నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ రుణాలు అందిస్తున్నది. ఎస్సీ, బీసీతో పాటు మైనార్టీలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కృషిచేస్తున్నది. అందులోభాగంగా ఈ ఏడాది మైనార్టీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందించేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మెదక్ జిల్లాలో మొత్తం 56 యూనిట్ల కోసం రూ.55 లక్షలు కేటాయించింది. కేటగిరీ 1లో 39, కేటగిరీ 2లో 17 యూనిట్లు ఉన్నాయి. తీసుకున్న రుణంలో లబ్ధిదారుడికి 80శాతం సబ్సిడీ లభించనున్నది. వచ్చే నెల 5వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నారు.
– మెదక్, (నమస్తేతెలంగాణ) డిసెంబర్ 19
మెదక్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని కులాల నిరుద్యోగులు ఆర్థికంగా ఎదిగేందుకు సీఎం కేసీఆర్ కార్పొరేషన్ రుణాలు మంజూరుచేస్తున్నారు. ఎస్సీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగలకు ఆయా కార్పొరేషన్లతో సబ్సిడీ రుణాలు మంజూరుచేస్తున్నారు. రెండేండ్లుగా కరోనా నేపథ్యంలో మైనార్టీ కార్పొరేషన్లో నిరుద్యోగులకు సబ్సిడీ రుణాలు మంజూరు చేయలేదు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రుణాల నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో నాలుగేండ్లుగా ఎదురుచూస్తున్న వారికి ఉపశమనం కలగనున్నది.
జిల్లాలో 56 యూనిట్లు…రూ.55 లక్షలు
గతంలో 2016-17లో వంద శాతం సబ్సిడీ కింద ఎనిమిది మంది లబ్ధిదారులకు రూ.50 వేల చొప్పున రుణాలిచ్చారు. 2017-18 నుంచి 2021-22 వరకు రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ రుణాలకు నోటిఫికేషన్ జారీ చేయలేదు. ఇప్పుడు తాజాగా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్తో 2022-23 రుణాల మంజూరు దరఖాస్తులు ఆహ్వానించారు. దీంతో యువతీ యువకులు రుణాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. మైనార్టీ కార్పొరేషన్ ద్వారా జిల్లాలో 56 యూనిట్లకు రూ.55 లక్షల బడ్జెట్ కేటాయించారు. ఇందులో కేటగిరీ-1లో 39 యూనిట్లు మంజూరు కాగా, లబ్ధిదారులు రూ.లక్ష రుణం తీసుకుంటే రూ.80 వేలు సబ్సిడీ ఉంటుంది. మిగతా రూ.20 వేలు లబ్ధిదారులు చెల్లించాల్సి ఉంటుంది.
కేటగిరీ-2లో 17 యూనిటు ్లమంజూరయ్యాయి. ఇందులో రూ.2 లక్షల రుణం తీసుకుంటే, రూ.లక్షా 40వేలు సబ్సిడీ వర్తిస్తుంది. మిగతా రూ.60 వేలు లబ్ధిదారులు కట్టాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారైతే రూ.1,50 లక్షలు, పట్టణ ప్రాంతాల వారైతే రూ.2 లక్షల వార్షిక ఆదాయం కలిగిన వారు మాత్రమే అర్హులు. జనవరి 5వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నారు. అభ్యర్థులు వెబ్సైట్లో దరఖాస్తు చేసుకుని, సంబంధిత కాపీలు మున్సిపాలిటీ, మండల పరిషత్ కార్యాలయంలో అప్పగించాల్సి ఉంటుంది.
సబ్సిడీ రుణాలు సద్వినియోగం చేసుకోవాలి
జిల్లాలో మైనార్టీ నిరుద్యోగులు సబ్సిడీ రుణాల కోసం ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి. జనవరి 5వ తేదీ వరకు గడువు ఉంది. లబ్ధిదారులు దరఖాస్తులు చేసుకున్న తర్వాత సర్టిఫికెట్ల పరిశీలన చేసి ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేస్తాం.
– జెంల్లానాయక్, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి, మెదక్