తొగుట: దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ( MLA Kotha Prabhakar Reddy ) నిరంతరం కృషి చేస్తున్నారని బీఆర్ఎస్ తొగుట మండల అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి ( Ramreddy ) పేర్కొన్నారు. ఎమ్మెల్యే సహకారంతో తొగుట మండలానికి 54 ఇందిరమ్మ ఇళ్లు (Indiramma Houses) మంజూరు కాగా, వెంకట్రావుపేట గ్రామంలో సర్పంచ్ బండారి కవిత స్వామిగౌడ్తో కలిసి 11మంది లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొగుట మండలంలోని 54మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం సంతోషకరమన్నారు. రెండవ విడతలో కూడా ఇళ్ల మంజూరు కోసం ప్రతిపాదనలు పంపించామని వివరించారు. ప్రజాప్రతినిధిగా ప్రభుత్వం అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల సంక్షేమం, గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా ఎమ్మెల్యే పనిచేస్తున్నారని కొనియాడారు.
ఇందిరమ్మ ఇళ్లతో పాటు సీసీ రోడ్లు, తాగునీటి , సాగునీటి సమస్యల పరిష్కారం, రైతుల ఇబ్బందులను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు ఎమ్మెల్యేకృషి చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ లచోళ్ల లింగం, పార్టీ గ్రామ అధ్యక్షుడు పులిగారి శివయ్య, వార్డు సభ్యులు వడ్డె లలిత, జహంగీర్, మిద్దె శ్రీనివాస్, నాయకులు పులిగారి లక్ష్మణ్, పాత్కుల స్వామి, మల్లేశం, సురేష్, కనకరాజు, గణేష్ తదితరులు పాల్గొన్నారు.