మంజీరా నది ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నది. గరుడగంగ మంజీరా పుష్కరాలను రంగంపేట ఆశ్రమ పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి శనివారం ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. మొదటి రోజు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు.మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. సరస్వతి మాతను దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ వచ్చాక తొలి పుష్కరాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. పుష్కరాల్లో స్నానం చేస్తే సర్వపాపాలు హరించుకుపోతాయని, ప్రతి ఒక్కరూ పుణ్యస్నానాలు చేసి పునీతులు కావాలని అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులు, ఆలయ నిర్వాహకులకు సూచించారు.
– మెదక్ రూరల్, ఏప్రిల్ 22
మెదక్ రూరల్, ఏప్రిల్ 22 : పుష్కర స్నానం ఆచరిస్తే సర్వపాపాలు హరించుకుపోయి పునీతులౌతారని రంగంపేట ఆశ్రమ పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి అన్నారు. మెదక్ మండల పరిధిలోని పేరూరు సరస్వతి ఆలయం సమీపంలోని గరుడగంగ మంజీర పుష్కరాలను శనివారం మాధవానంద సరస్వతి గంగమాతకు ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. అనంతరం శివలింగానికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించి సరస్వతి మాతకు పూజలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుష్కరాల్లో స్నానం ఆచరిస్తే మనం చేసిన పాపాలు తొలిగిపోవడమే కాకుండా పితృదేవతలకు శాంతి చేకూరుతుందన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ పుష్కర స్నానం ఆచరించి పునీతులు కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు దొర్బల రాజమౌళి శర్మ, మహేష్ శర్మ, వైద్య శ్రీనివాస్ శర్మతో పాటు తదితరులు పాల్గొన్నారు.
పుష్కరాల్లో పుణ్యస్నానాలు ఆచరిస్తే పూర్వీకులకు ముక్తి లభిస్తుందని సీఎం రాజకీయ కార్యదర్శి, మెదక్ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి అన్నారు. మంజీర పుష్కరాలకు ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి దంపతులు హాజరవ్వగా ఆలయ నిర్వాహకులు దోర్బల రాజమౌళి శర్మ ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా వేద పండితులు, వేద మంత్రాల మధ్య మంజీర నదిలో కుటుంబసమేతంగా పుష్కర స్నానాలు ఆచరించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గరుడగంగ పుష్కరాలు ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. 12 సంవత్సరాల క్రితం ఇక్కడ జరిగిన పుష్కరాల్లో అప్పటి ఉద్యమ నాయకుడు, నేటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారని, అలాగే తెలంగాణ వ్యాప్తంగా అన్ని నదుల పుష్కరాలను ప్రారంభించారని గుర్తు చేశారు. పుష్కరాలను ప్రచారం చేసి, భక్తులకు సమాచారం అందించాలని, పరిశుభ్రత పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎంపీవో ప్రశాంత్కు ఎమ్మెల్సీ సూచించారు. అలాగే, పుష్కరాల్లో జిల్లా న్యాయమూర్తి లక్ష్మీశారదా, మత్య్స అభివృద్ధి శాఖ అధికారి రజిని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్లు. నాయకులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.
పుష్కర స్నానాలు చేసి పునీతులుకండి ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మొదటి పుష్కరాలు వచ్చాయని, ఈ పుష్కరాల్లో ప్రతి ఒక్కరూ స్నానం ఆచరించి పునీతులు కావాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి కోరారు. గరుడ గంగా మంజీర పుష్కరాల్లో ఎమ్మెల్యే పాల్గొని పుష్కర ఘాట్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మంజీర పుష్కర స్నానం చేసి పునీతులు కావాలని, ప్రత్యేక తెలంగాణలో మొదటి సారి పుష్కరాలు నిర్వహించడం ఆనందంగా ఉందని అన్నారు.