సిద్దిపేటరూరల్, సెప్టెంబర్ 30: ఆపదలో ఉన్న మహిళలు, వేధింపులకు గురైన చిన్నారులకు భరోసా, సఖీ కేంద్రాలు అండగా నిలుస్తున్నాయని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేట రూరల్ పోలీస్స్టేషన్ ఆవరణలో సీఎస్ఆర్ నిధులు రూ.1.18 కోట్లతో గౌర పెట్రో కెమికల్ ప్రైవేట్ లిమిటెడ్ సికింద్రాబాద్ యాజమాన్యం చొరవతో నిర్మించిన భరోసా, సఖీ కేంద్రాలను శనివారం తెలంగాణ డీజీపీ అంజనీకుమార్, అడిషనల్ డీజీపీ శిఖాగోయల్, డీఐజీ రమేశ్నాయుడు, సిద్దిపేట సీపీ శ్వేత, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, జడ్పీ చైర్ పర్సన్ రోజాశర్మ, మున్సిపల్ చైర్పర్సన్ మంజులారాజనర్సుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సిద్దిపేటలో ఆధునిక టెక్నాలజీతో భరోసా సెంటర్ నిర్మించినట్లు తెలిపారు. మహిళల సంరక్షణ కోసం సఖీ, భరోసా, వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లతో పాటు బాల రక్ష భవన్ కేంద్రాలు ఒకేచోట నిర్మించినట్లు తెలిపారు.బాధిత మహిళలకు వ్యక్తిగత గోప్యతతో పాటు కౌన్సెలింగ్, న్యాయ సహాయంతో కూడిన రక్షణ లభిస్తుందని, ఇలాంటి రక్షణ వ్యవస్థ ఉందని అందరికీ తెలిసిలా చర్యలు తీసుకోవాలని సీపీని కోరారు.
ఈ భవనాన్ని మహిళా సంరక్షణ సముదాయంగా వినియోగించుకోవాలని సూచించారు. బాధితులు ఎవరైనా ఇక్కడికి వచ్చి న్యాయం పొందవచ్చన్నారు. బాధితులకు ఇక్కడే వైద్యం, న్యాయం, రక్షణ లభిస్తుందన్నారు. అఘాయిత్యాలకు గురైన చిన్నారులు, లైంగిక వేధింపులు, దాడులకు గురైన మహిళలకు ఈ భవనాలు సంరక్షణతో కూడిన భద్రతను కల్పిస్తాయని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా పోలీస్శాఖ పనిచేస్తోందని, భరోసా సెంటర్లోని లైబ్రరీకి పుస్తకాలు అందించిన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ విద్యార్థిని ఆకర్షణను ప్రత్యేకంగా అభినందించారు. డీజీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ సిద్దిపేటలో భరోసా, సఖీ కేంద్రాలను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. 2014లో తెలంగాణ సీఎం కేసీఆర్ మానసపుత్రిక అయిన భరోసా,సఖీ కేంద్రాల ఏర్పాటు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, జిల్లాలోని మహిళల రక్షణకోసం మరింత మెరుగైన సేవలు అందించడానికి ఈ సెంటర్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
సిద్దిపేట జిల్లా దేశానికే రోల్మోడల్గా నిలుస్తోందన్నారు. మహిళా భద్రతకోసం తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. అడిషనల్ డీజీపీ శిఖాగోయల్ మాట్లాడుతూ మహిళల భద్రత కోసం తెలంగాణ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన షీటీమ్స్ సమర్థవంతంగా పనిచేస్తున్నాయని, తెలంగాణలో మాత్రమే ప్రతి పోలీస్స్టేషన్లో మహిళా విభాగం ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం చిన్నారులు, మహిళల రక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని, మహిళల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రతి పోలీస్స్టేషన్లో ప్రత్యేక విభాగం నిరంతరం పనిచేస్తోందని తెలిపారు. భరోసా సెంటర్లో ఏర్పాటు చేసిన లైబ్రరీకి 752 పుస్తకాలు అందించిన సతీశ్ను మంత్రి, పోలీస్ అధికారులు అభినందించారు. తెలంగాణలో ఇది ఎనిమిదో లైబ్రరీ అని సతీశ్ తెలిపారు. కార్యక్రమంలో గౌర పెట్రో కెమికల్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ గౌర శ్రీనివాస్, సుబ్బరాజు, నాగరాజు, అడిషనల్ డీసీపీలు శ్రీనివాస్, మల్లారెడ్డి, సిద్దిపేట ఏసీపీ కేతిరెడ్డి సురేందర్రెడ్డి, మహిళా పోలీస్స్టేషన్ సీఐ దుర్గా, సిద్దిపేట రూరల్ ఎస్సై కిరణ్రెడ్డి, భరోసా సెంటర్ సిబ్బంది, పోలీస్ అధికారులు, సుడా చైర్మన్ రవీందర్రెడ్డి, జడ్పీటీసీ శ్రీహరిగౌడ్, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.