సదాశివపేట, మే 22: ఆంక్షలు లేకుండా రైతుల నుంచి జొన్నలు కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ డిమాండ్ చేశారు. శుక్రవారం సంగారెడ్డి పట్టణంలో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. రైతులు పంటను మార్కెట్కు తెచ్చి, కాంటాకు రోజుల తరబడి ఎదురు చూస్తున్నారని తెలిపారు. సదాశివపేట పరిధిలో 4,693 ఎకరాల్లో జొన్న పంట సాగైందని, ఎకరానికి 30 నుంచి 35 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చిందన్నారు.
ప్రభుత్వం పరిమిత క్వింటాళ్లనే కొనుగోలు చేయడం తగదని ఎమ్మెల్యే అన్నారు. ఎకరాకు 20 క్విం టాళ్ల వరకు కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. టార్పాలిన్లు, గన్నీబ్యాగులు, తూకం యంత్రాలు, షెడ్లు వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్, కిసాన్ సంఘ్ అధ్యక్షుడు నరసింహారెడ్డి, అంజన్న, అక్బర్ హుస్సేన్, మల్లన్న, రైతులు పాల్గొన్నారు.