వెల్దుర్తి, ఎప్రిల్ 12: అసెంబ్లీ ఎన్నికల్లో అమలుకానీ హామీలిచ్చి అబద్ధాలతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్కు పార్లమెంట్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి నాయకులు, కార్యకర్తలకు సూచించారు. శుక్రవారం వెల్దుర్తిలోని ఓ ఫంక్షన్ హాల్లో వెల్దుర్తి, మాసాయిపేట మండలాల కార్యకర్తల సన్నాహక సమావేశాన్ని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అధ్యక్షతన నిర్వహించగా సమావేశానికి ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సునీతాలక్ష్మారెడ్డి మాట్లాడుతూ…కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 120 రోజులు దాటినా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. రైతులకు చేస్తామన్న రుణమాఫీ, రూ.15వేల రైతుబంధు ఏమయ్యాయని, మహిళలకు నెలకు రూ.2,500 ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగడం లేదన్నారు. ఉద్యమాలతో సాధించిన తెలంగాణను మాజీ సీఎం కేసీఆర్ అభివృద్ధి పథంలో నడిపితే… ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుంటుపడిందన్నారు.
పదేండ్ల కేసీఆర్ అభివృద్ధి పాలనకు, 120 రోజుల అబద్ధాల కాంగ్రెస్ పాలనకు ఉన్న వ్యత్యాసాలను ప్రజలు గమనించాలన్నారు. ఉద్యమాల గడ్డ మెదక్ గడ్డపై మరోసారి గులాబీ జెండా ఎగురవేయాలని, ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. వెంకట్రామిరెడ్డి ప్రతిఒక్కరికీ అందుబాటులో ఉండి సేవ చేస్తారన్నారు. కేసీఆర్ హయాంలో ఎకరా పంట కూడా ఎండిపోలేదని, ప్రస్తుతం 20లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కల్యాణలక్ష్మి , షాదీముబారక్ పథకాలతో పాటు తులం బంగారం ఇస్తామన్న హామీని కాంగ్రెస్ మర్చిపోయిందన్నారు. వారు ఇస్తామన్న తులం బంగారం పక్కనపెడితే.. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన రూ.లక్ష సైతం ఇవ్వడం లేదని ఎమ్మెల్యే మండిపడ్డారు. రఘునందన్రావు దుబ్బాకలో చిత్తుగా ఓడిపోయారని, ఎంపీ ఎన్నికల్లో కూడా డిపాజిట్ దక్కదన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి వెల్దుర్తి మండలంలో పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేశారని, వారికి రుణపడి ఉంటానని, ఏ సమయంలోనైనా కార్యకర్తలకు ఆపద వస్తే అందుబాటులో ఉండి, వారిని కంటిరెప్పలా కాపాడుకుంటానని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు.
ఎన్నికల్లో గెలిపించి.. ప్రజలకు సేవచేసే భాగ్యం కల్పించాలని ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి కార్యకర్తలను కోరారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో జాయింట్ కలెక్టర్, కలెక్టర్గా 11 ఏండ్లపాటు ప్రజలకు సేవలు అందించానన్నారు. ఇక్కడి సమస్యలపై పూర్తిగా అవగాహన ఉందని, ఎంపీగా గెలిపిస్తే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. వెల్దుర్తి మండలంలోని మేల్లూరు పోచమ్మ తల్లి సాక్షిగా గెలిచిన 90 రోజుల్లో రూ.100 కోట్లతో పీవీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేసి నిరుపేదల కుటుంబాల విద్యార్థులకు ఉచిత కోచింగ్, వృత్తి నైపుణ్య శిక్షణ ఇవ్వడంతోపాటు, నియోజకవర్గ కేంద్రమై నర్సాపూర్లో ప్రతి ఆరునెలలకు ఒకసారి జాబ్మేళా ఏర్పాటు చేసి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీనిచ్చారు. మహిళలకు సైతం కుట్టుమిషన్, స్వయం ఉపాధి శిక్షణ అందిస్తామన్నారు. నెల రోజులు తన వెంట నడిచి గెలిపిస్తే జీవితకాలం మీ వెంటే ఉంటానని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. తెలంగాణను దేశంలో మొదటిస్థానంలోనిలిపిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. ఆయన చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని వెంకట్రామిరెడ్డి అన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేషన్ చైర్మన్ దేవేందర్రెడ్డి, నాయకులు చంద్రగౌడ్, సింగాయిపల్లి గోపి, వెల్దుర్తి, మాసాయిపేట మండలాల అధ్యక్షులు భూపాల్రెడ్డి, మధుసూదన్రెడ్డి, జడ్పీటీసీ రమేశ్గౌడ్, ఎంపీటీసీ మోహన్రెడ్డి, సొసైటీ చైర్మన్ అనంతరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.