మెదక్ నూతన కలెక్టరేట్ భవన నిర్మాణ పనులు మార్చి 10వ తేదీ నాటికి పూర్తి చేయాలని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఇంజినీరింగ్ అధికారులకు, వర్క్ ఏజెన్సీ ప్రతినిధులకు సూచించారు. ఆమె బుధవారం కలెక్టర్ రాజర్షి షా, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, జడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యరెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, సంబంధిత అధికారులతో కలిసి ఔరంగాబాద్లో నూతన కలెక్టరేట్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలకు సమయం, డబ్బు వృథా కాకుండా అన్ని శాఖల కార్యాలయాలు ఒకే ప్రాంగణంలో ఉండేలా 33 ఎకరాల విస్తీర్ణంలో రూ.59 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ భవనం నిర్మిస్తున్నామని చెప్పారు.
– మెదక్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ)
మెదక్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): నూతన కలెక్టరేట్ భవన నిర్మాణ పనులు మార్చి 10వ తేదీ నాటికి పూర్తి చేయాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ఇంజినీరింగ్ అధికారులు, ఏజెన్సీలకు ఆదేశించారు. బుధవారం కలెక్టర్ రాజర్షి షా, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, జడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యరెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, సంబంధిత అధికారులతో కలిసి ఔరంగాబాద్లో నిర్మిస్తున్న ఐడీవోసీ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలకు సమయం, డబ్బు వృథా కాకుండా అన్ని శాఖల కార్యాలయాలు ఒకే ప్రాంగణంలో ఉండేలా 33 ఎకరాల సువిశాలమైన ప్రాంతంలో రూ.59 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ భవనం నిర్మిస్తున్నామన్నారు.
వేసవి కాలం సమీపిస్తుండడంతో పాటు యాసంగి పంట కోత దశకు వస్తున్నందున మార్చి రెండో వారంలోగా అన్ని పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు. అధిక సంఖ్యలో కూలీలను పెట్టి వివిధ దశల్లో మిగిలిపోయిన పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. సీసీ రోడ్లు, ప్రహరీ, పెయింటింగ్ , విద్యుదీకరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సీసీ రోడ్డును రెసిడెన్షియల్ క్వార్టర్స్ వరకు పొడగించాలని, అందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.
భవన సముదాయంలో చకటి లాన్ ఏర్పాటు చేసి, డ్రిప్ సిస్టం ద్వారా వాటి నిర్వహణ కొనసాగిస్తూ ఆహ్లాద వాతావరణం కల్పించాలని ఉద్యాన వన శాఖాధికారికి సూచించారు. పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసి వేప, రావి వంటి నీడనిచ్చే మొక్కలతో పాటు పూల మొకలు పెంచాల్సిందిగా జిల్లా అటవీ శాఖ అధికారికి సూచించారు. కార్యక్రమంలో ఆర్అండ్బీ ఎస్ఈ వసంత నాయర్, డిప్యూటీ ఈఈ వెంకటేశం, ఏజెన్సీ నిర్వాహకుడు రమేశ్ చాబ్రా, డీఎఫ్వో రవిప్రసాద్, ఉద్యాన శాఖాధికారి నర్సయ్య, మున్సిపల్ కమిషనర్ జానకీరామ్ సాగర్, ఆర్డీవో సాయిరామ్, తహసీల్దార్ కె.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.