మెదక్ మున్సిపాలిటీ, జనవరి 5 : వసతి గృహాల విద్యార్థులకు మంచి విద్యనందించాలని ఎమ్మెల్సీ యా దవరెడ్డి అన్నారు. జడ్పీ కార్యాలయంలో గురువారం 6వ స్థాయీ సంఘ సమావేశం జడ్పీటీసీ సంధ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్సీ, సాంఘిక సంక్షేమంపై సమీక్షించారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వసతి గృహాలతో పాటు సంక్షేమంపై వివరాలను ఆయా శాఖాల అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ముఖ్యంగా విద్యకు అధిక నిధులు ఖర్చు చేస్తున్నదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థిని, విద్యార్థులకు ప్రత్యేక గురుకుల పాఠశాలలు, కళాశాలలు, వసతిగృహాలు ఏర్పాటు చేసిందన్నారు.
గురుకుల పాఠశాలలు, వసతి గృహాల విద్యార్థులకు మంచి విద్య అందించి ఉన్నతమైన విద్యార్థులుగా తీర్చిదిద్దాలని సూచించారు. అంతేగాకుండా వసతిగృహాలు, గురుకులాల్లో సరైన మెనూ పాటింటి నాణ్యమైన భోజనాన్ని అందించాలన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా ఎంత మంది రుణ సౌకర్యం కల్పించారు, ఫ్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ విద్యార్థులకు కాస్మోటిక్ చార్జీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కులంతార వివాహాలు, అంబేద్కర్ ఓవర్ సీస్ విద్యానిధి పథకం తదితర పథకాల గురించి ఎమ్మెల్సీకి గిరిజనాభివృద్ధ్ది సంక్షేమ శాఖ అధికారి విజయలక్ష్మి, గిరిజన సంక్షేమాధికారి జెమ్లానాయక్, బీసీ సంక్షేమ సహాయధికారి నాగరాజుగౌడ్ వివరించారు.