దుబ్బాక, ఏప్రిల్ 30: సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు పట్టాలు అందించాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్ హిమాయత్నగర్లో హౌసింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయంలో రాష్ట్ర హౌసింగ్శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్లు, ఆర్డీవోలు, హౌసింగ్శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డి పాల్గొని దుబ్బాక నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సమస్యలపై ప్రస్తావించారు. నియోజకవర్గంలో సుమారు 1000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిరుపయోగంగా మారాయని, అర్హులను గుర్తించి అందజేయాలని కోరారు. దుబ్బాక పట్టణంలో లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలు ఇవ్వలేదన్నారు. మరికొన్ని చోట్ల ఇండ్ల నిర్మాణాలు అర్ధంతరంగా నిలిపివేశారని, వాటిని పూర్తి చేసేందుకు సంబంధిత కాంట్రాక్టర్లను ఆదేశించాలని సూచించారు. నిర్మించిన ఇండ్ల కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి వసతులు కల్పించాలని కోరారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి తెలిపారు.
చేర్యాల, ఏప్రిల్ 30: తెలంగాణ ఇందిరమ్మ గృహాల పథకం వేగవంతం చేసే దిశగా ఉమ్మడి మెదక్ జిల్లా ముఖ్య సమావేశానికి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి హాజరయ్యారు. హైదరాబాద్లోని తెలంగాణ స్టేట్ హౌజింగ్ కార్పొరేషన్ భవనంలో రెవెన్యూ, హౌజింగ్శాఖల సమీక్షా సమావేశం జరిగింది. మంత్రులు సి.దామోదర్ రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్రెడ్డితో పాటు ఎమ్మెల్యే పల్లా హాజరైన జనగామ నియోజకవర్గంలోని చేర్యాల ప్రాంతంలో నెలకొన్న ఇందిరమ్మ ఇండ్ల సమస్యలను సమీక్షలో ప్రస్తావించారు. నియోజకవర్గంలోని సిద్దిపేట జిల్లా పరిధిలోకి వచ్చే చేర్యాల పట్టణానికి 54 గృహాలు, చేర్యాల మండలానికి 164, కొమురవెల్లికి 87, మద్దూరుకు 81, ధూళిమిట్ట మండలానికి 76 గృహాలు ఇప్పటికే మంజూరైనట్లు తెలిపారు.ఇందిరమ్మ ఇండ్ల కోసం నూతనంగా 145 దరఖాస్తులు వచ్చాయని వాటికి వెంటనే మంజూరు చేయాలని కోరారు.జనగామకు 800, చేర్యాలకు 462 ఇండ్లు మంజూరు చేశారని, అందులో అన్ని ఇండ్లు పురోగతిలో ఉన్నట్లు సమీక్షలో వెల్లడించారు.