సంగారెడ్డి కలెక్టరేట్, ఏప్రిల్ 20: రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్, బీజేపీలకు కర్రుకాల్చి వాత పెట్టాలని మాజీమంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గాలి అనిల్కుమార్కు మద్దతుగా శనివారం ఆయన సంగారెడ్డి కలెక్టరేట్కు వచ్చారు. అనంతరం మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని, అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలం అయిందన్నారు. అధికారంలోకి వచ్చిన 100రోజుల్లో రుణమాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు మాట మారుస్తుందన్నారు. రుణమాఫీ ఇస్తామని చెప్పలేదని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పడం హాస్యాస్పదంగా ఉన్నదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 హామీల్లో 13 అంశాలు ఉన్నాయని, అందులో ఏ ఒక్కటీ పూర్తిగా అమలైన దాఖలాలు లేవన్నారు. బీజేపీ ప్రభుత్వం రాష్ర్టానికి చేసిందేమీ లేదని, కేంద్రం ఇవ్వగలిగిన మెడికల్ కళాశాల, రోడ్ల వంటివి కూడా ఇవ్వలేదన్నారు. ఏ మొఖం పెట్టుకొని తెలంగాణ ప్రజలను మోదీ ఓట్లు అడుగుతారో చెప్పాలన్నారు. అతితక్కువ కాలంలో రాష్ర్టాన్ని అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు. రాష్ర్టాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసి దేశంలోనే నెంబర్వన్ స్థాయిలో నిలిపారన్నారు. మే 13న రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్న వెనుకబడిన తరగతుల ముద్దుబిడ్డ గాలి అనిల్ కుమార్ను గెలిపించి ధర్మాన్ని కాపాడుకుందామని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష, అభివృద్ధిపై కేసీఅర్కు ఉన్న అవగాహన మరెవ్వరికీ లేదన్నారు. గాలి అనిల్కుమార్కు విజయం చేకూరాలని ఆయన ఆకాంక్షించారు. పోచారం వెంట జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి గాలి అనిల్కుమార్ తదితర నాయకులు ఉన్నారు.