సంగారెడ్డి/ మెదక్ (నమస్తేతెలంగాణ)/ నారాయణఖేడ్, జూన్ 17 ;తాగునీటి సమస్యతో దశాబ్దాల పాటు ఇబ్బందులు పడ్డ ప్రజలకు ‘మిషన్ భగీరథ’తో సీఎం కేసీఆర్ శాశ్వత పరిష్కారం చూపించారు. రూ. వేల కోట్ల నిధులు కేటాయించి పల్లెలు, పట్టణాల్లో ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్నారు. రూ.1586 కోట్ల నిధులు ఖర్చు చేసి సంగారెడ్డి జిల్లాలోని 2,89,261 గృహాలకు ప్రభుత్వం శుద్ధనీటిని సరఫరా చేస్తున్నది. ఇందుకోసం సింగూరు ప్రాజెక్టు, మంజీరా రిజర్వాయర్ ద్వారా ఏటా 3.2 టీఎంసీల జలాలను వాడుకుంటున్నది. రూ.448 కోట్లతో 907వాటర్ ట్యాంకులను నిర్మించగా, 3103 కిలోమీటర్ల మేర అంతర్గత పైప్లైన్లను నిర్మించింది. మెదక్ జిల్లాలో రూ.1005.57 కోట్లతో పనులు పూర్తయ్యాయి. 469 గ్రామాలకు 4535.48 కిలోమీటర్ల పైపులైన్లు వేసి, 1,92,857 నల్లా కనెక్షన్ల ద్వారా నీరందిస్తున్నది. ఉమ్మడి పాలనలో కిలోమీటర్ల దూరం వెళ్లి వ్యవసాయబావులు, బోర్లు, చెలిమల నుంచి నీళ్లు తెచ్చుకునేందుకు అవస్థలు పడ్డ జనం నేడు మండు వేసవిలోనూ ఇంటి ముంగిటకే నీళ్లు వస్తుండడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నల్లా ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ నెరవేరింది. మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని అన్ని గ్రామాలకు బల్క్ వాటర్ సరఫరా అవుతున్నది. ఇంటింటికీ నల్లా కనెక్షన్లతో మెజార్టీ గృహాలకు నీటి సరఫరా అవుతున్నది. ఇందుకోసం రెండు జిల్లాల వ్యాప్తంగా వేల కిలోమీటర్ల మేర మిషన్ భగీరథ పైపులైన్లు వేశారు. పెద్ద ఎత్తున వాటర్ ట్యాంకుల నిర్మాణాలు చేపట్టారు. బిందెడు నీళ్ల కోసం గతంలో ఎన్నో కష్టాలు పడ్డామని, తమ కష్టాలు తీర్చిన సీఎం కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వానికి అన్నివర్గాల ప్రజలు, ప్రధానంగా మహిళలు కృతజ్ఞతలు చెబుతున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లా ప్రజలు తాగునీటి కోసం గోస పడేవారు. ఎండాకాలం వచ్చిదంటే చాలు తాగునీటి కష్టాలు మొదలయ్యేవి. చేతిపంపులు, బోర్లు ఎండిపోయి తాగునీరు లేక ప్రజలు అల్లాడిపోయేవారు. నారాయణఖేడ్, జహీరాబాద్ నియోజకవర్గాల్లోని మారుమూల ప్రాంతాల ప్రజలు తాగునీటి కోసం మరింత ఇక్కట్లు పడేవారు. తాగునీటి కోసం నారాయణఖేడ్ నియోజకవర్గంలోని పల్లె ప్రజలు, తండావాసులు కిలోమీటర్ల దూరం వెళ్లి తాగునీరు తెచ్చుకునేవారు. తాగునీటి కోసం ధర్నాలు, రాస్తారోకోలు చేయాల్సిన పరిస్థితి సంగారెడ్డి జిల్లాలో ఉండేది. జిల్లాకేంద్రమైన సంగారెడ్డిలో నల్లా గుంతలు తవ్వి తాగునీరు పట్టుకోవాల్సిన పరిస్థితి ఉండేది. తెలంగాణ ఆవిర్భావం, సీఎం కేసీఆర్ వచ్చాక సంగారెడ్డి జిల్లాలో తాగునీటి కష్టాలు తీరిపోయాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేనివిధంగా మిషన్భగీరథ పథకానికి శ్రీకారం చుట్టారు. మిషన్భగీరథతో సంగారెడ్డి జిల్లాలోని ఎనిమిది మున్సిపాలిటీలు, 944 ఆవాసా ప్రాంతాలకు ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇచ్చారు. ప్రభుత్వం రూ.1586 కోట్ల నిధులు ఖర్చు చేసి సంగారెడ్డి జిల్లాలోని అన్ని ప్రాంతాల ప్రజలకు తాగునీరు సరఫరా అయ్యేలా మిషన్భగీరథ పథకం అమలుచేసింది. ఒకప్పుడు సంగారెడ్డి జిల్లాలోని ప్రజలకు రోజుకు 55 ఎల్పీసీడీ(లీటర్స్ పర్ కాపిటీ పర్డే) తాగునీరు సరఫరా చేస్తే మిషన్భగీరథ ద్వారా గ్రామీణ ప్రజలకు 100 ఎల్పీసీడీ, పట్టణ ప్రజలకు 123 ఎల్పీసీడీ(లీటర్స్ పర్ కాపిటీ పర్డే) తాగునీటిని సరఫరా చేస్తున్నారు. జిల్లాలోని ప్రజలకు వందశాతం శుద్ధమైన తాగునీటిని మిషన్ భగీరథ ద్వారా ప్రభుత్వం సరఫరా చేస్తోంది.
రూ.1586 కోట్లతో మిషన్ భగీరథ పథకం
ఉమ్మడి పాలనలో అప్పటి ప్రభుత్వాలు సంగారెడ్డి జిల్లా ప్రజల తాగునీటి కష్టాలను పట్టించుకోలేదు. జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు, మంజీరా రిజర్వాయర్ నుంచి జిల్లా ప్రజలకు తాగునీరు సరఫరా చేసే అవకాశం ఉన్నప్పటికీ అప్పటి పాలకులు పట్టించుకోలేదు. జిల్లాలో మంజీరా నది ఉన్నప్పటికీ ఆ నీటిని పూర్తిగా హైదరాబాద్ ప్రజల తాగునీటి అవసరాలు తీర్చడానికే వినియోగించేవారు. సీఎం కేసీఆర్ అధికారం చేపట్టాక మంజీరా జలాలను పూర్తిగా జిల్లా ప్రజల సాగు, తాగునీటి అవసరాలకు కేటాయించారు. దీంతో ప్రజల తాగునీటి కష్టాలు తీరాయి. సింగూరు ప్రాజెక్టు ద్వారా మిషన్భగీరథకు 3.2 టీఎంసీ జలాలను కేటాయించారు. సంగారెడ్డి జిల్లాతోపాటు కామారెడ్డి జిల్లాకు మంజీరా జలాలను తీసుకెళ్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంగారెడ్డి జిల్లాలో మిషన్ భగీరథ పథకం అమలు కోసం సంగారెడ్డి జిల్లాకు రూ.1689 కోట్ల నిధులు విడుదల చేసింది. ఇందులో రూ.1586 కోట్ల నిధులు ఖర్చు చేసి మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు సరఫరా చేస్తున్నారు.
సింగూరు ప్రాజెక్టు, మంజీరా రిజర్వాయర్ ద్వారా ప్రతిఏటా 3.2 టీఎంసీల జలాలను వాడుకొంటున్నారు. సంగారెడ్డి జిల్లాలోని 944 ఆవాస ప్రాంతాలకు తాగునీటి సరఫరా చేస్తున్నారు. ఇందుకోసం రూ.448 కోట్లతో 907వాటర్ ట్యాంకులను నిర్మించారు. అలాగే 3103 కిలోమీటర్ల మేర అంతర్గత పైప్లైన్లను నిర్మించారు. జిల్లాలో మిషన్భగీరథ ద్వారా గ్రామాల్లో 2,89,261 గృహాలకు ఇంటింటికీ నలా ్లకనెక్షన్లు ఇచ్చి తాగునీటిని సరఫరా చేయడంతోపాటు జిల్లాలోని 115 రైతు వేదికలు, 578 వైకుంఠధామాలకు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. జిల్లాలోని ఎనిమిది మున్సిపాలిటీల్లో ఇంటింటికీ తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.523 కోట్ల నిధులు ఖర్చు చేసింది. పట్టణాల్లో 36,535 గృహాలకు నల్లా కనెక్షన్లు ఇచ్చారు.
బోరంచకు పిల్లనివ్వద్దు.. హద్నూర్కు ఎద్దు అమ్మొద్దు అనే సామెత వినే ఉంటారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మనూరు మండలంలోని బోరంచ గ్రామంలో పుట్టిన సామెత ఇది. గతంలో నియోజకవర్గంలో నీటి కష్టాలు ఏ స్థాయిలో ఉండేవో చెప్పడానికి ఈ సామెత ఒక నిదర్శనం. కాలానుగుణంగా సింగూరు ప్రాజెక్టు నిర్మాణం జరగడం.. ప్రాజెక్టు పరీవాహక ప్రాంతం తలాపునే బోరంచ గ్రామం ఉన్నప్పటికీ పరిస్థితిలో పెద్దగా మార్పేమి రాలేదనే చెప్పాలి. ఇక ఇతర గ్రామాల పరిస్థితి గతంలో బోరంచ గ్రామం ఉన్న దుస్థితికి భిన్నమేమి కాదు. సమైక్యరాష్ట్రంలోని పాలకుల నిర్లక్ష్యం ఫలితంగా ప్రజలు పడిన ఇబ్బందులు వర్ణణాతీతం. కిలోమీటర్ల కొలది కాలినడకన రెండుమూడేసి బిందెలు నెత్తిన మోసి.. పాతాళాన్ని తలపించే లోతైన బావుల్లోంచి నీటిని తోడి.. మంచాలపై స్నానాలు చేసి అవే నీటిని ఇతర అవసరాలకు వినియోగించిన చేదు అనుభవాలకు మిషన్ భగీరథ పథకం ఫుల్స్టాప్ పెట్టింది. బహుషా జిల్లాలో తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొన్న నియోజకవర్గం నారాయణఖేడ్ మాత్రమే అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. తరతరాలుగా నీటి గోసతో తండ్లాడుతున్న ఇక్కడి ప్రజల దాహార్తిని శాశ్వతంగా రూపుమాపడంలో మిషన్ భగీరథ పథకం ఒక వరప్రదాయినిగా పరిణమించిందని చెప్పవచ్చు.
పరిష్కారం జరిగిందిలా..
నారాయణఖేడ్ నియోజకవర్గానికి మిషన్ భగీరథ రూపంలో ఇప్పుడు శాశ్వత పరిష్కారం లభించింది. ముఖ్యంగా తండాలు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికీ నల్లా నీటి సరఫరా నిరాటంకంగా జరుగుతున్నది. ఇందు కోసం ప్రభుత్వం రూ.313 కోట్లు వెచ్చించగా నియోజకవర్గంలోని 193 పంచాయతీలకు గానూ 372 ఆవాస ప్రాంతాలకు స్వచ్ఛమైన నీరు సరఫరా అవుతున్నాయి. మంజీరా పరీవాహక ప్రాంతమైన రేగోడ్ మండలం తాటిపల్లి వద్ద భారీ ట్యాంకు నుంచి 530 కిలోమీటర్ల పైప్లైన్ ద్వారా వందశాతం ఆవాస ప్రాంతాలకు నీటి సరఫరా జరుగుతున్నది. నియోజకవర్గంలోని 372 ఆవాస ప్రాంతాలను నాలుగు రూట్లుగా విభజించి గ్రామాలకు నీటిని సరఫరా చేస్తున్నారు. ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన నీటిని అందించాలనే ఉద్దేశంతో పుల్కల్ మండలం పెద్దారెడ్డిపేట్ వద్ద సింగూరు పరీవాహక ప్రాంతంలో నిర్మించిన ఇంటెక్వెల్ సమీపంలోనే నీటిని శుద్ధిచేసేందుకు ‘వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్’ను సైతం ఏర్పాటు చేసి రక్షిత మంచినీటిని సరఫరా చేస్తున్నారు.
నేడు ‘మంచినీళ్ల పండగ’
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 18న ఆదివారం మంచినీళ్ల పండగ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు సంగారెడ్డి కలెక్టర్ శరత్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం 10 గంటలకు మునిపల్లి మండలం భూసారెడ్డిపల్లి నీటిశుద్ధి కేంద్రం వద్ద ప్రత్యేక కార్యక్రమం ఉంటుందన్నారు. మిషన్ భగీరథ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ను వివిధ వర్గాల ప్రజలు, పాత్రికేయులు, ప్రజాప్రతినిధులతో సందర్శన చేస్తారన్నారు. అనంతరం సభ నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, మత్స్యకారులు, వివిధ వర్గాల ప్రజలు, విద్యార్థులు, యువత పెద్దఎత్తున హాజరై విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు.
నీటి కష్టాలు తీర్చిన మిషన్ భగీరథ
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ పథకం నారాయణఖేడ్ ప్రజల మంచినీటి కష్టాలను శాశ్వతంగా తీర్చింది. గత ప్రభుత్వాలు మచ్చుకు కొన్ని చర్యలు తీసుకోవడం తప్ప, ప్రజల ఇబ్బందులను తీర్చాలనే చిత్తశుద్ధితో కృషి చేయలేదు. ప్రజల అవసరాలను గుర్తించి అందుకనుగుణంగా ప్రభుత్వం కృషి చేసింది. ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందించడమే లక్ష్యంగా భారీ వ్యయంతో చేపట్టిన మిషన్ భగీరథ పథకం సత్ఫలితాలనిస్తుంది.
– నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి