గుమ్మడిదల, ఏప్రిల్ 9: రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న గుమ్మడిదల మండలంలోని సీలింగ్ భూములపై కాంగ్రెస్ సర్కారు కన్నుపడింది. వేల కోట్ల రూపాయల విలువ చేసే భూములను టీజీఐఐసీ పేరిట లాక్కుని, కొందరికి కట్టబెట్టి సొమ్ముచేసుకోవాలని కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ఏండ్ల క్రితం ఇచ్చిన సీలింగ్ భూములు లాక్కుంటే తాము ఎలా బతకాలని రైతులు వాపోతున్నారు.
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని అన్నారంలో 261 సర్వేనంబర్లో 588.30 ఎకరాల సీలింగ్ భూములు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎక్స్ సర్వీస్మెన్లకు 5 ఎకరాల చొప్పున ఇందులో కొంత భూమిని కేటాయించింది. ఇది పోను 273 ఎకరాల ప్రభుత్వ భూమి కలదు. ఇందులో 108 ఎకరాల సన్న, చిన్నకారు రైతులకు ఎకరా చొప్పున ప్రభుత్వం గతంలో పట్టాలు అందజేసింది. 5 ఎకరాలు ఇండ్లు లేని నిరుపేదలకు స్థలాలు ఇచ్చింది. హనుమాన్ ఆలయానికి రెండు ఎకరాలు, ఆలయ పార్కింగ్ కోసం 5 ఎకరాలు, ఈద్గాకు రెండు ఎకరాలు, శ్మశాన వాటికకు రెండు ఎకరాలు, కబ్రస్థాన్కు ఒక ఎకరం, చర్చికి ఒక ఎకరం, ఇందిరమ్మ ఇండ్ల కోసం 25 ఎకరాల భూమిని 613 మంది పేదలకు కేటాయించింది. ఈ భూములను రియల్ వ్యాపారులు కబ్జా చేసుకుని సొమ్ము చేసుకుంటున్నారు.

అప్పటి భూస్వామి ఆలేటి వీరారెడ్డి 15(బీ) కింద 27 మంది రైతులకు భూమిని అమ్మినట్లు సమాచారం. దీని డాక్యుమెంట్లకు సంబంధించిన ఫైల్ నంబర్లు లేవని ఇటీవల ఆర్టీఐ చట్టం కింద దరఖాస్తు చేసిన 8వ వార్డు కౌన్సిలర్ బెంబడి సంజీవరెడ్డికి రెవెన్యూ అధికారులు సమాచారం అందజేశారు. 261లో బడా పరిశ్రమలు లీజుపేరిట కొంతమంది రైతుల వద్ద భూములు 99 ఎండ్లకు తీసుకున్నట్లు సమాచారం. ఈ భూముల్లో అధికారుల అండదండలతో పెద్దఎత్తున అక్రమంగా భవన నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ విషయంలో అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.
నాలుగేండ్ల క్రితం 261 సర్వేనంబర్ ప్రభుత్వ భూమిని అన్నారం గ్రామానికి చెందిన 117 మంది పేద రైతులకు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి నేతృత్వంలో ఎకరా చొప్పున పొజీషన్ చూపించి, పట్టాలు అందజేయించారు. కొంతమందికి పాసుబుక్కులు వచ్చి, ఆన్లైన్లో ఈ భూముల వివరాలు కనిపించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై పలుసార్లు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండాపోయింది. పట్టాలిచ్చిన పేదరైతులకు ఇప్పటివరకు రైతుబంధు వంటి పథకాలు వర్తించకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టాలు అందుకున్న రైతులు భూములు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
గుమ్మడిదల మున్సిపాలిటీలో పేదలకు చెందిన 109 సర్వేనంబర్ 160 ఎకరాల ప్రభుత్వ భూమిని కొన్ని నెలల క్రితం టీజీఐఐసీ పేర తీసుకుని పేద రైతులకు పరిహారం ఇచ్చింది. ఇందులో 15 మంది కోర్టును ఆశ్రయించగా, వారికి పరిహారం ఇవ్వలేదు. టీజీఐఐసీ స్వాధీనం చేసుకున్న 109 సర్వే నంబర్ ప్రభుత్వభూమిలో భూములు కోల్పోయిన పేద రైతులకు ఇంటి స్థలాల కోసం 5 ఎకరాలు కేటాయించినప్పటికీ, ఇప్పటి వరకు వంద గజాల నివాస స్థలాలను కేటాయించ లేదు.

బుధవారం కలెక్టర్ను పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి కలిసి పూర్తి వివరాలతో వినతి పత్రాన్ని అందజేశారు. భూములు కోల్పోయిన రైతులకు నివాస స్థలాల కోసం వందగజాల ప్లాట్లను కేటాయించాలని కోరారు. నివాస స్థలాలు కేటాయించకుంటే ప్రజా ఉద్యమం లేవనెత్తుతామని ఎమ్మెల్యే హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం టీజీఐఐసీ పేర పేదల భూములను దోపిడీ చేసి, ఉన్నత వర్గాల వారికి కేటాయిస్తున్నది. ప్రజలకు న్యాయం జరగాలి. ప్రభుత్వం తీరుమార్చుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం టీజీఐఐసీ పేర పేదల భూములు లాక్కొని పారిశ్రామిక రంగాన్ని విస్తరిస్తున్నామని పరిశ్రమలకు భూములు అప్పచెప్పి, రూ.కోట్లు దండుకుంటున్నదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే కోవలోకి కొత్తగా 261 సర్వేనంబర్ ప్రభుత్వ భూమిలో 117 మంది రైతులకు ఇచ్చిన భూములను టీజీఐఐసీకి ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నదని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ఆరోపించారు. పేదలకు ఇచ్చిన భూములను అప్పనంగా టీజీఐఐసీకి అప్పచెప్పి, ఆ భూములను పరిశ్రమవర్గాలకు కట్టబెట్టి సొమ్ము చేసుకోవాలని కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నదని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ఆరోపించారు. బుధవారం ఆయన సంగారెడ్డి కలెక్టర్ను కలిసి పేదలకు అన్యాయం జరగొద్దని వినతి పత్రాన్ని అందజేశారు.