చేర్యాల, మార్చి 15: రైతులంటే కాంగ్రెస్ సర్కారుకు అలుసుగా మారిందని, ఎన్నికల ముందుకు అబద్ధ్దాలు ప్రచారం చేసి ఓట్లు వేయించుకుని అధికార పీఠంపై కూర్చోగానే అన్నదాతల అక్రందనలు సర్కారు పెద్దల చెవులకు ఎక్కడం లేదని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన చేర్యాల మున్సిపాలిటీతో పాటు మండలంలోని ముస్త్యాలలో పర్యటించారు. చేర్యాలలో విలేకరులతో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమ్మక్క బ్యారేజ్లో గోదావరి జలాలు ఉన్నాయని, వాటిని వెంటనే లిఫ్ట్ చేసి ధర్మసాగర్ రిజర్వాయర్కు పంపింగ్ చేయాలని, అక్కడ నుంచి బొమ్మకూరుకు నీటిని పంపించి వెంట నే మద్దూరు మండలంలోని లద్నూర్, కొమురవెల్లి మండలంలోని తపాస్పల్లి రిజర్వాయర్లకు నీటిని పంపింగ్ చేయాలని డిమాండ్ చేశారు.
పదేండ్ల కేసీఆర్ పాలనలో ఏరోజూ పంటలు ఎండిపోనియ్య లేదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే పంటలు ఎండిపోతున్నాయని, కాంగ్రెస్ నాయకులకు కాళేశ్వరం ప్రాజెక్టు, దేవాదుల ప్రాజెక్టుకు తేడా తెలియదన్నారు. దేవాదుల వద్ద గోదావరి జలాల లభ్యత పుష్కలంగా ఉందని, వెంటనే అధికారులు నీటిని లిఫ్ట్ చేయాలని సంబంధిత శాఖ అధికారులతో ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు. రైతులకు ఇప్పటి వరకు రైతుబంధు సాయం అందలేదని, రూ.2లక్షల రుణమాఫీ హామీ అటకెక్కించారని విమర్శించారు.
ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు, ప్రారంభోత్సవాల వద్ద ప్రజాప్రతినిధులను ప్రొటోకాల్ పాటించకుండా అవమానిస్తున్నారని, దానిని మానుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అంకుగారి స్వరూపరాణిశ్రీధర్రెడ్డి, వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్రెడ్డి, బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ మంగోలు చంటి, కౌన్సిలర్ పచ్చిమడ్ల సతీశ్గౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ముస్త్యాల బాల్నర్సయ్య, అంజయ్య, గదరాజు చందు, అకుల రాజేశ్గౌడ్, బీరెడ్డి ఇన్నారెడ్డి, మంచాల కొండయ్య, బూరగోని తిరుపతిగౌడ్, సిద్దిరాములు ఉన్నారు.
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి చేర్యాల, ముస్త్యాల గ్రామాల్లో పర్యటించారు. సీడీపీ నిధులు నుంచి సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రూ.10లక్షలతో తూర్పుగుంటూరుపల్లి రోడ్డు నుంచి వైశ్య వైకుంఠధామం వరకు వెల్లే సీసీ రోడ్డు నిర్మాణ పనులతో పాటు రూ.10 లక్షల వ్యయంతో నాలుగో వార్డులో నిర్మించే సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. అనంతరం బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ముస్త్యాల నాగేశ్వర్రావును, చర్చ్ ఫాస్టర్ మోజస్పాల్ను పరామర్శించారు.
రైస్మిల్లర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు నేతి నారాయణపై పలువురు దాడి చేసిన ఘటనలో తీవ్ర ఆందోళనలో ఉన్న ఆయన్ని ఎమ్మెల్యే పరామర్శించి మనోధైర్యం కల్పించారు. అనంతరం ముస్త్యాల బీఆర్ఎస్ మహిళా గ్రామశాఖ అధ్యక్షురాలు పెద్దింటి కౌసల్యను పరామర్శించారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ వుల్లంపల్లి కరుణాకర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అనంతుల మల్లేశం, ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర కార్యదర్శి గదరాజు యాదగిరి, సర్పంచ్ల ఫోరం మండల మాజీ అధ్యక్షుడు పెడుతల ఎల్లారెడ్డి, మాజీ సర్పంచ్ యేనుగుల దుర్గయ్య, కొంగరి గిరిధర్ పాల్గొన్నారు.