రామాయంపేట రూరల్, మే13: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మత్స్యకారులకు మంచి రోజులు వచ్చాయి. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో గ్రామాల్లో చెరువులు ఉన్నా చేప పిల్లలు పంపిణీ చేసేవారు కాదు. దీంతో వారికి జీవనోపాధి లేకుండా పోయింది. వ్యాపారం కూడా అంతంతా మాత్రంగానే ఉండేది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక మత్స్యకారుల జీవితాలు మారిపోయాయి. గ్రామగ్రామాన మత్స్య సహకార సంఘాలు, సభ్యుల సంఖ్య పెరిగింది. సొసైటీలు ఉన్న గ్రామాలకు ఉచితంగా చేపపిల్లలు ప్రభుత్వం అందజేస్తున్నది. మత్స్యకారుడు చనిపోతే రూ.5లక్షలు ఇస్తున్నది. సబ్సిడీలపై మోటర్ వాహనాలు అందించడం, చేపల చెరువులు నిర్మించుకోవడానికి నిధులు మంజూరు చేయడం లాంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది.
గతంలో చెరువుల్లో ఒకే కరం చేపలు పెంచడంతో సరిగ్గా అమ్ముడు పోక, ఆర్థికంగా నష్టపోయేవారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న వివిధ రకాల చేప పిల్లలను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్నది. దీంతో మత్స్య సందప పెరిగి, మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు. కొందరు పట్టణ ప్రాంతాల్లోని మార్కెట్లలో చేపలు విక్రయిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని చెరువుల్లో పెంచిన చేపలను హైదరాబాద్కూ తరలిస్తున్నారు. ఐదేండ్లలో మత్స్యకారులు ఊహించని రీతిలో ఆర్థికంగా అభివృద్ధి చెందారు. ఆయా చేపలను కిలోకు రూ.150 నుంచి 300 వరకు మార్కెట్లో అమ్ముతున్నారు.
ప్రభుత్వానికి రుణపడి ఉంటాం
తెలంగాణ ఏర్పడ్డాక మత్స్యకారులకు మంచి రోజులు వచ్చాయి. గతంలో చేపలు పట్టాలంటే ఆసక్తి చూపేవారు కాదు. చేపలు సరిగ్గా అమ్ముడు పోయేవి కాదు. రవాణా ఖర్చులు కూడా మిగిలేవి కావు. సబ్సిడీ వాహనాలతో రవాణ ఖర్చులు తగ్గాయి. చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేయడంతో ఆర్థిక భారం కూడా పడడంలేదు. అమ్మకాలు పెరిగాయి.
– కుస్తి రాజు, మత్స్యకారుడు, దామరచెర్వు
సంత రోజు తీరికే ఉండదు
రామాయంపేట చుట్టుపక్కల నుంచి తెచ్చిన చేపలను బుధవారం రోజు మార్కెట్లో అమ్ముతున్నాం. ఆయా గ్రామాల నుంచి చాలామంది చేప లు కొనడానికి వస్తుంటారు. మార్కె ట్ రోజు తీరిక ఉండదు. చేపలు శు భ్రం చేసేవారికి కూడా మంచి ఆదా యం ఉంటున్నది. కిలో చేపలను శుభ్రం చేసి ఇవ్వడానికి రూ.40 తీసుకుంటున్నారు. ఇదంతా ప్రభుత్వం దయ. సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం.
– స్వామి, చేపల వ్యాపారి
వల వేయడం నేర్చుకుంటున్నాం
తొనిగండ్ల గ్రామంలో చెరువులు ఉన్నాయి. అయినా ఇప్పటి వరకు సొసైటీ ఏర్పాటు కాలేదు. ఈవిషయంలో గత ప్రభుత్వాల హాయాంలో ఎంతో ప్రయత్నం చేశాం. కానీ శిఖం లేదు.ఇతర కారణాలు చెప్పి తప్పించుకోవడం జరిగింది. సొసైటీ ఏర్పాటు కోసం ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ హయాంలో మత్స్యశాఖ అధికారులు ధరఖాస్తు చేసుకున్నాం.వలలు వేయడం నేర్చుకోవాలని వలలు వేయడం వస్తే సొసైటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. అందుకే వలలు వేయడం నేర్చుకుంటున్నాం.
– పిట్ల శామయ్య, తొనిగండ్ల