నారాయణఖేడ్, మే 7: ‘నాపై చూపుతున్న అభిమానాన్ని శక్తిగా మార్చి శ్వాస ఉన్నంత వరకు ప్రజాసేవకే అంకితమై పని చేస్తాన’ని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి బీఆర్ఎస్ కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజలనుద్దేశించి అన్నారు. ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలు ఆదివారం నారాయణఖేడ్లోని సాయిబాబా ఫంక్షన్ హాల్లో వేలాది మంది కార్యకర్తల మధ్య ఘనంగా నిర్వహించారు. తన సతీమణి జయశ్రీరెడ్డి, తల్లి శకుంతలమ్మతో కలిసి వేడుకల్లో పాల్గొన్న భూపాల్రెడ్డి మాట్లాడుతూ.. తన బలం, బలగం కార్యకర్తలేనన్నారు. ప్రతి కార్యకర్తను గుండెకాయలా చూసుకుంటానని చెప్పారు. ప్రజలు తనపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టే దిశగా భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి పనులు, సంక్షేమ ఫలాలు అందించే బాధ్యత తనపై ఉందన్నారు.
కన్నుల పండువగా పుట్టిన రోజు వేడుకలు
భూపాల్రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో నిర్వహించిన రక్తదాన శిబిరంలోనూ యువకులు పెద్ద సంఖ్యలో రక్తదానం చేశారు. మంగల్పేట్లోని దుర్గామాత ఆలయంలో పూజలు చేసిన ఎమ్మెల్యే అక్కడి నుంచి వందలాది కార్యకర్తల బైక్ర్యాలీ మధ్య ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. రాజీవ్ చౌక్ వద్ద ఖేడ్ మున్సిపల్ చైర్పర్సన్ రుబీనాబేగం నజీబ్, బసవేశ్వర చౌక్ వద్ద మార్కెట్ కమిటీ చైర్మన్ సువర్ణ శెట్కార్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను గజమాలలతో సత్కరించారు. అనంతరం సాయిబాబా ఫంక్షన్హాల్లో మున్సిపల్ చైర్పర్సన్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తల మధ్య ఎమ్మెల్యే కేక్ కట్ చేశారు. ఇదే హాలులో ఉచిత వైద్యశిబిరం కొనసాగింది.