అల్లాదుర్గం, నవంబర్ 20 : ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటేయాలని అందోల్ బీఆర్ఎస్ అభ్యర్థి చంటి క్రాంతికిరణ్ పిలుపునిచ్చారు. అల్లాదుర్గం మండలంలోని గడిపెద్దాపూర్, ముస్లాపూర్, ముప్పారం గ్రామా ల్లో సోమవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డప్పు చప్పట్లు, మహిళలు మంగళహారతులతో క్రాంతికిరణ్కు ఘనంగా స్వాగతం పలికారు. మహిళలతో కలిసి నృత్యం చేశారు. ఇంటింటికీ తిరుగుతూ బీఆర్ఎస్ మ్యానిఫెస్టో ప్రజలకు వివరిస్తూ కారు గుర్తు కు ఓటు వేయాలని కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్తోనే అభివృద్ధి సాధ్యమని, మరోసారి బీఆర్ఎస్కు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్, బీజేపీ మాటలు నమొద్దు,ఆ పార్టీలతో ఒరిగేదేమి లేదన్నారు. రాష్ట్ర ప్రజల కోసం సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధ్దిని చూసి ప్రతిపక్షాలు ఓర్వలేక పోతున్నాయని విమర్శించారు.
రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించి రైతులను రాజు చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ సరిపోతుందని,10 హెచ్పీ మోటరు బిగించాలని అనడం సిగ్గుచేటన్నారు. రైతులు 24గంటల కరెంట్ కావాలా, 3 గంటలు కావాలా ఆలోంచుకోవాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇక ముందు కూడా ఇలాగే కొనసాగాలంటే కారు గుర్తుకు ఓటు వేసి ముచ్చటగా మూడోసారి కేసీఆర్ను సీఎం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ మఠం భిక్షపతి, గీతా కార్మికుల కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవి, మాజీ జడ్పీ చైర్మన్ బాలయ్య, ఎంపీపీ అనిల్కుమార్రెడ్డి, దక్షిణ మధ్య రైల్వే బోర్డు మెంబర్ కాశీనాథ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నర్సింహులు, మాజీ అధ్యక్షుడు బ్రహ్మం, పీఏసీఎస్ చైర్మన్ దుర్గారెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యుడు వరప్రసాద్, సర్పంచ్ మల్లేశం, ఎంపీటీసీ దశరథ్, బీఆర్ఎస్ నాయకులు ప్రకాశ్, పవన్, రవి, తదితరులు పాల్గొన్నారు.