సిద్దిపేట, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మైనంపల్లి హన్మంతరావు షో అట్టర్ ఫ్లాప్ అయ్యింది. మంత్రి కాదు… ఓ ఎమ్మెల్యే కాదు. ఆయన ఒక మాజీ ఎమ్మెల్యే మాత్రమే.. ఆయనకు రోప్ పార్టీతో సిద్దిపేట పోలీసులు స్వాగతం పలికారు. సీఎం స్థాయి వాళ్లకు మాత్రమే రోప్ పార్టీ ఏర్పాటు చేస్తారు. కాంగ్రెస్ పార్టీ ర్యాలీలో పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శించారు. అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి ర్యాలీ వెంట నడవడం గమనార్హం. మధ్యాహ్నం రెండు గంటల నుంచి చౌరస్తాలు, ఇతర ప్రాంతాల్లో డ్యూటీ లో లీనమయ్యారు. కాంగ్రెస్ ర్యాలీకి ముందు ట్రాఫిక్ జామ్ అయినా…రోడ్లపై భారీ క్రేన్లతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి వచ్చి పోయే వాహనాలకు ఇబ్బందులు కలిగినా పట్టించుకోలేదు గానీ… మామూలు ప్రజలపై తమ జులుం చూపించారు. చలో సిద్దిపేట పేరిట కాంగ్రెస్ మంగళ వారం నిర్వహించిన ర్యాలీలో ఆ పార్టీ నాయకుల గ్రూపులు మరో సారి బయటపడ్డాయి. సిద్దిపేటలో అది చేస్తాం..ఇది చేస్తాం వందలాది వాహనాలతో ర్యాలీ నిర్వహించి తమ సత్తా చాటుతామని చెప్పిన కాంగ్రెస్ ఆదిలోనే తుస్సుమంది.సిద్దిపేట పట్టణంలో బీజేఆర్ చౌరస్తా నుంచి ర్యాలీ ప్రారంభమై న్యూ, పాత బస్టాండ్ మీదుగా ముస్తాబాద్ చౌరస్తా నుంచి కోమటి చెరువు (కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయ భూమి పూజ స్థలికి ) చేరుకుంది. సిద్దిపేట నియోజకవర్గంలో క్యాడర్ లేక ఇతర ప్రాంతాల నుంచి అరువు తెచ్చుకొని సిద్దిపేటలో షో చేశారు తప్పా..మరేమి లేదని సొంత పార్టీ నేతలే విమర్శలు చేస్తున్నారు. ఈ సమావేశానికి రోడ్డు రవాణశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖతో పాటు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఆయన కుమారుడు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ తదితరులు హాజరవుతారని విస్తృత ప్రచారం చేశారు.
మంత్రులు మొహం చాటేశారు. ముందు రోజు సిద్దిపేటలో మంత్రి పొన్నం ప్రభాకర్ షెడ్యూల్ సైతం విడుదలైంది. దీంతో కాంగ్రెస్లో ఉన్న గ్రూపులు బట్టబయలయ్యాయి. చివరకు మైనంపల్లి హన్మంతరావు, మెదక్ ఎమ్మెల్యే రొహిత్ వీరిద్దరు తండ్రి కొడుకులు తమ వెంట బయట నుంచి తెచ్చుకున్న క్యాడర్ను సిద్దిపేటలో షో చేశారు. స్థానికంగా ఉన్న క్యాడర్లో ఎవరి గ్రూపులు వారికే ఉన్నాయి. ఈ ర్యాలీకి ఎక్కడి గ్రూపు వారు అక్కడే ఉండి ఒకరికొకరు కలువకుండా మైనంపల్లి స్వాగతం పలికారు. ర్యాలీ ప్రారంభం కాక ముందే గంటల తరబడి బీజేఆర్ చౌరస్తా వద్ద వన్ వే చేయడంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బంది పడ్డారు.పెద్ద పెద్ద క్రేన్లు, ఫ్లెక్సీలు కట్టి నడి రోడ్డుపై ఉంచారు. ఇదంతా పోలీసుల కనుసన్నల్లోనే జరిగింది. ట్రాఫిక్ ఆంక్షలతో అంబులెన్స్లు వెళ్లడానికి కూడా ఇబ్బంది కలిగింది. సోమవారం అర్ధరాత్రి ఇటీవల కాంగ్రెస్లో చేరిన చక్రధర్గౌడ్కు సంబంధించిన ఫ్లెక్సీలను ఇతర వర్గం వారు చింపివేశారు. దీంతో ఆగ్రహించిన ఆయన వర్గీయులు ఫ్లెక్సీలు చింపిన వారిపై సిద్దిపేట వన్టౌన్ పీఎస్లో ఫిర్యాదు చేశారు. సిద్దిపేటలో కాంగ్రెస్ క్యాంపు కార్యాలయానికి భూమి పూజ ఉందని కొందరు, చలో సిద్దిపేట అని మరికొందరు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నారు. మొత్తంగా ఎవరి వారే అన్నట్లుగా వ్యవహరించారు.