మదన్రెడ్డి వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలోనే ముస్లింలకు ఎంతో మేలు జరిగిందన్నారు. హిందూ ముస్లింలు అన్నదమ్ముల్లా కలిసి మెలసి ఉంటున్నామంటే, దానికి కారణం సీఎం కేసీఆర్ అని అన్నారు. నర్సాపూర్లో ముస్లింల గ్రేవ్ యార్డ్ కోసం 5 ఎకరాల స్థలాన్ని కేటాయించినట్లు తెలిపారు. ముస్లింలు కారు గుర్తుకు ఓటేసీ బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డిని గెలిపించాలని కోరారు.
ముస్లిం మైనార్టీలకు పెద్ద పీట ; నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి
సీఎం కేసీఆర్ ముస్లింల సంక్షేమానికి పెద్దపీట వేశారని నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. ఒకే వేదికపైకి ముస్లింలు ఇంత పెద్ద సంఖ్యలో తరలిరావడం చాలా సంతోషంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ ముస్లిం విద్యార్థులకు రెసిడెన్షియల్స్ స్థాపించి, వారి విద్యకు అండగా నిలిచారన్నారు. ఈ సారి కూడా ముస్లింలు బీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే మదన్రెడ్డి సహకారంతో పట్టణంలోని ముస్లింలకు గ్రేవ్ యార్డ్ కోసం 5 ఎకరాల స్థలాన్ని కేటాయించారన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ మైనార్టీ సెల్ సెక్రటరీ బాసిత్, జడ్పీ కో ఆప్షన్ మెంబర్ మన్సూర్, మున్సిపల్ వైస్ చైర్మన్ నయీమొద్దీన్, వైస్ ఎంపీసీ వెంకట నర్సింగరావు, ఆత్మ కమిటీ చైర్మన్ వెంకట్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు హబీబ్ఖాన్, ముస్లిం మైనార్టీ పట్టణ అధ్యక్షుడు రావూఫ్, ముస్లిం మత పెద్ద మసియోద్దీన్, బీఆర్ఎస్ నాయకులు షేక్హుస్సేన్, లియాకత్, ఫిరోజ్, అజీమొద్దీన్, అఫీజ్ ఖుత్బుద్దీన్, జేడీ మహమ్మద్, లాయక్ అలీఖాన్, హిబ్రహీంఖాన్ తదితరులు పాల్గొన్నారు.