దుబ్బాక/రాయపోల్, మార్చి 23: రైతులకు సాగునీళ్లు ఇవ్వని కాంగ్రెస్కు, మతం పేరుతో ప్రజల మధ్యన విద్వేషాలు రగిలిస్తున్న బీజేపీకి ఎంపీ ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు లేదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి విమర్శించారు. శనివారం రాయపోల్ మండలంలో ఆయన పర్యటించారు. కొత్తపల్లిలో బీఆర్ఎస్ అధ్యక్షుడు దాసరి బాలనర్సు కుటుంబాన్ని పరామర్శించారు. ఆనంతరం విలేకరులతో మాట్లాడుతూ… బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆశీస్సులతో రెండు పర్యాయాలు మెదక్ ఎంపీగా భారీ మెజార్టీతో తాను విజయం సాధించినట్లు గుర్తుచేశారు. దుబ్బాక ఎమ్మెల్యేగా సైతం విజయం సాధించానన్నారు.
ఆది నుంచి మెదక్ పార్లమెంట్ ప్రజలు బీఆర్ఎస్కు అండగా ఉన్నారన్నారు. మెదక్ అంటేనే ఉద్యమ ఖిల్లా అని, ప్రస్తుత ఎంపీ ఎన్నికల్లోనూ వెంకట్రామిరెడ్డి విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డికి ప్రజా పాలనపై పూర్తి అవగాహన ఉందన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించడంలో ఆయన దిట్ట అన్నారు. ఆయనకు ఉమ్మడి మెదక్ జిల్లాతో ప్రత్యేక అనుబంధం ఉందని గుర్తుచేశారు. మెదక్ ఎంపీగా వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించేందుకు పార్టీ శ్రేణులు కృషిచేయాలని పిలుపునిచ్చారు.