న్యాల్కల్, జనవరి 3: ఆధునిక యంత్రాలు అందుబాటులోకి రావడంతో వ్యవసాయం చేసే రైతులకు పనిభారం తగ్గడంతోపాటు వ్యవసాయం చేయడం సులభతరం అవుతున్నది. వ్యవసాయం చేస్తున్న రైతులకు విత్తనాలు విత్తడం నుంచి కోతలు కోసే సమయంలో కూలీల కొరతతో ఇబ్బందులు తప్పడం లేదు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే మార్కెట్లోకి పలు కంపెనీలు అనేక రకాల ఆధునిక వ్యవసాయ పరికరాలు అందుబాటులోకి తీసుకొచ్చాయి. యంత్రాలతో విత్తనాలు విత్తడం నుంచి కోతలు కోస్తుండడం వల్ల రైతులు పడుతున్న ఇబ్బందులు దూరమవుతున్నాయి. మార్కెట్లో వరి, సోయా, శనగ, కంది, మొక్కజొన్న, జొన్న, చెరుకు పంటలను కోసే యంత్రాలు అందుబాటలోకి రైతులు వాటివైపు మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతం మండలంలో గ్రామాల్లో అధికంగా చెరుకు కోత పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
చెరుకును నరికేందుకు కూలీల కొరత తీవ్రంగా ఉంది. దీంతో నారాయణఖేడ్, మనూర్, కంగ్టి, కల్హేర్, పిట్లం తదితర ప్రాంతాల నుంచి కూలీలను తీసుకొచ్చి చెరుకును నరికి కర్మాగారాలకు తరలిస్తున్నారు. ఇటీవల మండలంలోని రుక్మాపూర్ గ్రామ శివారులోని ఓ రైతు పొలానికి నిజాంసాగర్ ప్రాంతంలోని మాగి షుగర్ ఫ్యాక్టరీకి చెందిన చెరుకు నరికే యంత్రాన్ని తీసుకొచ్చారు. యంత్రసాయంతో పొలంలో సాగు చేసిన చెరుకును రెండు, మూడు గంటల్లోనే నరికి ముక్కలు చేసి లారీలు, ట్రాక్టర్లలో నింపి షుగర్ ఫ్యాక్టరీకి తరలిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న కూలీల తీవ్రత నుంచి తక్కవ సమయంతో చెరుకు నరికి కర్మాగారానికి తరలిస్తుండడంతో ఇబ్బందులు దూరమవుతాయని రైతులు అంటున్నారు. మండలంలోని ముంగి, కల్బేమల్, న్యాల్కల్, బసంతపూర్, మెటల్కుంట తదితర గ్రామాల్లోని పొలాల్లో సాగు చేసిన చెరుకు ఆధునిక యంత్రంతో నరికివేస్తుడంతో రైతులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.