శివ్వంపేట, మే 17: రైతులు వరిధాన్యం కాంటా వేశాక అధికారులే బాధ్యత వహించాలని, రైస్మిల్లులో అన్లోడ్ అయ్యేవరకు రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని అధికారుల తీరుపై మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మె ల్యే సునీతాలక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలోని చిన్నగొట్టిముక్ల, చెన్నాపూర్ గ్రామాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలను ఆమె పరిశీలించి, రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
రైతుల సమస్యలు విన్న అనంతరం జిల్లా అదనపు కలెక్టర్కు ఫోన్ చేసి మాట్లాడారు. రైతులు ధాన్యం కాంటా వేయగానే ట్రక్షీట్ ఇవ్వాలని, రైస్మిల్లులో అన్లోడ్ అయ్యేవరకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఒక్కసారి ధాన్యం కాంటా వేయగానే రైతులకు ట్రక్షీట్ ఇచ్చి రైస్మిల్లులో అన్లోడ్ అయ్యేవరకు అధికారులే బాధ్యత వహించాలన్నారు. ధాన్యం కాంటా వేసేటప్పుడు రెండున్నర కిలోలు, అన్లోడింగ్ చేసేటప్పుడు రెండున్నర కిలోలు కోత పెట్టడంతో రైతులు నష్టపోతున్నారని తెలిపారు. వారం క్రితం రైతుల పక్షాన బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేస్తే రెండు లారీలు వచ్చాయని, అప్పటి నుంచి మళ్లీ ఒక్కలారీ రాలేదన్నారు.
వడ్లన్నీ కొనుగోలు కేంద్రాల్లో కుప్పలుగా ఉన్నాయని, వర్షం వస్తే రైతుల పరిస్థితి ఏమిటని, అధికారులందరూ రైతుల కోసం ఫీల్డ్ విజిట్ చేసి వారికి అండగా నిలువాలని సూచించారు. రైస్మిల్లర్ల దగ్గర స్టోరేజీ లేకపోతే ఎక్కడైనా గోడౌన్స్ ఏర్పాటు చేయాలని అదనపు కలెక్టర్కు సూచించారు. ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమణాగౌడ్, సర్పంచ్లు నారాయణరావు, కొమురయ్య, అశోక్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు యాదాగౌడ్, నర్సింహారెడ్డి, మర్రి కృష్ణారెడ్డి, బోళ్ల భిక్షపతి, ప్రభాకర్రెడ్డి, బోళ్ల ఆంజనేయులు, పూల అర్జున్, పాపయ్యచారి, స్థానిక రైతులు ఉన్నారు.