పాస్పోర్టు కార్యాలయాల ప్రాంగణాల్లో ప్రైవేట్ వ్యక్తుల దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతోంది. పాస్పోర్టు కార్యాలయానికి వెరిఫైడ్ ఆధార్ కార్డు, పూర్తి ప్రింట్తో వెళ్లాలి.. కానీ చాలా మంది తమ వద్ద ఉన్న చిన్న కార్డులను ప్రింట్ తీసుకొని అక్కడకు వెళ్లడంతో అక్కడున్న సిబ్బంది వెరిఫైడ్ ఆధార్కార్డు తెచ్చుకోండంటూ సూచన చేస్తారు. దరఖాస్తుదారులు పాస్పోర్టు కార్యాలయం లోపలికి వెళ్లడం.. కౌంటర్ వద్ద జిరాక్స్, ప్రింట్ సరిగ్గా లేదని సిబ్బంది చెప్పడంతో ఆందోళనకు గురవుతున్నారు. కొన్ని కేంద్రాల్లో జిరాక్స్ అక్కడే అందుబాటులో ఉంటుంది.
సిటీబ్యూరో, జులై 21 (నమస్తే తెలంగాణ) ప్రింట్ మాత్రం బయటకు వెళ్లాలి.. బయటకు వెళ్లిన తరువాత లోపలికి రానిస్తారో లేదో తెలియని ఆందోళన.. అక్కడున్న సిబ్బంది అనుమతి తీసుకొని బయటకు వెళ్లగానే.. ప్రింటింగ్ దోపిడీ మొదలవుతుంది..పాస్పోర్ట్ కేంద్రాల ఆవరణల్లో కొందరు ఏజెంట్ల ఆగడాలు పెరిగిపోతున్నాయి. ఇటీవల రాము అనే వ్యక్తి వారి కుటుంబ సభ్యుల పాస్పోర్ట్ ప్రక్రియ దృష్ట్యా ఎంజీబీఎస్ మెట్రో పాస్పోర్ట్ కేంద్రానికి వెళ్లారు. అక్కడ వారికి ఆధార్ ప్రింట్ కావాల్సి వచ్చింది. దీంతో అక్కడ ఓ వ్యక్తి ఆధార్తో పరుగులు పెడుతూ అక్కడికి వచ్చే వారిని ఏమి కావాలంటూ అడిగాడు.. ఆధార్ ప్రింట్ కావాలంటే.. నంబర్ చెప్పండి.. అంటూ హడావిడి చేస్తూ దరఖాస్తుదారుల ఆధార్ కార్డు చూస్తూ ఫోన్లో అవతలి వ్యక్తికి నంబర్ చెబుతాడు.. మీ ఫోన్కు ఓటీపీ వచ్చింది చెప్పండంటూ అక్కడున్న వ్యక్తి అడగడంతో.. దరఖాస్తుదారుడు ఓటీపీ చెప్పడం.. అవతల ఉన్న వ్యక్తులు ఆధార్ డౌన్లోడ్ చేసి వెంటనే సదరు వ్యక్తి ఫోన్కు పంపిస్తారు.
ఆ ఫోన్ నుంచి లోపల ప్రింటింగ్కు ఆధార్ను సదరు వ్యక్తి పంపిస్తాడు.. ఇలా ఐదు నిమిషాల వ్యవధిలో ఈ వ్యవహారమంతా పూర్తవుతుంది… ఇంతలో మీ ప్రింట్ సిద్ధమయ్యింది.. రూ. 300 ఇవ్వండంటూ సదరు వ్యక్తి డిమాండ్ చేస్తాడు.. అదేంటి దీనికి రూ. 300 లా అంటూ ప్రశ్నిస్తే.. అవసరం మీది.. మీకు ఇక్కడ ఎక్కడ లేవు.. నేను మీసేవా వాళ్లకు ఫోన్ చేసి వాళ్లతో డౌన్లోడ్ చేయించాను.. వాళ్లకు రూ. 100 ఇవ్వాలి.. ఇక్కడ ప్రింటింగ్ చేసిన వారికి రూ. 100 ఇవ్వాలి.. నేను రూ. 100 తీసుకుంటానంటూ కచ్చితంగా చెప్పి.. సదరు దరఖాస్తుదారుల నుంచి ఆ డబ్బులు వసూలు చేస్తున్నారు. దీనిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని పాస్పోర్ట్ దరఖాస్తుదారులు డిమాండ్ చేస్తున్నారు.