అభివృద్ధిలో మన రాష్ట్రం దేశానికే దిక్సూచిగా మారిందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట కలెక్టరేట్ సమీపంలో పీవీ నరసింహరావు తెలంగాణ పశువైద్య కళాశాల భవన సముదాయానికి మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలకు నాణ్యమైన విద్యను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా జిల్లాలో ఎండాకాలంలోనూ చెరువులు, కుంటలు మత్తళ్లు దుంకుతున్నాయన్నారు. రిజర్వాయర్లు, చెరువులతో మత్స్యకారులకు ఉపాధి దొరుకుతున్నదన్నారు. మత్స్యసంపద వృద్ధిలో తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు. జిల్లాలో మొత్తం 12,460 మంది మత్స్యకారులకు కొత్తగా సభ్యత్వం ఇస్తున్నట్లు తెలిపారు.
– సిద్దిపేట అర్బన్, మే 7
సిద్దిపేట అర్బన్, మే 7: అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఆదర్శగా మారిందని మంత్రి హరీశ్రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట కలెక్టరేట్ కార్యాలయ సమీపంలో పీవీ నరసింహారావు తెలంగాణ పశువైద్య కళాశాల భవన సముదాయానికి జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్తో కలిసి మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, హరీశ్రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పథకాలను కాపీ కొడుతున్నదన్నారు. ఢిల్లీలో అవార్డులు ఇస్తూ.. గల్లీలోకి వచ్చి బీజేపీ నాయకులు తిడుతున్నారని విమర్శించారు. గతంలో రోజుకు 600 లారీల గొర్రెలు దిగుమతి చేసుకుంటే.. నేడు 19 కోట్ల గొర్రె పిల్లల సంపద పెంచుకొని దేశ విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణ రాష్ట్రం చేరిందన్నారు.
సీఎం కేసీఆర్, మంత్రి తలసాని శ్రీనివాస్ నాయకత్వంలో దేశంలోనే గొర్రె పిల్లల సంపదంలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉందన్నారు. రైతు ఏడ్చిన రాజ్యం ముందుకు పోదని.. అందుకే సీఎం కేసీఆర్ నాయకత్వంలో మూగజీవాలకు కూడా విస్తృత సేవలు చేస్తున్నట్లు తెలిపారు. 1962 నంబర్ పెట్టి పశువులకు అంబులెన్స్ సేవలు తెచ్చిన ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు. ఇదే నెంబర్ కేంద్రం కాపీ కొట్టి దేశమంతా అమలు చేస్తున్నట్లు తెలిపారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు పథకాలను కూడా కేంద్రం కాపీ కొట్టి దేశమంతా అమలు చేస్తుందన్నారు. దేశంలో తెలంగాణ జనాభా 3 శాతం ఉంటే 38 శాతం అవార్డులు రాష్ర్టానికి వచ్చాయన్నారు.
తెలంగాణ అభివృద్ధిలో దేశానికే దిక్సూచిగా మారిందన్నారు. ఐదు సంవత్సరాలు ఈ దేశానికి ప్రధాన మంత్రిగా పనిచేసిన దివంగత పీవీ నరసింహారావుకు కాంగ్రెస్వాళ్లు ఢిల్లీలో పీవీ ఘాట్ ఏర్పాటు కోసం స్థలం ఇవ్వలేదని.. కానీ సీఎం కేసీఆర్ హైదరాబాద్ నడిబొడ్డున పీవీ ఘాట్ ఏర్పాటు చేసి.. వెటర్నరీ విశ్వవిద్యాలయానికి పీవీ పేరు పెట్టి గౌరవించారన్నారు. అదే విధంగా కాళోజీ పేరు హెల్త్ యూనివర్సిటీకి, కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును హార్టికల్చర్ యూనివర్సిటీకి పెట్టుకొని వారిని గౌరవించామన్నారు. గత ప్రభుత్వాలు వీరిని పట్టించుకోలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల జిల్లాలో ఎండాకాలంలోనూ చెరువులు మత్తళ్లు దుంకుతున్నాయన్నారు. రిజర్వాయర్లు, చెరువుల వల్ల మత్స్యకారులకు ఉపాధి దొరుకుతుందన్నారు. సిద్దిపేట జిల్లాలో మొత్తం 12,460 మంది మత్స్యకారులకు కొత్తగా సభ్యత్వం ఇస్తున్నట్లు వెల్లడించారు.
ఇది తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్లనే సాధ్యమైందన్నారు. మత్స్య సంపద అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈనెల చివరి వారంలో సిద్దిపేట జిల్లాలో రెండో దశలో సుమారు 17, 500 మందికి గొర్రెలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. సిద్దిపేట జిల్లాకు వెటర్నరీ కళాశాల మంజూరు చేసిన సీఎం కేసీఆర్కు జిల్లా ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. పేదలకు తెలంగాణ ప్రభుత్వం నాణ్యమైన విద్యను అందిస్తున్నదన్నారు. సంవత్సరంలోపు ఈ వెటర్నరీ కళాశాల నిర్మాణం పూర్తి చేసుకొని ప్రారంభించుకుందామని తెలిపారు.
కమిట్మెంట్ ఉన్న నాయకత్వం ఉంటే ఏదైనా సాధ్యమే
కమిట్మెంట్ ఉన్న నాయకత్వం ఉంటే ఏదైనా సాధ్యమే అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తాను వెళ్తుంటే.. సిద్దిపేటలో ఉన్నానా.. హైదరాబాద్లో ఉన్నానా అని అనిపిందన్నారు. సిద్దిపేటలో ఉన్న నాయకులు, కార్యకర్తలు చాలా అదృష్టవంతులని.. మంత్రి హరీశ్రావు లాంటి కమిట్మెంట్ ఉన్న నాయకుడు ఉన్నాడన్నారు. సిద్దిపేట రూపురేఖలు పూర్తిగా మారిపోయాయన్నారు. నీటిపారుదలశాఖ మంత్రిగా ఉండి.. సీఎం కేసీఆర్ ప్రోత్సాహంతో రాష్ట్రమంతా అద్భుతాలు చేశాడన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అద్భుతమైన రిజర్వాయర్లు నిర్మించుకున్నామన్నారు. నీళ్లు, నిధులు నియామకాల మీద జరిగిన సుదీర్ఘ తెలంగాణ పోరాటానికి.. నేటి పచ్చని తెలంగాణే సమాధానమన్నారు.
టీఎస్పీఎస్సీ ద్వారా గతంలో లక్షా 37 వేల ఉద్యోగాలు ఇచ్చామని.. ఇపుడు 90 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వచ్చాయన్నారు. మత్స్య సొసైటీల్లో ఇప్పటికే 3.72 లక్షల మంది సభ్యు లు ఉన్నారని.. మరో లక్ష మందికి సభ్యత్వం ఇస్తున్నామన్నారు.తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల నిరంతర, నాణ్యమైన కరెంట్ ఇస్తున్నామని.. ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో 24 గంటల కరెంట్ లేదన్నారు. తెలంగాణలో అభివృద్ధి ప్రతిపక్ష పార్టీలకు కనిపించడం లేదని.. వారు కళ్లున్నా చూడలేని కబోదులుగా మారారన్నారు. 75 ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో గొల్లకుర్మలను ఏ ప్రభుత్వమూ పట్టించుకోలేదని.. కానీ సీఎం కేసీఆర్ గొల్లకుర్మల కోసం అనేక పథకాలు తీసుకొచ్చారన్నారు.
తెలంగాణ రాకముందు సిద్దిపేటలో ఎకరానికి ధర రూ.3 లక్షలు ఉంటే ఇపుడు కోటి రూపాయలకు పైగా ఉందన్నారు. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ మత్స్య సొసైటీ, గొర్రెల పంపిణీలో సభ్యత్వం ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆలోచించినట్లు తెలిపారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం తప్పా.. ఎక్కడా విశ్వవిద్యాలయం లేదన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాతనే నాలుగు పశు వైద్య కళాశాలలు వచ్చాయన్నారు. హైదరాబాద్ వెళ్లే అవసరం లేకుండా ప్రతి విద్యాసంస్థ ఇక్కడ ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు. అనంతరం లబ్ధిదారులకు నూతన మత్స్య సొసైటీ ధ్రువీకరణ పత్రాలు, మత్స్యకారుల సభ్యత్వ గుర్తింపు కార్డులను మంత్రులు అందజేశారు. ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అధర్ సిన్హా, సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఐదేండ్లు ప్రధానిగా పనిచేసిన దివంగత పీవీకి కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో ఘాట్ ఏర్పాటు కోసం కనీసం స్థలం ఇవ్వలేదు. కానీ, సీఎం కేసీఆర్ హైదరాబాద్ నడిబొడ్డున పీవీ ఘాట్ ఏర్పాటు చేసి వెటర్నరీ విశ్వవిద్యాలయానికి ఆయన పేరు పెట్టి గౌరవించారు.
– మంత్రి హరీశ్రావు
మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు పథకాలను కేంద్రం కాపీ కొట్టింది. తెలంగాణ పథకాలు, కార్యక్రమాలు, పాలసీలను మెచ్చి ఢిల్లీలో అవార్డులు ఇస్తున్న బీజేపీ మంత్రులు, గల్లీకి వచ్చి తిడుతున్నారు.
– మంత్రులు హరీశ్రావు, తలసాని