హవేళీఘనపూర్/ మెదక్ మున్సిపాలిటీ/ రామాయంపేట, ఏప్రిల్ 26: ప్రకృతి వైపరీత్యాలతో పంటలు దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని, అధైర్యపడొద్దని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి భరోసా కల్పించారు. మెదక్ జిల్లా హవేళీఘనపూర్ మండలంలోని కూచన్పల్లిలో ఈదురుగాలులు, వడగండ్ల వానతో దెబ్బతిన్న పంటలను బుధవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పంటలు చేతికొచ్చే సమయంలో ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోవడం బాధాకరమన్నారు. పంటనష్టం వివరాలను అధికారులు పక్కాగా సేకరించాలని ఆదేశించారు. ఆరబోసిన ధాన్యం తడిసిపోయిందని రైతులు ఆందోళన చెందవద్దని, తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశిస్తామన్నారు.
మంగళవారం రాత్రి వర్షంతో ఇంటిపై రేకులు కొట్టుకుపోవడంతో పాటు కొన్ని ఇండ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయని, పూర్తిగా నష్టపోయిన రైతులకు తక్షణ సహాయం అందజేస్తామన్నారు. కూచన్పల్లిలో ప్రమాదవశాత్తు రెండు ఇండ్లు కాలిపోయాయని, వీరికి తక్షణ సాయం కింద నగదును అందజేసి డబుల్ బెడ్రూం ఇండ్లు ఇప్పించేందుకు పరిశీలిస్తామన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా పంట నష్టం వివరాలు వ్యవసాయ అధికారులు సేకరిస్తున్నారని, రిపోర్టు వచ్చిన వెంటనే సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు దృష్టికి తీసుకెళ్లి రైతులకు పరిహారం అందిస్తామని హామీనిచ్చారు. కార్యక్రమంలో ఆర్డీవో సాయిరాం, బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడాల సతీశ్, తహసీల్దార్ నవీన్, సర్పంచ్ దేవాగౌడ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు సోములు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, ఆత్మకమిటీ చైర్మన్ అంజాగౌడ్, ఫరీద్పూర్ ఎంపీటీసీ రాజయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సాప సాయిలు, తొగిట సర్పంచ్ మంద శ్రీహరి, బీఆర్ఎస్వీ నాయకులు కొంపల్లి సుభాశ్, కిష్టాగౌడ్, యాదగిరి, నవీన్, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.
దెబ్బతిన్న ఇండ్ల పరిశీలన..
మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి జిల్లా కేంద్రమైన మెదక్ 17వ వార్డులోని సంజీవయ్య కాలనీలో రేకులు ఎగిరిపోయి పలు ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. బుధవారం ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి మున్సిపల్ చైర్మన్తో కలిసి ఆయా కుటుంబాలను పరామర్శించారు. ఆయా కుటుంబాలకు తక్షణ సాయం అందించాలని మున్సిపల్ కమిషనర్ జానకీరాం సాగర్కు సూచించారు. ప్రభుత్వ పరంగా ఆర్థిక సాయం అందజేస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేవెంట తహసీల్దార్ శ్రీనివాస్, వార్డు కౌన్సిలర్ రాజలింగం, మాజీ కౌన్సిలర్ చంద్రశేఖర్గౌడ్, బీఆర్ఎస్ నాయకులు తదితరులున్నారు.
రామాయంపేటలో 1339 ఎరాల పంట నష్టం
ఈదురు గాలులతో కూడిన భారీ వడగళ్ల వానకు రామాయంపేట పట్టణంతో పాటు మండలంలోని సుతారిపల్లి, డి.ధర్మారం, దంతెపల్లి, లక్ష్మాపూర్, తొనిగండ్ల, కాట్రియాల, శివ్వాయపల్లి, అక్కన్నపేట తదితర గ్రామాల్లో వరి పంట చేతికి రాకుండా పోయింది. పంటలను పరిశీలించేందు కోసం వ్యవసాయ, రెవెన్యు శాఖల అధికారులు బుధవారం ఉదయమే గ్రామాల్లో సర్వేలు చేపట్టారు. రామాయంపేట మండల వ్యాప్తంగా 1339 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లిందని వ్యవసాయ అధికారి రాజ్నారాయణ తెలిపారు. ఇదిలాఉండగా, రామాయంపేట మండలం తొనిగండ్లలో నష్టపోయిన వరి పంటలను ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పరిశీలించి, రైతులను ఓదార్చారు. రామాయంపేట మండల వ్యాప్తంగా వరిపంట నష్టాన్ని వ్యవసాయాధికారి ద్వారా వివరాలు తెలుసుకున్నారు.