చేర్యాల, డిసెంబర్ 2 : ప్రధాని మోదీ, అమిత్షాలు ఐటీ, ఈడీ దాడులతో టీఆర్ఎస్ నేతలపై తప్పుడు కేసులు పెట్టి భయపెట్టలేరని, కేసులు, జైళ్లు కొత్త కాదని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో శుక్రవారం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీతో పాటు టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్రంలో అధికారం వెలగబెడుతున్న మోదీ, అమిత్షాలు 8 రాష్ర్టాల్లో ప్రభుత్వాలు పడగొట్టి అడ్డదారిన అధికారంలోకి వచ్చి పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారు. తెలంగాణలో కూడా సర్కారును కూల్చేందుకు కుట్ర చేసి అడ్డంగా దొరికిపోయారన్నారు. తెలంగాణ ప్రజల కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ను భయపెట్టి లొంగదీసుకునేందుకు మంత్రులు, ముఖ్య నేతలపై బీజేపీ ఈడీ, ఐటీలతో దాడులు చేయిస్తున్నదని తెలిపారు. టీఆర్ఎస్ నేతలను ముట్టకుంటే తెలంగాణ సమాజం భగ్గుమంటుందన్నారు. సీఎం కేసీఆర్తో పెట్టుకుంటే వారిని ఎవరూ కాపాడలేరని, తప్పు చేస్తే ఈడీ, ఐటీలకు భయపడుతారని స్పష్టం చేశారు. తిన్నది కక్కిస్తం.. లోపల వేస్తం అంటే ఇక్కడ ఎవరు గాజులు పెట్టుకొని కూర్చొలేదనే విషయాన్ని బీజేపీ నేతలు గమనించాలన్నారు.
కాంగ్రెస్, బీజేపీతో కుమ్ముకై సీఎం కేసీఆర్ను తెలంగాణ వరకే పరిమితం చేయాలని చూస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ కేంద్రంగా సీఎం కేసీఆర్ బీఆర్ఎస్తో దేశంలోని అన్నిరాష్ర్టాల సమస్యలు పరిష్కరిస్తారని, ముం దుకు దూసుకుపోతారన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ వెంటే ఉంటారన్నారు. గులాబీ శ్రేణులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన సమ యం ఆసన్నమైందని, శత్రువులు ఒక్కటవుతున్నప్పుడు టీఆర్ఎస్ నాయకులు ఐక్యంగా ఉండాలని సూచించారు. జనగామ నియోజకవర్గ వ్యాప్తంగా కల్యాణలక్ష్మి పథకం ద్వారా రూ.150 కోట్లు అన్నివర్గాల ప్రజలకు పార్టీలకు అతీతంగా అందజేసినట్లు తెలిపారు. చేర్యాల మండలంలో రూ.22 కోట్లు మేర కల్యాణలక్ష్మి చెక్కులు అందజేసినట్లు తెలిపారు. చేర్యాలలో త్వరలో కోర్టు ఏర్పాటు కానుందని, రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అంశం సీఎం కేసీఆర్ పరిశీలనలో ఉందని, డివిజన్ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సమావేశంలో ఎంపీపీ కరుణాకర్, జడ్పీటీసీ శెట్టె మల్లేశం, మున్సిపల్ చైర్పర్సన్ అంకుగారి స్వరూపరాణీశ్రీధర్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ సుంకరి మల్లేశంగౌడ్, వైస్ చైర్మన్ పుర్మ వెంకట్రెడ్డి, టౌన్, మం డల అధ్యక్షులు ముస్త్యాల నాగేశ్వర్రావు, అనంతుల మల్లేశం, పచ్చిమడ్ల మానస, మీస పార్వతీ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ముస్త్యాల బాల్నర్సయ్య, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ తాడెం రంజితాకృష్ణమూర్తి, పీఏసీఎస్ చైర్మన్ వంగ చంద్రారెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు పెడుతల ఎల్లారెడ్డి, కౌన్సిలర్లు, టెంపుల్, మార్కెట్ డైరెక్టర్లు, టీఆర్ఎస్వై నాలుగు మండలాల ఇన్చార్జి శివగారి అంజయ్య తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, బీజేపీ కుట్రలను ఎక్కడికక్కడ అడ్డుకొని టీఆర్ఎస్కు అండగా ఉంటామని సమావేశానికి వచ్చిన మహిళలు, ప్రజలు చేతులెత్తి మద్దతు తెలిపారు.
సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న పథకాలు, అమలు చేస్తున్న కార్యక్రమాలపై ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని, కార్యకర్తలు తిప్పికొట్టాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో టీఆర్ఎస్ పట్టణ, మండల కార్యకర్తల సమావేశం పార్టీ అధ్యక్షుడు ముస్త్యాల నాగేశ్వర్రావు, అనంతుల మల్లే శం అధ్యక్షత జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రానున్న రోజుల్లో ప్రతిపక్షాల ఎత్తులను ఎలా చిత్తు చేయాలో కార్యకర్తలకు అవగాహన కల్పించారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని, గడగడపకూ కార్యకర్త వెళ్లి సమస్యలు పరిష్కరించాలన్నారు. కార్యకర్తలు ఐక్యమత్యంగా సమన్వయం తో పని చేయాలని, పార్టీ విజయానికి కృషి చేయాలని సూచించారు.