వెల్దుర్తి, ఏప్రిల్ 22: వ్యవసాయానికి విద్యుత్ సరిగ్గా రాకపోవడంతో చేతికి వచ్చే పంటలు ఎండిపోతున్నాయని, నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం మాసాయిపేట మండలంలోని రామంతాపూర్ తండాకు వచ్చిన ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి దృష్టికి పంట ఎండిపోయిన విషయాన్ని తీసుకెళ్లగా ఆమె ఎండిన రెండు ఎకరాల వరి పంటను పరిశీలించి, రైతు చవాన్కల్షాను ఓదార్చారు.
అనంతరం ఎ మ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులంటే పట్టింపులేదని, వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వైపు పంటలు ఎండిపోయి మరోవైపు ధాన్యం కొనుగోళ్లు లేక అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి, మంత్రు లు ఇతర పార్టీల నాయకులను చేర్చుకుంటూ, ప్రచారాలు చేస్తూ బిజీబిజీగా గడుపుతున్నారని మండిపడ్డారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వెంట శివ్వంపేట ఎంపీపీ హరికృష్ణ, జిల్లా కోఆప్షన్ సభ్యుడు మన్సూర్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చంద్రాగౌడ్, శ్రీనునాయక్, మోహన్రెడ్డిలతోపాటు పలువురు నాయకులు ఉన్నారు.