జిన్నారం, డిసెంబర్ 8: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో రూ.3 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న ఘటన జిల్లాలో పెద్ద కలకలం రేపింది. శుక్రవారం జిన్నారం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ కేసుకు సంబంధించిన వివరాలను సంగారెడ్డి ఎస్పీ సీహెచ్ రూపేశ్ వెల్లడించారు. సులువుగా డబ్బు సంపాదించాలనే ఆశతో నిషేధిత ప్రమాదకరమైన మత్తు పదార్థాలను తయారు చేస్తున్నారన్న సమాచారం మేరకు వీటిని తయారు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ఎస్పీ సీహెచ్ రూపేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా హత్నూర మండ లం బోరపట్ల గ్రామానికి చెందిన మహ్మద్ యూనీస్ అలియాస్ జక్కరాజు, హత్నూర మండలం గుండ్లమాచునూరు గ్రామానికి చెందిన శ్రీనివాస్గౌడ్, సీ.శ్రీశైలం యాదవ్, జిన్నారం మండలం కొడకంచి గ్రామానికి చెందిన కిష్టంగారి శివశంకర్గౌడ్, కొడకంచి పంచాయతీ పుట్టగూడ గ్రామానికి చెందిన కిష్టంగారి నిర్మల్గౌడ్, పటాన్చెరు ఇస్నాపూర్ గ్రామానికి చెందిన ల్యాబ్ రియాక్టర్ ఆపరేటర్, కెమిస్ట్ పసుపలేటి మాణిక్యాలరావు, అమీన్పూర్ బీరంగూడకు చెందిన రాహుల్రెడ్డి (ఏడుగురు)కలిసి సైకోట్రాపిక్ సబ్స్టాన్స్ అయిన నార్డాజెపం అనే నార్కోటిక్ డ్రగ్స్ తయారీ కోసం జిన్నారం మండలంలోని కొడకంచి గ్రామ శివారులో 3.30 గుంటల భూమిలో ఉన్న జామతోటను, అందులోని షెడ్డును లీజుకు తీసుకుని ల్యాబ్ ఏర్పాటు చేశారు. మూడు నెలలుగా షెడ్డులో డ్రగ్స్ తయారీ జరుగుతున్నది. ఈ ప్రక్రియపై జిన్నారం పోలీసులు, టీఎస్ యాంటీ నార్కోటిక్ అధికారులకు సమాచారం రావడంతో వారు స్థావరంపై దాడి చేశారు. దాడుల్లో 14 కిలోల నార్డాజెపం అనే నార్కోటిక్ డ్రగ్ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.70 లక్షలు ఉంటుంది. ఇది బహిరంగ మార్కెట్లో రూ.3 కోట్ల వరకు ఉంటుంది. డ్రగ్స్ తయారీ కేంద్రం నుంచి 14 కిలోల డ్రగ్స్తోపాటు ఇతర ముడి పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. షెడ్డులో ఏర్పాటు చేసిన రియాక్టర్, డ్రయ్యర్, ఇతర ప్రాసెసింగ్ సిస్టంను అక్కడే సీజ్ చేశారు. దీనికి ప్రధాన కారకులు మహ్మద్ యూనీస్ అలియాస్ జక్కరాజు, గౌండ్ల శ్రీనివాస్గౌడ్, కిష్టంగారి నిర్మల్గౌడ్, పసుపులేటి మాణిక్యాలరావు, కిష్టంగారి శివశంకర్గౌడ్ను అరెస్టు చేశారు. రాహుల్రెడ్డి, సీ.శ్రీశైలంయాదవ్ పరారీలో ఉన్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ డగ్స్ తయారీకి జామతోట, షెడ్డును లీజుకు తీసుకుని అందులో ల్యాబ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. షెడ్డులో సుమారు ఆరు ఫీట్ల గంత తవ్వి రియాక్టర్ పెట్టి, దానికి అవసరమైన ఎక్విప్మెంట్ బిగించారు. తయారు చేసిన ప్రొడక్ట్ను పొడిగా మార్చేందుకు డ్రయ్యర్ను ఏర్పాటుచేశారు. బైక్లపై అవసరమైన ముడిపదార్థాలు తీసుకొచ్చారు. దీనికంతటికి అవసరమయ్యే పరికరాలను రాహుల్రెడ్డి సమకూర్చాడు. పసుపులేటి మాణిక్యాలరావుకు కెమిస్ట్గా అనుభవం ఉంది. దీంతో అతను డ్రగ్స్ తయారు చేశాడు. ప్రస్తుత నార్డాజెపమ్ డ్రగ్ను మరింత ప్రాసెస్ చేస్తే అల్ఫాజోమ్ డ్రగ్ తయారవుతుంది. ఇది ఒక గ్రామ్ రెండు వేల లీటర్ల కల్తీ కల్లులో కలుపుతారు. ఇది చాలా ప్రమాదకరమైన డ్రగ్. ఇది తీసుకుంటే మనుషుల ప్రాణాలకే ప్రమాదం. డ్రగ్స్ తయారీ కమర్షియల్ కిందకు వస్తుంది. వీరికి పెద్ద శిక్ష పడే అవకాశం ఉంటుందని ఎస్పీ తెలిపారు. ఇందు లో మహ్మద్ యూనీస్కు పాత నేర చరిత్ర ఉంది. 2017లో అల్ఫాజోన్ తయారీ కేసులో మూడేండ్లు జైల్లో ఉన్నాడు. గతంలో పసుపులేటి మాణిక్యాలరావు షాపూర్కు చెందిన కోటిరెడ్డి వెంకటేశ్వరరావుతో కలిసి బాలానగర్ ఏరియాలో అల్ఫాజోన్ తయారు చేస్తూ ఉప్పల్ ఎక్సైజ్ అధికారులకు పట్టుబడి 2020లో జైలుకు వెళ్లాడు. నిందితులను అరెస్టు చేసిన జిన్నారం సీఐ వేణుకుమార్, టీఎస్ యాంటీ నార్కోటిక్ అధికారులు జి.చక్రవర్తి, శ్రీధర్, పటాన్చెరు డీఎస్పీ పురుషోత్తంరెడ్డి, జిన్నారం ఎస్సై విజయరావు, ఇతర అధికారులను ఎస్పీ అభినందించారు.
సంగారెడ్డి కలెక్టరేట్: జిల్లాలో మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా అరికట్టేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి నగేశ్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో పోలీస్, వైద్యారోగ్య, ఎక్సైజ్, అటవీ, వ్యవసాయ, రెవెన్యూ, ట్రాన్స్పోర్ట్, విద్య తదితర శాఖల అధికారులతో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగం, అరికట్టడంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ మాదక ద్రవ్యాలతో కలిగే నష్టాలను విద్యార్థులు, రైతులు, ప్రజలకు వివరించి, చైతన్యపర్చాలన్నారు. సమావేశంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ గాయత్రీదేవి, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వాణి, ప్రభుత్వ జనరల్ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్ కుమార్, వ్యవసాయ శాఖ జేడీ నర్సింహారావు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.