అందోల్, నవంబర్ 17: మైనార్టీల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని హోంమంత్రి మహమూద్అలీ అన్నారు. రాష్ర్టాన్ని ఎన్నో ఏండ్లు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీల కోసం చేసిన అభివృద్ధి శూన్యమని వచ్చే ప్రభుత్వంలో మైనార్టీల సంక్షేమాకి మరిన్ని పథకాలు తీసుకురానున్నామన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్రెడ్డిలో ఉన్నది ఆర్ఎస్ఎస్ రక్తమని ఆ పార్టీకి ఓటువేస్తే మోసపోతామన్నారు. శుక్రవారం జోగిపేటలో మైనార్టీల ఆత్మీయసమ్మెళనం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హోమంత్రి ముస్లిం, మైనార్టీలందరూ కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ అభ్యర్థి క్రాంతికిరణ్ను గెలిపించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మైనార్టీల బతుకుల్లో ఎంతో మార్పువచ్చిందన్నారు. సీఎం కేసీఆర్ వారి కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని మరొక్కసారి గెలిపించుకుంటే మన బతుకుల మరింత మెరుగుపడుతాయని, కాంగ్రెస్ మాటలు విని ఆగం కావొద్దన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 204 మైనార్టీ స్కూళ్లను స్థాపించి వేలాది మంది ముస్లిం బిడ్డలకు నాణ్యమైన విద్యను అందిస్తున్నదన్నారు. మైనార్టీలు నేడు గొప్ప చదువులు చదువుతూ ఉన్నతంగా స్థిరపడుతున్నారని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ హయాంలో కులమతాల కొట్లాటలు లేవని, పాతబస్తీ సైతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. కాంగ్రెస్లో కూర్చీల కొట్లాట తగ్గలేదని, అందులో సీఎం క్యాండెట్లు ఎక్కువ అని విమర్శించారు. ఇక్కడి కాంగ్రెస్ అభ్యర్థి కోట్ల రూపాయలకు టికెట్లు అమ్ముకున్నారని, ఆ పార్టీ నేతలే ఆరోపిస్తున్నారని, అలాంటి నాయకుడు అందోల్కు అవసరమా అని ప్రశ్నించారు. గ్రామాల అభివృద్ధి, ప్రజా సంక్షేమంపై విజన్ ఉన్న నాయకుడు క్రాంతికిరణ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి, ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ భిక్షపతి మాట్లాడుతూ అందోల్లో క్రాంతికిరణ్ గెలుపు చారిత్రత్మకం కావాలన్నారు.
ఎల్లవేళలా ముస్లిం సోదరులకు అండగా ఉండే బీఆర్ఎస్ ప్రభుత్వానికి మరోసారి మీరందరూ అండగా ఉండి అందోల్లో సీఎం కేసీఆర్ బలపరిచిన తనను మెజార్టీతో గెలిపించాలని, అందుబాటులో ఉండి సేవచేసుకుంటానని ఎమ్మెల్యే అభ్యర్థి చంటి క్రాంతికిరణ్ అన్నారు. జోగిపేటలో రిక్షాకాలనీ, తోల్లబస్తీ గత ఎన్నికల ప్రచారంలో ఎంతో అధ్వానంగా ఉండేవని, తాను గెలిచిన వెంటనే అక్కడ సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించి అక్కడి పరిసరాలు పూర్తిగా మార్చేసినట్లు గుర్తు చేశారు. నియోజకవర్గం వ్యాప్తంగా ఎంతో అభివృద్ధి సాధించామని, మరోసారి తతను ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, స్టేట్ మార్కుఫెడ్ డైరెక్టర్ జగన్మోహన్రెడ్డి, నాయకులు నారాయణ, మైనార్టీ నాయకులు అర్ఫత్, పైజల్, షకీల్, షాబొద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
జోగిపేటలో నిర్వహించిన మైనార్టీ ఆత్మీయ సమ్మేళనం గ్రాండ్ సక్సెస్ అయ్యింది. అందోల్-జోగిపేట మున్సిపాలిటీతో పాటు అందోల్, వట్పల్లి, అల్లాదుర్గం, రేగోడ్, టేక్మాల్ మునిపల్లి, రాయికోడ్, పుల్కల్, చౌటకూర్ మండలాల నుంచి మైనార్టీ నాయకులు, యువత పెద్ద ఎత్తున తరలిరావడంతో జోగిపేట- సంగారెడ్డి ప్రధాన రహదారి గులాబీమయమైంది. సమావేశానికి తరలి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.