చేర్యాల, నవంబర్ 18: దుష్ట కాంగ్రెస్ చేసిన పాపం వల్లనే తెలంగాణ రైతులకు శాపమైందని,ఎన్నికల కమిషన్కు కాంగ్రెస్ నల్లగొండ ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి లేఖ రాయడంతో రైతుల రుణమాఫీ, వడ్లు రాలిపోయిన పైసలు నిలిచిపోయాయని జనగామ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి తెలిపారు. శనివారం చేర్యాల ప్రజా ఆశీర్వాద సభలో పల్లా రాజేశ్వర్రెడ్డి మాట్లాడారు. బీఆర్ఎస్ ఏర్పాటు నుంచి చేర్యాల, జనగామ ప్రాంతాలు సీఎం కేసీఆర్ వెంటే నడిచాయని, జనగామ నియోజకవర్గ ప్రజలకు కేసీఆర్ అంటే అమితమైన ప్రేమ ఉందన్నారు. జనగామ నియోజకవర్గం సమగ్రాభివృద్ధి కోరుకుంటున్నదని, తనను జనగామ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి నేటి వరకు 100 గ్రామాలు, 42 వార్డుల్లో పర్యటించానని, ప్రజలు సంక్షేమం, అభివృద్ధి ఫలాలు అందుకున్నప్పటికీ మరిన్ని సమస్యలు తన దృష్టికి వచ్చాయన్నారు.జనగామ నియోజకవర్గానికి సీఎం కేసీఆర్ మూడు వేల డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయించారని, మరో 10వేల ఇండ్లు కేటాయిస్తే అన్ని వర్గాలకు సొంతింటి కళ నెరవేరుతుందన్నారు.ఎన్నికల ముగిసిన వెంటనే ప్రభుత్వం వారం రోజుల్లో వడ్లురాలిన పైసలతో పాటు రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేస్తుందని, రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదన్నారు.చేర్యాలలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, మినీ స్టేడియం, కొమురవెల్లి, ధూళిమిట్ట, మద్దూరు, తరగొప్పులలో ఐవోసీ భవనాలు నిర్మించాలని ప్రజలు కోరుకుంటున్నట్లు తెలిపారు.
సీఎం కేసీఆర్ దెబ్బకు దేవాదుల వద్ద నాటి సీఎం చంద్రబాబు ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారని, తద్వారా తపాస్పల్లి రిజర్వాయర్కు గోదావరి జలాలు రావడంతో ఈ ప్రాంతంలో భూగర్భజలాలు పెరిగి తాగు నీటి సమస్య తప్పిందన్నారు.తపాస్పల్లి రిజర్వాయర్ను పర్యాట కేంద్రంగా ఏర్పాటు చేస్తే ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకైన కొమురవెల్లి మల్లన్న ఆలయాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా ఏర్పాటు చేయాలని, సీఎం కేసీఆర్ పాలనలో కొమురవెల్లి ఎంతో ప్రగతి సాధించిందన్నారు. మల్లన్నసాగర్ నుంచి తపాస్పల్లికి నీటిని పంపింగ్ చేసే పనులు పూర్తి కాగానే 365 రోజుల పాటు రిజర్వాయర్లో నీటి నిల్వ ఉంటుందన్నారు.ఈ ప్రాంతంలో నీటి నిల్వల కోసం చెక్డ్యామ్లు నిర్మించాలని కోరారు.మద్దూరు మండలంలోని వీరబైరాన్పల్లిలో అమరుల సంస్మరణ కేంద్రం నిర్మించాలని, చేర్యాలలో తొలిదశ తెలంగాణ ఉద్యమకారులకు పింఛన్ సౌకర్యం కల్పించాలన్నారు.చేర్యాల, జనగామ ప్రాంతంలో 60వేల లీటర్ల పాలు నిత్యం వస్తున్నాయని,ఈ ప్రాంతంలో మిల్క్ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.
కాంగ్రెస్ జనగామ అభ్యర్థిని చూసి ఊసరవెల్లి సిగ్గుపడుతుందని, ప్రతి ఎన్నికలో ఏదో ఒకపార్టీ నుంచి పోటీ చేస్తున్నాడని, ఇప్పుడు నేను లోకల్ అంటున్నాడని, ఆయన చేర్యాల ప్రాంతంలో జన్మిస్తే నేను జనగామ ప్రాంతంలో పుట్టిన విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని పల్లా కోరారు. నాలుగు పార్టీలు మారిన వ్యక్తికి ఈ ప్రాంత ప్రజలే బుద్ధి చెప్పాలన్నారు.కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడి మాటలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని, జైలుకు వెళ్లిన ఒక దొంగ, బ్రోకర్ తనతో పాటు అధినేతను విమర్శిస్తున్నాడని, అసలు తెలంగాణ ఉద్యమంలో సదరు వ్యక్తి ఉన్నడా అన్ని ప్రశ్నించారు. తనను ఎక్కడ ఉంటాడో అనే వ్యక్తులకు జవాబుగా తాను జనగామలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని, జనగామలో నాలుగు రోజులు, చేర్యాలలో రెండు రోజులు ఉంటానని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ ప్రభుత్వ రంగంలో లక్షా 73వేల (పోలీస్, వ్యవసాయశాఖ, పంచాయతీ కార్యదర్శులు, విద్యుత్ తదితర రంగాల్లో) ఉద్యోగాలు భర్తీ చేశారని పల్లా తెలిపారు. ప్రైవేట్, ఐటీ రంగాల్లో మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధ వహించి మరో ఆరు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయించినట్లు తెలిపారు.2014లో మూడు లక్షలు ఉన్న ప్రైవేట్ , ఐటీ రంగాల్లో ఇప్పుడు తొమ్మిది లక్షల ఉద్యోగాలు చేరుకున్నట్లు వివరించారు.సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో జనగామలో ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. అసలు ఉన్న ఉద్యోగాలను ఊడబికిన కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ సర్కారు ఉద్యోగాలు ఇవ్వలేదని అసత్య ప్రచారం సిగ్గు చేటన్నారు.
ఆయిల్పామ్ పంటను రైతులు సాగు చేస్తున్నారని, జనగామ నియోజకవర్గంలో అత్యధికంగా వడ్లు పండుతున్నాయని, వీటికి అనుగుణంగా అగ్రో బేస్డ్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ నెలకొల్పితే ఉపాధిమార్గాలు మరింత మెరుగు పడుతాయని రాజేశ్వర్రెడ్డి అన్నారు. చేర్యాలలో ఉన్న పాలిటెక్నికల్ కళాశాలకు అనుగుణంగా ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ను కోరారు.చేర్యాల,కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాలతో చేర్యాలను రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ జనగామ సభలో ప్రకటించినప్పటి నుంచి చేర్యాల ప్రాంత ప్రజలు సంతోషంగా ఉన్నారని, డివిజన్ పేరిట రాజకీయాలు చేస్తున్న వారి నోర్లు మూతపడ్డాయన్నారు.చేర్యాల పెద్ద చెరువును సుందరీకరణ చేయాలని, జనగామ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ఫండ్ ఇవాలని సీఎం కేసీఆర్ను కోరారు. చేర్యాల పట్టణాన్ని అభివృద్ధి చేసేందుకు రూ.10కోట్ల ఎస్డీఎఫ్ ఫండ్ మంజూరు చేయాలని కోరారు.