చేర్యాల, మే 23 :వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్ ఈనెల 27న జరుగనున్నది. సిద్దిపేట జిల్లాలోని చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మం డలాలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్ధానం పరిధిలోకి వస్తుండడంతో ఈ ప్రాంతంలోని పట్టభద్రులు ఓటు హక్కును వినియోగించుకునేందుకు సిద్ధమవుతున్నారు. చేర్యాల సబ్ డివిజన్ పరిధిలోని చేర్యాలలో 1558 ఓటర్లుకు గానూ 1686 మంది పురుషులు, 869 మహిళలు, కొమురవెల్లిలో 678 ఓటర్లలో 447 మంది పురుషులు, 231 మంది మహిళలు, మద్దూరులో 935 మంది ఓటర్లలో 642 మంది పురుషులు, 293 మంది మహిళలు, ధూళిమిట్టలో 511 మంది ఓటర్లలో 346 మంది పురుషులు, 165 మంది మహిళా ఓటర్లు ఉన్నా రు. అన్నివర్గాలకు చెందిన ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాన పార్టీలు ప్రచారానికి తెరలేపా యి. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి తనదైన శైలిలో జనగామ, చేర్యాల ప్రాంతాల్లో పట్టభద్రులు బీఆర్ఎస్కు ఓటు వేసేలా ప్రచారం చేస్తున్నారు.
వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల గ్రాడ్యుయే ట్స్ ఎమ్మెల్సీ స్థానానికి 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈనెల 27న పోలింగ్ జరగనుండడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారం నిర్వహిస్తున్నారు. పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ గా ఉన్న పల్లా రాజేశ్వర్రెడ్డి జనగామ ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించడంతో ఈ స్థ్ధానానికి ఉప ఎన్నిక జరుగుతున్నది. ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు కొత్తగా 1000 మందికి పైగా ఓటర్లు నమోదు చేసుకున్నారు. బీఆర్ఎస్ నుంచి విద్యావంతుడైన ఏనుగుల రాకేశ్రెడ్డి, కాంగ్రెస్ నుంచి చింతపండు నవీన్కుమార్, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి పోటీలో ఉన్నారు.
చేర్యాల సబ్ డివిజన్లో పరిధిలో 4679 మంది గ్రాడ్యుయేట్స్ ఓట్లు వేసేందుకు ఎన్నికల అధికారులు 5 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. చేర్యాలలో 2, కొమురవెల్లి 1, మద్దూరులో 1, ధూళిమిట్టలో 1 పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశా రు. ఆయా కేంద్రాలో గ్రాడ్యుయేట్స్ బ్యాలెట్ పేపర్లో తమ అభ్యర్థ్ధులకు ప్రాధాన్యతను రూపంలో ఓటు వేయాల్సి ఉంటుంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ రెండు రోజుల క్రితం ఉప ఎన్నిక ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్, సీపీలతోపాటు హుస్నాబాద్ ఏసీసీ, చేర్యాల సీఐ శ్రీనులతో వీడి యో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు ఆదే శాలు జారీ చేశారు.