నర్సాపూర్, మే30 : రైతులను ఆదుకోవడంలో కాంగ్రేస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్యే సునితాలక్ష్మారెడ్డి ధ్వజమెత్తారు. ఈ సందర్బంగా ఆమె శుక్రవారం కాంగ్రేస్ ప్రభుత్వం రైతులపై అవలంభిస్తున్న నిర్లక్ష్యాన్ని తెలియజేస్తూ ప్రెస్నోట్ రిలీజ్ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రేస్ ప్రభుత్వం నిర్లక్ష్యం మూలంగా వడ్ల కొనుగోలు సరిగ్గా జరుగకపోవడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని వెల్లడించారు. కొనుగోలు కేంద్రాల వద్ద వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో రైతులకు నష్టం జరుగుతుందన్నారు.
ఇప్పటికే జూన్ నెలకి విత్తనాలు అవసరం ఉన్నప్పటికి విత్తనాలు రైతులకి అందుబాటులో లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా భూమి సారవంతానికి అవసరమైన జీలుగ, జనుము విత్తనాలు అవసరమైన మోతాదులో అందుబాటులో లేవనే సమాచారం రైతులను ఆందోళనకు గురిచేస్తోందని అన్నారు. రైతుల ఇబ్బందులు మా దృష్టికి రాగానే వెంటనే వ్యవసాయ శాఖ సెక్రటరీ, కమిషనర్లతో మాట్లాడడం జరిగిందని గుర్తుచేశారు.
నర్సాపూర్ నియోజకవర్గానికి అవసరమైన విత్తనాలు వెంటనే అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు ఇప్పటికే పలుమార్లు ఫోన్లో తెలియజేయడం జరిగిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పడు రైతుల పక్షాన నిలుస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వం చేసే తప్పిదాల వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా రైతుల సంక్షేమం కోసం మా పోరాటం నిరంతరంగా కొనసాగుతుందని తెలిపారు.