‘అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయ దుందుభి ఖాయం. ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని స్థానాల్లో గులాబీ పార్టీ విజయం సాధిస్తుంది. హుస్నాబాద్, జనగామ, మానకొండూరు నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్ విజయం పక్కా. సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల కండ్ల ముందు కనిపిస్తున్నాయి. నాడు తాగునీటి కష్టాలు ఉండే.. ఇవాళ ఆ బాధలు తీర్చుకున్నాం. సాగునీటి కష్టాలు తీరాయి..రైతులు సంబురంగా రెండు పంటలు పండించుకుంటున్నారు. ఇతర రాష్ర్టాల వాళ్లకు ఉపాధి కల్పించే విధంగా ప్రగతి సాధిం చాం. కాంగ్రెస్ అంటే మోసం, నమ్మక ద్రోహం… సీఎం కేసీఆర్ అంటే నమ్మకం’ అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మళ్లీ 50 ఏండ్లు వెనక్కి వెళ్లడం ఖాయమన్నారు. మూడు గంటల కాంగ్రెస్ కావాలా.? 24 గంటలు సరఫరా చేసే బీఆర్ఎస్ కావాలా ప్రజలు ఆలోచన చేయాలన్నారు. సమైక్య రాష్ట్రంలో ఉమ్మడి మెదక్ జిల్లా కరువు కాటకాలు, వలసలకు నిలయంగా ఉండేదని, నేడు సీఎం కేసీఆర్ భగీరథ ప్రయత్నంతో సాగునీరు పుష్కలంగా లభిస్తున్నదన్నారు. రైతులు సంబురంగా రెండు పంటలు పండించుకుంటున్నారని చెప్పారు. ‘నమస్తే తెలంగాణ ప్రతినిధి’కి ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
సిద్దిపేట, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలోని అన్ని శాసనసభ స్థానాల్లో బీఆర్ఎస్ విజయ దుందుభి మోగించనున్నది. జిల్లాతో కలిసి ఉన్న హుస్నాబాద్, జనగామ, మానకొండూరు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుంది. సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల కండ్లముందు కనిపిస్తున్నాయి. నాడు తాగునీటి కష్టాలు ఉండే ఇవాళ ఆ బాధలు తీర్చుకున్నాం. సాగునీటి కష్టాలు తీరాయి. రైతులు రెండు పంటలు హాయిగా పండిస్తున్నారు. ఇతర రాష్ర్టాల వాళ్లకు ఉపాధి కల్పించేంతగా ప్రగతిని సాధించాం. కాంగ్రెస్ అంటే మోసం.. నమ్మక ద్రోహం.. సీఎం కేసీఆర్ అంటే నమ్మకం’ అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ‘నమస్తే తెలంగాణ ప్రతినిధి’ వారితో ముచ్చటించింది. ఈ సందర్భంగా పలు విషయాలను మంత్రి వివరించారు. వారి మాటల్లోనే …..
ఉమ్మడి జిల్లాలోని పది స్థానాలకు పది స్థానాల్లో గెలవబోతున్నాం. హుస్నాబాద్, జనగామ, మానకొండూరులో బీఆర్ఎస్ గెలుపు ఖాయమైపోయింది. ఉమ్మడి జిల్లా మరోసారి బీఆర్ఎస్కు కంచుకోట అని నిరూపిస్తాం. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మా అభ్యర్థుల విజయానికి దోహదపడుతున్నాయి. ప్రజలకు మేము చేసిన పనులను వివరించాం. నాడు కాంగ్రెస్ పాలన పరిస్థితి.. నేడు బీఆర్ఎస్ పాలనను ఒక్కసారి గుండెమీద చెయ్యి వేసి ఆలోచించి ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. తాము నిర్వహించిన ప్రచార సభలో సైతం ప్రజలు మావైపు ఉన్నారు. కాంగ్రెస్ వాళ్లు తీసుకువచ్చిన జనమైతే.. బీఆర్ఎస్ సభలకు తమ సభ అని తరలివచ్చారు. బీఆర్ఎస్ సభలకు జనమే జనం.. కాంగ్రెస్, బీజేపీ సభలు వెలవెలబోయా యి. ఖాళీ కుర్చీలు పెట్టుకుని వారు ఉపన్యాసాలు ఇచ్చారు. సమైక్య రాష్ట్రంలో కరువు కాటకాలతో వలసల జిల్లాగా ఉన్న ఈ ఉమ్మడి మెదక్ ఇయాళ సీఎం కేసీఆర్ భగీరథ ప్రయత్నంతో సాగు నీరు పుష్కలంగా వచ్చింది. దీంతో రైతులు రెండు పంటలు పండిస్తూ పచ్చని మాగాణిగా మార్చారు. నారాయణఖేడ్, జోగిపేట, జహీరాబాద్ తదితర ప్రాంతాల్లో వలసలు వాపస్ వచ్చాయి. ప్రజలు రెండు పంటలు పండించుకుంటున్నారు. మన జిల్లా కర్ణాటక సరిహద్దులో ఉండడంతో ప్రజలకు ఒక్క స్పష్టత వచ్చింది. కర్ణాటక రాష్ర్టానికి రెండు నియోజకవర్గాలు పూర్తిగా సరిహద్దు ఉంటుంది. మరో రెండు నియోజకవర్గాలకు కొంత మేర సరిహద్దు ఉంటుంది. మొత్తంగా జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలతో సంబంధాలు బాగా ఉంటాయి.
కర్ణాటకలో ఐదు గ్యారెంటీలు అమలు కాలేదు. కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత అక్కడి రైతుల పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిల పడ్డైట్టెంది. కర్ణాటక ఎన్నికల్లో రాహుల్, ప్రియాంకగాంధీ గల్లీగల్లీ తిరిగి ఎన్నికల ప్రచారం చేశారు. రాహుల్, ప్రియాంకలు ఎన్నికల ముందే కనపడతారు. ఎన్నికల తర్వాత ఢిల్లీలో పడతారు. ఇయాళ కర్ణాటకలో రాహుల్ గాంధీ జాడ లేదు. ప్రియాంకగాంధీ పత్తాలేదు. ప్రజలకు ఇచ్చిన హామీ లేదు. ఎనిమిది గంటల కరెంట్ కాస్త.. మూడు గంటలకే తగ్గిపోయింది. ఇవాళ అక్కడి రైతులకు మూడు గంటల కరెంట్ ఇవ్వని పరిస్థితి అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వంది. అక్కడి రాష్ట్రంలో రైతుబంధు బంద్ చేసిండ్రు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అక్కడ రైతుబంధు పూర్తిగా ఆగిపోయింది. స్కాలర్షిప్ల్లో కోత పెట్టారు. అక్కడి రాష్ట్రంలో గండ కరువు వచ్చింది. తాగునీటికి ఇబ్బంది ఉంది. తిండి గింజలకు అక్కడి రాష్ట్రంలో ఇబ్బంది ఉంది. అక్కడి పాలనను ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారు. అనేక రాకపోకలు, మానవ సంబంధాలు ఉమ్మడి జిల్లా ప్రజలకు కర్ణాటక రాష్ట్రంతో ఉన్నాయి. కాంగ్రెస్ మార్పు అంటుంది. మార్పు అంటే మూడు గంటల కరెంటా..? 24 గంటల నుంచి మూడు గంటలకు తగ్గించడమే మార్పా..? ఏ మార్పు కోరుకుంటున్నారు. మార్పు అంటే ప్రజల జీవన విధానంలో మార్పు రావాలి. ఆర్థిక స్థితిగతుల్లో మార్పు రావాలి. కాంగ్రెస్ ఈ దేశంలో ఎక్కడా కూడా వెయ్యి రూపాయల మించి పింఛన్ ఇవ్వడం లేదు. నాడు అధికారంలో ఉన్నప్పుడు ఇవ్వలేదు. నేడు పాలిస్తున్న రాష్ర్టాల్లో సైతం ఇవ్వడం లేదు. తెలంగాణలో ఇస్తామనడమనేది ప్రజలను మభ్యపెట్టడమే. తెలంగాణలో ఇస్తమని చెప్పడం అంటే ఇది ప్రజలను మోసం చేయడం. పారదర్శకమైన పాలన.. పైరవీకారుల లేకుండా పారదర్శకంగా బీఆర్ఎస్ పాలనను అందించాం. కాంగ్రెస్ వస్తే మళ్లీ పైరవీకారులు, బ్రోకర్ల రాజ్యం వస్తున్నది.
బీఆర్ఎస్ పాలన బాగుందా..? కాంగ్రెస్ పాలన బాగుందా..? అని ప్రజలు ప్రత్యక్షంగా చూసి తెలుసుకొని బీఆర్ఎస్కు అండగా నిలుస్తున్నారు. కేసీఆర్ పాలనలో కడపు నిండా సంక్షేమం కంటి నిండా అభివృద్ధి. నాడు చుక్క తాగునీరు నోచుకొని జిల్లాకు సాగునీరు, తాగునీరు తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆరు దశాబ్దాలు కాంగ్రెస్, టీడీపీ పాలించిన చుక్కనీరు ఇవ్వలేదు. కానీ, దశాబ్ద కాలంలో ఈ జిల్లాకు సాగునీరు అందించి ఈ ప్రాంత కరువు తీర్చింది కేసీఆర్. 60ఏండ్లలో తాగునీరు కూడా ఇవ్వని నాటి పాలకులు. నారాయణఖేడ్ లాంటి ప్రాంతంలో నులక మంచం మీద స్నానం చేసి తాంబాలంలో నీళ్లు పట్టుకున్న పరిస్థితులు నాడు చూశాం. నేడు ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన శుద్ధి చేసిన తాగునీటిని అందిస్తున్నది కేసీఆర్. రంగనాయక, కొండపోచమ్మ, మల్లన్నసాగర్ రిజర్వాయర్లు నిర్మించారు. మండు టెండల్లో చెరువుల మత్తళ్లు దుంకించాం. హల్ది, కూడవెల్లి వాగులను జీవ నదులుగా మార్చాం. జిల్లాలోని ఐదు నియెజకవర్గాలకు గోదావరి నీళ్లు అందాయి. రేపు బసవేశ్వర, సంగమేశ్వర ద్వార రేండేండ్లలో మిగతా నియోజకవర్గాలకు సాగు నీరు అందిస్తాం. కాళేశ్వర జలాలతో సింగూరు ప్రాజెక్టుకు లింకు కలుపుతున్నాం.
ఇవాళ సీఎం కేసీఆర్ నాయకత్వంలో విద్య, వైద్య రంగంలో గణనీయమైన మార్పు తీసుకువచ్చాం. సిద్దిపేట, మెద క్, సంగారెడ్డి జిల్లాలకు మూడు మెడికల్ కళాశాలలు ఇచ్చాం. పెద్దఎత్తున గురుకులాలు ప్రారంభించాం. అన్ని నియోజకవర్గాలకు వంద పడకల దవాఖానలు ఇచ్చాం. పటాన్చెరులో 200 పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖాన, ఇవాళ వైద్యం జిల్లాలో పేదలకు అందుబాటులో తెచ్చింది. నాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 30 శాతం డెలివరీలు అవుతే.. ఇవాళ ఉమ్మడి మెదక్ జిల్లాలో 80 శాతం పైగా డెలివరీలు ప్రభుత్వ దవాఖానల్లో అవుతున్నాయి. విద్య, వైద్యంలో గణనీయమైన ప్రగతిని సాధించాం. ‘మనఊరు-మనబడి’ ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు పక్కా భవనాలు నిర్మించుకున్నాం.
ఇవాళ కాంగ్రెస్, బీజేపీలకు ప్రచారం చేయడానికి విషయం లేదు. ప్రతి పక్షాలు ఏం చెప్పాలో పాలు పోక ప్రభుత్వ భూములను ప్రభుత్వం లాక్కుంటది అని ఒక దుష్పచారం చేస్తున్నారు. ఈ జిల్లా బిడ్డగా నేను హామీ ఇస్తున్నా.. ఏ ఒక్కరి భూమి ప్రభుత్వం తీసుకోదు.. ప్రభుత్వ భూములు తీసుకోడం కాదు. పట్టా భూములుగా మార్చి మీకు పూర్తి హక్కులు కల్పిస్తాం. మీరే ఆ భూములకు ఓనరులవుతారు. ఆ భూములకు మీరు ఇతర పట్టా భూముల్లాగా మీ అవసరాలకు వినియోగించుకునే సంపూర్ణమైన హక్కులు మీకు కల్పించబడతాయి. కాంగ్రెస్ చేసే దుష్పచారాన్ని నమ్మవద్దు
కాంగ్రెస్ కన్న బీఆర్ఎస్ మ్యానిఫెస్టో చాలా బాగుంది. కేసీఆర్ అంటే నమ్మకం.. కాంగ్రెస్ అంటే మోసం. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో రూ.400లకే సిలిండర్, సౌభాగ్యలక్ష్మి మూడు వేలు, రైతుబంధు రూ.16వేలు, ఆసరా పింఛన్ రూ.5వేలు, పేదలకు సన్నబియ్యం, ఆరోగ్యశ్రీ రూ.15లక్షలు, అసైన్డ్ భూములు పట్టా భూములుగా మార్చడం. గురుకులాలను డిగ్రీ కళాశాలలు అప్గ్రేడ్ చేసుకోవడం. ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలను బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో పెట్టడం జరిగింది. బీడీ కార్మికులకు కాంగ్రెస్ పుర్రెగుర్తును తీసుకువస్తే.. బీజేపీ జీఎస్టీని పెట్టింది. రెండు పార్టీలు బీడీ కార్మికుల నోట్లో మట్టి కొట్టాయి. కేసీఆర్ బీడీ కార్మికులకు దేశంలో ఎక్కడా లేని విధంగా రెండు వేల ఆసరా పింఛన్ అందిస్తున్నారు. బీడీ కార్మికులను కడుపులో పెట్టుకున్నారు. ఆసరా పింఛన్ ఈసారి గెలిచిన తర్వాత రూ.5వేలకు చేయబోతున్నాం. బీడీ కార్మికులను తోబుట్టువులాగా కాపాడుకొని, వారి ఆత్మగౌరవం నిలబెట్టింది ఒకే ఒక్కరు సీఎం కేసీఆర్. కారుకు ఓటేస్తే జనవరి నుంచి సోనామసూరి బియ్యం ఇస్తం. పేదలందరికీ ఇండ్లు కట్టించే బాధ్యత తీసుకుంటాం.
ఇవాళ ఉద్యోగాల కల్పనలో ఇప్పటికే లక్షా యాభైవేల ఉద్యోగాల నియామక ప్రక్రియను పూర్తి చేశాం. మిగతావి కూడా ఈ రాష్ట్రంలో ఒక్క ఖాళీ లేకుండా నింపుతాం. కాంగ్రెస్ పదేండ్లలో 13వేల ఉద్యోగాలు నింపితే, మా తొమ్మిదేండ్లలో లక్షా యాభైవేల ఉద్యోగాలను నింపినం. ఇవాళ పెద్ద ఎత్తున పరిశ్రమల్లో పెట్టుబడులు సాధించి ప్రైవేట్ రంగంలో 24లక్షల మందికి ఉపాధి కల్పించాం. ఇండియాలోనే ఐటీలో అత్యధికంగా ఆరు లక్షల ఉద్యోగాలు ఈ తొమ్మిదేండ్ల కాలంలో కల్పించాం. రాబోయే రోజుల్లో ఉద్యోగ క్యాలెండర్ను పెట్టి ఏ యేటికి ఆయేడు ఒక్క ఖాళీ లేకుండా నింపుతాం.
కాంగ్రెస్, బీజేపీలకు ఓటేయడం అంటే మూడు గం టల కరెంట్కు ఒప్పుకోవడమే. కాంగ్రెస్కు ఓటు వేయడమంటే అభివృద్ధిని మన వేలుతో మనమే కంటిని పొడ్చుకోవడం. కాంగ్రెస్, బీజేపీలకు ఓటు వేయడమంటే బోర్ బావుల కాడ మీటర్లకు ఒప్పుకోవడమే.. రైతు బంధులో కోత పడడమే. జాలిపడి కాంగ్రెస్కు ఓటేయవద్దు. రిస్ వద్దు.. కారుకు గుద్దు.. సీఎం కేసీఆర్ను హ్యాట్రిక్ సీఎం చేయండి. నాటి నేటి పరిస్థితులను బేరీజు వేసుకోండి. కండ్ల ముందు ఉన్న అభివృద్ధిని చూడండి. రైతులకు సాగు నీరు వచ్చింది. మంచిగా రెండు పంటలు పండుతున్నాయి. నాడు 600 మీటర్ల లోతు పోయినా బోర్లు పడకపోయేది. నేడు చెరువులు బాగు చేసుకున్న తర్వాత బావులు, బోర్లలో ఊట పెరిగింది. నాడు గ్రామాల్లో కైకిల్ దొరకక ఇతర ప్రాంతాలకు వలసలు పోయారు. ఇవాళ కైకిలోల్లు దొరకని పరిస్థితి గ్రామాల్లో నెలకొంది. మనమే ఇతర రాష్ర్టాల వాళ్లకు ఉపాధి కల్పిస్తున్నాం. తెలంగాణలో ఇతర రాష్ర్టాల నుంచి మగోళ్లు వచ్చి గుత్తకు మాట్లాడి వరి నాట్లేస్తున్నారు. భవిష్యత్ గురించి రాసిన బ్రహ్మం గారు కూడా మొగోళ్లు నాట్లేస్తరని ఊహించలేదంటే మన కేసీఆర్ కాలాన్ని ఎంతగా తిరగ రాసిండో గమనించాలి.
రైతులకు విజ్ఞప్తి రైతుబంధు విషయంలో కాంగ్రెస్ ప్రజలను మోస పుచ్చాలని చూస్తున్నది. సీఎం కేసీఆర్ ప్రతి ఎకరానికి రూ.16వేలు ఇస్తమంటే… ఇదే కాంగ్రెస్ వాళ్లు ప్రతి రైతుకు సంవత్సరానికి రూ.15వేలు అంటున్నారు. మూడెకరాలు ఉన్న రైతుకు కేసీఆర్ రూ. 48 వేలు ఇస్తే.. కాంగ్రెస్ రూ.15 వేలు మాత్రమే ఇస్తుంది. దీనిని రైతులు గమనించాలి. రైతు బంధుకు కోత పెడుతుంది కాంగ్రెస్ పార్టీ. వాళ్ల మ్యానిఫెస్టోలోనే పెట్టారు కోత. కర్ణాటక రాష్ట్రంలో రైతుబంధుకు రాం రాం చెప్పిండ్రు. ఇక్కడ కూడా అదే చేస్తారు. కర్ణాటకలో కాంగ్రెస్ను నమ్మి ప్రజలు గెలిపిస్తే ఇప్పుడు అక్కడ ప్రజలు, రైతులు ఆగమైతండ్రు. ఇప్పుడు సమస్య వచ్చి ఎవరిని అడగాలో తెలియక అక్కడోళ్లు పరేషాన్ అవుతున్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ కర్ణాటకలో ప్రచారం చేసి 5 గ్యారెంటీలు అని ఊదరగొట్టి మోసం చేసిండ్రు. రేవంత్రెడ్డికి ఏ విషయం మీద పూర్తి అవగాహన ఉండదు.
కాంగ్రెస్, బీజేపీలు ఎవరు వచ్చిన మీ బోరు బావుల కాడ మీటర్లు ఖాయం. ఇంటి దగ్గరికి బిల్లులు వచ్చుడు ఖాయం. ఇవాళ కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో రాజస్థాన్, హిమాచల్ప్రదేశ్లో ఇప్పటికే మీటర్లు బిగించారు. కర్ణాటక రాష్ట్రంలో మీటర్లు పెట్టడానికి అసెంబ్లీలో తీర్మానం పాసైంది. బోరు బావుల కాడ మీటర్లు పెట్టాలని విధానం తెచ్చింది బీజేపీ.. అమలు చేస్తున్నది కాంగ్రెస్. రెండు పార్టీలు రైతులకు అన్యాయం చేయబోతున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ క్లారిటీ ఇచ్చింది. బోరు బావుల వద్ద మీటర్లు పెట్టలేదని రూ.28 వేల కోట్లు తెలంగాణకు ఆపేసామని స్పష్టంగా చెప్పింది. రూ.28వేల కోట్లు కేసీఆర్ వదులుకున్నాడు.. కానీ, మోటర్లకు మీటర్లు పెట్టలేదు. గొంతులో ప్రాణం ఉండగా రైతులకు మీటర్లు పెట్టనివ్వనని తెగేసి చెప్పిన కేసీఆర్ను మనం కాపాడుకోవాలి. మీటర్లు కావాలంటే కాంగ్రెస్, బీజేపీలకు ఓటు వేయండ్రి.. 24గంటల కరెంట్ కావాలంటే కేసీఆర్కు కారుకు ఓటు వేయండి. నాడు దొంగ కరెంట్ కోసం బాయిలకాడ పండుకున్న రోజులు మర్చిపోలేదు. ఉచిత కరెంట్ అని చెప్పి కాంగ్రెస్ ఉత్త కరెంట్ చేసింది. అలాంటి కాంగ్రెస్ కావాలా? నాణ్యమైన కరెంట్ కావాలా? కరెంట్ కావాలంటే కారుకు ఓటు వేయాలి. మొన్నటి వరకు కర్ణాటక మోడల్ అని చెప్పి.. ఇప్పుడు కాంగ్రెస్ లీడర్లు మాట మార్చారు. రేవంత్రెడ్డి మూడు గంటల కరెంట్, 10హెచ్పీ మోటర్ అంటుండు.. కాంగ్రెస్ మోసం చేసే పార్టీ.. కేసీఆర్ అంటే మాట తప్పనోడు. కేసీఆర్ అంటే నమ్మకం. కాంగ్రెస్ వస్తే కటిక చీకట్లు ఖాయం.. కేసీఆర్ వస్తే 24 గంటల కరెంట్ వెలుగులు.