చేర్యాల, జనవరి 17 : చేర్యాల మున్సిపల్ చైర్పర్సన్ అంకుగారి స్వరూపారాణి, వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్రెడ్డిపై బీఆర్ఎస్ కౌన్సిలర్లతో కలిసి కాంగ్రెస్ కౌన్సిలర్లు ప్రకటించిన అవిశ్వాసం ప్రక్రియ సద్దుమణిగింది. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డిని హైదరాబాద్లోని ఆయన నివాసంలో బుధవారం వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్రెడ్డి, బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ మంగోలు చంటి, కౌన్సిలర్లు పచ్చిమడ్ల సతీశ్, చైర్పర్సన్ భర్త అంకుగారి శ్రీధర్రెడ్డి, కౌన్సిలర్ జుబేదాఖతూన్ కుమారుడు బబ్లూ, కౌన్సిలర్ యాట కనకమ్మ భర్త యాదగిరి కలిసి పురపాలక సంఘం అభివృద్ధితో పాటు అవిశ్వాసం రద్దుపర్చే చర్యలు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి తనదైన శైలిలో చక్రం తిప్పి బీఆర్ఎస్ చైర్పర్సన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లతో రెండు సార్లు చర్చలు జరిపి అవిశ్వాసం వీగిపోయేందుకు కృతకృత్యుడు కావడంతో గులాబీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేశాయి.
గత మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 5 వార్డులు,కాంగ్రెస్ 5 వార్డులు గెలుచుకోగా మరో రెండు వార్డుల్లో ఇండిపెండెంట్లు విజయం సాధించారు. ఇరువురు ఇండిపెండెంట్లు నిమ్మ రాజీవ్రెడ్డి, జుబేదాఖతూన్ అనంతరం జరిగిన పరిణామాలతో బీఆర్ఎస్లో చేరడంతో చేర్యాల మొదటి మున్సిపల్పై గులాబీ జెండా ఎగిరింది. అనంతరం జరిగిన కొన్ని పరిణామాలతో ఇతర పార్టీ వారితో కలిసి ఇటీవల అవిశ్వాసం రంగం సిద్ధం చేసి సిద్దిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ను కలిసి అవిశ్వాస పత్రం అందజేశారు. దీంతో ఈ నెల 19న అవిశ్వాస సమావేశం నిర్వహించేందుకు సంబంధితశాఖ అధికారులు చర్యలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, పార్టీ కౌన్సిలర్లతో మాట్లాడి అవిశ్వాసాన్ని కాస్తా విశ్వాసంగా మార్చారు.