హవేళీఘనపూర్, ఏప్రిల్ 16 : మండల పరిధిలోని ముత్తాయిపల్లి గ్రామం మీదుగా పోచమ్మరాల్ గ్రామం పోచారం డ్యామ్ వరకు చేపడుతున్న ఎంన్ కెనాల్ పనులు పూర్తి కావస్తున్నాయి. ఎంఎన్, ఎఫ్ఎన్ కెనాల్ ఆధునీకరణ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.50 కోట్లను మంజూరు చేసింది. కాలువల ఆధునీకరణ పనులు నెల రోజుల క్రితం నుంచి జోరుగా సాగుతున్నాయి. కాలువల ఆధునీకరణ పనులు పూర్తయితే మండలంలోని ముత్తాయికోట, కూచన్పల్లి, ముత్తాయిపల్లి, సర్దన, ఫరీద్పూర్, జక్కన్నపే గ్రామ శివారులోని చివరి ఆయకట్టు వరకు ఉన్న రైతుల సాగునీటి ఇబ్బందులు తీరుతాయి. గతంలో ఘనపూర్ ఆనకట్టు నుంచి ఆయా గ్రామాలకు సాగునీరు రావాలంటే చాలా రోజులు పట్టేది. భారీస్థాయిలో నీటిని చాలా రోజులుగా విడుదల చేస్తేనే వచ్చే పరిస్థితి ఉండేది. ఘనపూర్ ఆయకట్టు నుంచి నీరు వదలినా ముత్తాయికోట వరకే వచ్చేది. దీంతో ముత్తాయిపల్లి, ఫరీద్పూర్, సర్దన, జక్కన్నపేట చివర ఉన్న పోచమ్మరాళ్ రైతులకు సాగునీటి కోసం అనేక తంటాలు పడేవారు. కాలువల ఆధునీకరణతో చివర ఉన్న పోచమ్మరాళ్ గ్రామాలకు సమృద్ధిగా సారునీరు వచ్చే అవకాశం ఉన్నది.
సాగునీటి ఇబ్బందులు తీరుతాయి
ఎంఎన్ కెనాల్ కాలువ చివరన జక్కన్నపేట గ్రామం ఉన్నది. కాలువ పూడికతో ఉండడంతో సాగునీరు వచ్చేది కాదు. యాసంగిలో ఎన్ని నీళ్లు వదిలినా కూచన్పల్లి గ్రామానికే వచ్చేవి. అక్కడితో ఆగిపోవడంతో మా పంటలు ఎండిపోయిన సందర్భాలు ఉన్నాయి. దీనిపై రైతులు పలుమార్లు అధికారులను వేడుకున్నా ఫలితం ఉండేది కాదు. ప్రస్తుతం కాలువ నిర్మాణంతో చివర ఉన్న పొలాలకు సాగునీరు అందుతుంది. ఇకపై సాగునీటికి ఇబ్బంది ఉండదు.
– సాయిలు, జక్కన్నపేట గ్రామం