గుమ్మడిదల, ఫిబ్రవరి 16: ప్యారానగర్లో డంపింగ్యార్డు ఏర్పాటును వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ఆదివారం గుమ్మడిదల మండలంలో ఆందోళనలు కొనసాగాయి. గుమ్మడిదలలో రైతు జేఏసీ కమిటీ అధ్యక్షుడు చిమ్ముల జైపాల్రెడ్డి ఆధ్వర్యంలో అఖిపక్ష నాయకులు, రైతు సంఘాలు, మహిళా సంఘాల సభ్యులు జాతీయ రహదారి-765డీ పై భారీ ర్యాలీ నిర్వహించారు.
హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినా పనులు చేపట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డు వద్దకు మహిళలు ర్యాలీగా వెళ్లారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మా రెడ్డి అక్కడికి చేరుకుని వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు, నిరసనకారులకు మధ్య తోపులాట జరిగింది. జై జవాన్.. జై కిసాన్, సేవ్ ఫారెస్ట్, సేవ్ ఫార్మర్ నినాదాలు మిన్నంటాయి. మహిళా పోలీసులు మహిళలను డంపింగ్యార్డు వైపు వెళ్లకుండా అడ్డుకున్నారు.
డంపింగ్యార్డుకు వ్యతిరేకంగా ఆదివారం జాతీయ రహదారిపై యువకులు పెద్దసంఖ్యలో బైక్ ర్యాలీ నిర్వహించారు. గుమ్మడిదల నుంచి అన్నారం, ప్రకృతి నివాస్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. నల్లవల్లి, కొత్తపల్లిలో 12వ రోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. దోమడుగు, బొంతపల్లి గ్రామాల జేఏసీల ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే డంపింగ్యార్డు అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనల్లో రైతు జేఏసీ నాయకులు జైపాల్రెడ్డి, నాయకులు గోవర్ధన్రెడ్డి, దేవేందర్రెడ్డి, రైతు సంఘం అధ్యక్షుడు సదానందరెడ్డి, ఆలయకమిటీ అధ్యక్షుడు మద్దుల బాల్రెడ్డి, మాజీసర్పంచ్ నర్సింహారెడ్డి, రాజశేఖర్, శ్రీనివాస్రెడ్డి, స్వేచ్ఛారెడ్డి, వేణురెడ్డి, ఉదయ్కుమార్, కరుణాకర్, డాక్టర్ శ్రీనివాస్రెడ్డి, ఐలయ్య, రాంరెడ్డి, ఫయాజ్షరీఫ్, కుమ్మరి ఆంజనేయులు, కొత్తపల్లి మల్లేశ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. భూసర్వే చేసే వరకు పనులు నిలిపి వేయాలని హైకోర్టు ఆదేశించిందన్నారు. డంపింగ్యార్డు పనులు జరుగుతున్నాయా, లేక నిలిపివేశారా అనే విషయంలో నిర్మాణ సంస్థ రాంకీ స్పష్టత ఇవ్వాలని, ఆందోళన చేస్తున్న వారికి డంపింగ్యార్డు పనులు ఆపింది లేనిది చూపించాల్సిన బాధ్యత లేదా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. డంపింగ్ యార్డులోకి అనుమతించక పోవడంపై పలు అనుమానాలు, అపోహలు వ్యక్తమవుతున్నాయని ఆమె తెలిపారు.
12 రోజులుగా పనులు వదులుకొని నల్లవల్లి, కొత్తపల్లి, ప్యారానగర్, గుమ్మడిదల, దోమడుగు, బొంతపల్లి తదితర గ్రామాల ప్రజలు ఆందోళనలు చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీ అధికారులతో చర్చించి డంపింగ్యార్డు అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. డంపింగ్యార్డు చెత్త కంపుతో పచ్చని పల్లెల్లో పర్యావరణానికి విఘాతం కలుగుతుందని, భూగర్భ జలాలను, అడవులను, పంటలను నాశనం చేయొద్దని ప్రభుత్వానికి ఆమె విజ్ఞప్తి చేశారు.