సిద్దిపేట, మే 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్ర రాజధానికి సిద్దిపేట జిల్లా కేంద్రం అత్యంత సమీపంలో ఉన్నది. సిద్దిపేట పట్టణ శివారులోని నాగులబండ వద్ద రాజీవ్ రహదారిని ఆనుకొని ఉన్న 668 సర్వే నంబర్లోని మూడు ఎకరాల సువిశాల స్థలంలో రూ.45 కోట్లతో జీప్లస్ 4 అంతస్తులతో ఐటీ టవర్ రూపుదిద్దుకున్నది. ఈ ఐటీ టవర్ నిర్మాణ పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు, రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావుతో కలిసి 2020 డిసెంబర్ 10న శంకుస్థాపన చేశారు. అదేరోజు వివిధ కంపెనీల ప్రతినిధులతో ఒప్పందాలపై ఐటీశాఖ కార్యదర్శి జయేశ్రంజన్ సంతకాలు చేశారు. ఇందులో జోలాన్ టెక్నాలజీ, విసాన్ టెక్, ఎంబ్రోడ్స్ టెక్నాలజీ, సెట్విన్ కంపెనీలు ఉన్నాయి. కాగా గత ఏడాది ఐటీ టవర్ నిర్మాణ పనులు ప్రారంభమై త్వరగా పూర్తిచేశారు.
ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ విస్తరించి, స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో సకల హంగులతో రూపుదిద్దుకున్న సిద్దిపేట ఐటీ టవర్ను వచ్చేనెల జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఐటీ టవర్తో ఈ ప్రాంత యువతకు ఉద్యోగావకాశాలు పెరగనున్నాయి. ఈ ఐటీ టవర్ సిద్దిపేటకు ఐకాన్గా మారనున్నది. మొత్తం ఐటీ టవర్ భవనం ఏరియా 1,72,645 ఎస్ఎఫ్టీ, మొదటి అంతస్తు 28,783 ఎస్ఎఫ్టీ, రెండో ఫ్లోర్ 17,750 ఎస్ఎఫ్టీ, మూడో ఫ్లోర్ 17,750 ఎస్ఎఫ్టీ, నాలుగో ఫ్లోర్ 16,680 ఎస్ఎఫ్టీ ఉంటుంది. ఇందులో సీటింగ్ కెపాసిటీ రెండో ఫ్లోర్లో 256, మూడో ఫ్లోర్లో 206, నాలుగో ఫ్లోర్లో 256 మంది. ఈ ఐటీ టవర్ నిర్మాణం వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారుగా రెండు వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగనున్నాయి. ఇవ్వాళ ప్రపంచం ఐటీ వైపు పరుగుతీస్తున్న సమయంలో సిద్దిపేట ఐటీ పార్కు రూపుదిద్దుకోవడంతో నిరుద్యోగ యువత హర్షం వ్యక్తం చేస్తున్నది. ఇక సిద్దిపేట పట్టణం ఐటీ రంగంలో దూసుకుపోనున్నది.
ఐటీ టవర్ ఏర్పాటుతో ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. ఇన్ని రోజులు ఇక్కడి యువత ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు. యువత ఐటీ కంపెనీల్లో ఉద్యోగ సాధనే లక్ష్యంగా ముందుకు పోతున్నారు. లక్షల్లో ప్యాకేజీలు ఉండడంతో ఆ రంగం వైపు యువత ఎక్కువ ఆసక్తి చూపిస్తోంది. ప్రస్తుత తరుణంలో ఇంజినీరింగ్ డిగ్రీతో పాటు ఇతర సాంకేతిక రంగాల్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న వారంతా ఐటీరంగం వైపు వెళ్తున్నారు. ఇప్పటికే జిల్లా నలుమూలల నుంచి ఐటీ రంగంలో ఉద్యోగ సాధన కోసం హైదరాబాద్, బెంగళూరు, ముంబై తదితర ప్రాంతాలకు తరలి వెళ్లి అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. మరికొంత మంది విదేశాలకు సైతం వెళ్తున్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్లలేని వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం సిద్దిపేటలో నిర్మించిన ఐటీ టవర్ ఒక వరం అని చెప్పాలి. ఇక మీదట స్థానిక యువతకు ఉన్నచోటే ఉద్యోగ అవకాశం దొరకనున్నది.
ముందుకు వచ్చిన పలు ఐటీ కంపెనీలు
సిద్దిపేటలో 718 సీటింగ్ కెపాసిటీతో నిర్మించిన ఐటీ టవర్లో భాగస్వామ్యం అయ్యేందుకు ప్రముఖ ఐటీ కంపెనీలు ముందుకు వచ్చాయి. వీటిలో నెట్ విజన్, జోలాన్ టెక్, విసన్ టెక్, అమిడాయ్ ఎడ్యుటెక్, ఫిక్సిటీ టెక్నాలజీస్, ఇన్నోసెల్ వంటి కంపెనీలు స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ముందుకు రావడంపై మంత్రి హరీశ్రావు సంతోషం వ్యక్తం చేశారు. ఇటీవల ఆయా కంపెనీల ప్రతినిధులతో ప్రత్యేకంగా ఆయన సమావేశమయ్యారు. సిద్దిపేట ఐటీ టవర్లో భాగస్వామ్యమయ్యేందుకు వచ్చిన కంపెనీలకు రెండేండ్ల పాటు ఉచితంగా నిర్వహణ, అద్దె, విద్యుత్, ఇంటర్నెట్ బిల్లులు భారం లేకుండా చూస్తామని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు.
హైదరాబాద్ నుంచి అతి సమీపంలో ఉన్న సిద్దిపేట ఐటీ టవర్ ఆహ్లాదకరమైన వాతావరణంలో రాజీవ్ రహదారిపై ఉన్నది. దీనికి సమీపంలోనే త్రీస్టార్ హోటళ్లు, అర్బన్ ఫారెస్టు పార్కులు, పెద్ద సంఖ్యలో ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. పటిష్టమైన శాంతిభద్రతల నిర్వహణ వల్ల ఎలాంటి సమస్యలు లేకుండా ఉండడంతో పాటు, తమతో కలిసి వచ్చే కంపెనీలకు ఎలాంటి రాయితీలు కావాలన్నా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీంతో పెద్ద సంఖ్యలో ఉన్న ఇంజినీరింగ్ విద్యార్థులకు స్థానికంగా ఐటీ ఉద్యోగాలు కల్పించేందుకు పలు కంపెనీలు ముందుకు వస్తున్నాయి. సిద్దిపేట ఐటీ టవర్లో స్థానిక యువతకు ప్రాధాన్యం ఉండనున్నది.