హుస్నాబాద్, నవంబర్ 10: ఒకప్పుడు ఎట్లుండె హుస్నాబాద్.. ఇప్పుడెట్లయింది.. అని ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ అన్నారు. 2014కు ముందు సౌకర్యాల లేమితో ఇబ్బందులు పడ్డ హుస్నాబాద్ పట్టణ ప్రజలు ప్రస్తుతం సకల సౌకర్యాల కల్పనతో సమస్యల నుంచి బయటపడ్డారన్నారు. కోట్లాది రూపాయల నిధులు తెచ్చి పట్టణాన్ని అభివృద్ధి చేశామని, పట్టణ ప్రజలు మరోసారి ఆశీర్వదించి గెలిపిస్తే నంబర్వన్గా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. శుక్రవారం పట్టణంలోని ఆరెపల్లిలో గల 8, 9, 18,19వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై పూలమాలలు వేసి, మంగళహారతులతో ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. ఇంటింటికీ వెళ్లి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఎమ్మెల్యే ఓటర్లను కోరారు. యాదవులు గొంగడి కప్పి గొర్రెపిల్లను బహూకరించారు. మరికొందరు గుమ్మడి కాయతో ఎమ్మెల్యేకు దిష్టితీసి ఎన్నికల్లో విజయం సాధించాలని దీవించారు. అనంతరం ఆరెపల్లి చౌరస్తాలో జరిగిన రోడ్షోలో ఎమ్మెల్యే సతీశ్కుమార్ మాట్లాడుతూ పట్టణంలో రూ.50కోట్లకు పైగా నిధులతో అభివృద్ధి జరిగిందని చెప్పారు.
కొందరు కొత్త నాయకులు వచ్చి మాయమాటలు చెప్పి తప్పుదోవ పట్టించే కుట్రలు జరుగుతున్నాయని, ప్రజలు వారి నమ్మొద్దని సూచించారు. కరీంనగర్లో చెల్లని రూపాయి హుస్నాబాద్లో ఎలా చెల్లుతుందని ప్రశ్నించారు. కరీంనగర్లో పలుమార్లు ఓడిపోయిన వ్యక్తి అక్కడ గత్యంతరం లేక హుస్నాబాద్కు వచ్చి ఏమో ఒరగబెడతానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఇటువంటి చెల్లని నాయకుల మాటలు నమ్మకుండా కారు గుర్తుకు ఓటు వేసి హుస్నాబాద్ పట్టణ అభివృద్ధికి బాటలు వేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకన్న, వైస్చైర్పర్సన్ అయిలేని అనితారెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఎండీ అన్వర్, వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్టి గోపాల్రెడ్డి, వార్డు కౌన్సిలర్లు, పార్టీ వార్డు ఇన్చార్జిలు, బూత్ కమిటీ సభ్యులు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.