ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ రాష్ట్రంలో పారదర్శక పాలన అందిస్తున్నదని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. శనివారం జిన్నారంలో జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి హాజరై మాట్లాడారు. బడుగు, బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం వివిధ పథకాలను అందజేస్తున్న దన్నారు. ప్రతిష్టాత్మకంగా అందజేస్తున్న పథకాలను ప్రతిపక్షాలు విమర్శించడం అర్ధరహితమన్నారు.
– జిన్నారం, సెప్టెంబర్ 9
జిన్నారం, సెప్టెంబర్ 9: నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు, పట్టణాలు, మున్సిపాలిటీల్లో సంక్షేమం, అభివృద్ధికే అధిక ప్రాధాన్యతనిస్తూ పూర్తి పారదర్శక పాలన అందిస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఎంపీపీ రవీందర్గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత, మైనార్టీ, బీసీబంధు, గృహలక్ష్మి పథకాలు విప్లవాత్మకమైనవన్నారు. దళితబంధుపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు అర్థ రహితమైనవన్నారు.
బడుగు బలహీన వర్గాల జీవితాల్లో కొత్త వెలుగులు నింపేందుకే ప్రభుత్వం ఈ పథకాలు తీసుకొచ్చిందన్నారు. అర్హులైన వారిని ఎంపిక చేస్తూ విడతల వారీగా అమలుచేస్తున్నామన్నారు. ఏ సంక్షేమ పథకం ప్రారంభించినా మొదటిసారే అందరికీ అమలుచేయడం ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కాదన్నారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేయడం సిగ్గు చేటన్నారు. సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలపే కాంగ్రెస్, బీజేపీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో అమలుచేయడం చేతకాక విమర్శలు చేయడం అర్థ రహితమన్నారు.
నిబంధనలు పాటించని పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలని పీసీబీ ఈఈ కుమార్ పాఠక్కు ఎమ్మెల్యే తెలిపారు. శివనగర్, జిన్నారం, ఊట్ల, కొడకంచి గ్రామాల్లో తరుచూ కరెంటు సమస్యలు వస్తున్నాయని, ఆయా గ్రామాల సర్పంచ్లు ఎమ్మెల్యేకు తెలిపారు. ఖాజీపల్లిలో 186 బోగస్ ఓట్లు ఉన్నాయని, దీనిపై విచారించి, తొలిగించాలని ఎంపీటీసీ భార్గవ్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. డీఎంఎఫ్ నిధులు రూ.10 లక్షలు ఖాజీపల్లి గ్రామానికి వస్తే రెండున్నరేండ్ల క్రితం చేసిన పనికి తీసుకున్నారన్నారు. మిషన్ భగీరథ నీళ్లు గ్రామాల్లోని ట్యాంకు నీటిలో కలిసి పోవడంతో ప్రభుత్వ ఉద్దేశం నీరుగారుతోందని ఎంపీటీసీ వెంకటేశంగౌడ్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు తెలిపారు. మండల పరిషత్కు నిధులు కేటాయించాలని ఎంపీపీ రవీందర్గౌడ్ కోరారు.
నియోజకవర్గంలోని జర్నలిస్టులకు ఈనెల 21న ఇండ్ల స్థలాల పట్టాలు అందజేస్తానని ఎమ్మెల్యే ప్రకటించారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులుగా ఉంటూ ప్రజల సంక్షేమం కోసం నిత్యం పని చేసే జర్నలిస్టులకు నియోజకవర్గ కేంద్రంలో ఇండ్ల స్థలాల పట్టాలు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో రాములు, సూపరింటెండెంట్ రాములు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.