గజ్వేల్, ఫిబ్రవరి 8: తెలంగాణలో కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు తప్పా కొత్తవాటికి దిక్కులేవని, ఇచ్చిన హామీలు తుంగలో తొక్కి అబద్ధ్దాలతో కాలం గడుపుతున్న రేవంత్రెడ్డికి ఓటుతో బుద్ధి చెప్పాలని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో బీఆర్ఎస్ ఒకటో వార్డు అభ్యర్థి కప్ప మమతకు మద్దతుగా ఆదివారం ఆయన క్యాసారంలో ఇంటింటి ప్రచారంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణశర్మ, ఏఎంసీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్తో కలిసి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గజ్వేల్లో కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ను ఆశీర్వదించాలన్నారు.
కాంగ్రెస్, బీజేపీలతో ఏమీ ప్రయోజనం ఉండదని, మోసపోకుండా ఉండాలన్నారు. మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డుల అభివృద్ధి కేసీఆర్తోనే సాధ్యమవుతుందని, ఇప్పటికే యూజీడీ, సీసీరోడ్లు, మురుగుకాల్వలు నిర్మించుకోవడంతో పాటు కుల సంఘాల భవనాలు నిర్మించుకున్నామన్నారు. రాబోయే ప్రభుత్వంలో కేసీఆర్, హరీశ్రావు సహకారంతో మరింత అభివృద్ధి చేసుకుందామన్నారు. గజ్వేల్లో మిగిలిన అభివృద్ధి పనులు ఎక్కడివి అక్కడే ఉన్నాయని, వాటిని పూర్తి చేసే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదన్నారు. ప్రచారంలో కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.