సిద్దిపేట టౌన్, మార్చి 18 : ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్ట్ను తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని, వెంటనే ఆమెను విడుదల చేయాలని ఎమ్మార్పీఎస్ టీఎస్ సిద్దిపేట జిల్లా అధికార ప్రతినిధి దేవులపల్లి రాజేందర్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కవిత అరెస్టును నిరసిస్తూ సిద్దిపేట పాత బస్టాండ్ అంబేద్కర్ సర్కిల్ వద్ద సోమవారం రాస్తారోకో చేశారు.ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ..తెలంగాణ ప్రజల ఆత్మసైర్యాన్ని దెబ్బతీసే కుట్రలో భాగమే ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్ట్ అన్నారు.తెలంగాణ రాష్ట్ర సాధనలో అనేక సార్లు జైలుకు వెళ్లిన ఈ గడ్డకు జైలు గోడలు కొత్త కాదన్నారు. ఎమ్మెలీ,ఉద్యమ నాయకురాలు కవితను విడుదల చేయాలని, లేకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామన్నారు. నిరసనలో జిల్లా అధ్యక్షుడు రాజేందర్, వెంకటేశ్, రాజు, కృష్ణ, తిరుపతి, ఆంజనేయులు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.